
తేనెటీగల దాడి.. 23 మందికి గాయాలు
జీలుగుపుట్టులో రచ్చబండ వద్ద
భోజనాలు చేస్తుండగా ఘటన
పెదబయలు: మండలంలోని రూడకోట పంచాయతీ జీలుగులపుట్టులో తేనెటీగలు దాడి చేసి, 23 మందిని గాయపరిచాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రూడకోట పంచాయతీ కేంద్రంలో గంగమ్మతల్లి ఉత్సవాలు రెండు రోజుల నుంచి జరుగుతున్నాయి. మంగళవారం జీలుగులపుట్టు, సరియాపల్లి గ్రామాలకు చెందిన 30 మంది ఆలయానికి వెళ్లి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జీలుగులపుట్టు గ్రామానికి తిరిగి వచ్చి రచ్చబండ వద్ద వంట చేసుకుని, మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అక్కడ చెట్టుపై ఉన్న తేనెపట్టు నుంచి ఒక్కసారిగా వందల సంఖ్యలో తేనెటీగలు వారిపై దాడి చేశా యి. ఆహార పదార్థాలు వదిలి వారు పరుగులు తీశారు. ఈ ఘటనలో జీలుగులపుట్టు, సరియాపల్లి గ్రామాలకు చెందిన 23 మంది గాయపడ్డారు. లకే తౌడుబాబు, లకే అనురాధ, పార్వతమ్మ,నాగమ్మ,చిన్నయ్య, ఝాన్సీరాణి, పుష్పవేణి, రవణమ్మ, సుందర్రావు, బుల్లమ్మ, కామమ్మ, ముత్యాలమ్మ, పాతూని పెద్దపులి, పాతూని అప్పారావు, లక్ష్మి, బుల్లమ్మలతో పాటు మరో ఏడుగురు గాయపడినవారిలో ఉన్నారు. వీరిలో లకే తౌడుబాబు, లకే సుందరి, ముత్యాలమ్మ, కామమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను అంబులెన్స్లో రూడకోట పీహెచ్సీకి తరలించారు. పీహెచ్సీలో వైద్యాధికారులు సత్యారావు,కిశోర్, వైద్య సిబ్బంది వారికి చికిత్స చేశారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

తేనెటీగల దాడి.. 23 మందికి గాయాలు