● కలెక్టర్ దినేష్కుమార్
సాక్షి,పాడేరు: అనంతగిరి మండలం సరియా జలపాతంలో ఇద్దరు పర్యాటకులు గల్లంతు బాధాకరమని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగంతో బందోబస్తు చేపడతామని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతగిరి.అరకులోయ, జి.మాడుగుల, చింతపల్లి, పాడేరు, జీకేవీధి, పెదబయలు, డుంబ్రిగుడ, రంపచోడవరం,చింతూరు డివిజన్ల పరిధిలోని అన్ని జలపాతాల వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్చరిక బోర్డులను పరిశీలించిన తరువాతనే జలపాతాల్లో స్నానాలకు దిగాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వర్షాలతో జలపాతాల వద్ద ప్రవాహం అఽధికంగా ఉండడంతో పర్యాటకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని పోలీసు అధికారులు జలపాతాల వద్ద పోలీసు సిబ్బందిని విధుల్లో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.


