
కుష్టు నివారణే లక్ష్యం
మహారాణిపేట(విశాఖ) : జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(ఎల్సీడీసీ) సర్వే–24 పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలో 925 మంది ఆశ కార్యకర్తలు, 54 మంది ఎంఎల్హెచ్పీఎస్లు, 86 ఎంపీహెచ్ఎస్లు, 72 మెడికల్ ఆఫీసర్లు సర్వే కోసం పనిచేస్తున్నారు. రేవిడి, ఆర్.తాళ్లవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఎక్కువగా దృష్టి సారించారు. సర్వేలో భాగంగా బృందాలు గుర్తించిన కొత్త కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందించి దశల వారీగా కుష్టు వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యంగా పని చేస్తారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి వైద్యం అందిస్తే అంగవైకల్యం రాకుండా నిరోధించవచ్చని వైద్యులు అంటున్నారు. కుష్టు వ్యాధి సోకిన వ్యక్తి ముక్కు నుంచి ద్రవంతో దగ్గు లేదా స్పర్శ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
తగ్గుతున్న వ్యాధిగ్రస్తులు
రాను రాను ఈ వ్యాధి తగ్గుముఖం పడుతోంది. 2022లో 96 కేసులు నమోదు కాగా 2023లో 81 కేసులు నమోదయ్యాయి. 2021లో 104 కేసులు నమోదయ్యాయని కుష్టు నివారణాధికారి డాక్టర్ సత్యవాణి తెలిపారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారికి రెండు పద్ధతుల ద్వారా వైద్య సేవలందిస్తారు. శరీరంపై ఐదు మచ్చలున్న వారికి పాసివ్ బ్యాసిలరీ(పీబీ) విధానంలో ఆరు నెలలు పాటు చికిత్స అందిస్తారు. అలాగే ఐదు మచ్చలు పైబడి ఉన్న వారికి మల్టీ బ్యాసిలరీ (ఎంబీ) విధానంలో 12 నెలలు చికిత్స అందిస్తారు. దీనిలో భాగంగా నెలకు ఒక సారి ఆయా రోగుల ఇళ్లకు వెళ్లి వైద్య సిబ్బంది మందులు అందిస్తారు.
సర్వేలో గుర్తించిన రోగులకు సకాలంలో వైద్యం అందించడంతో పాటు ఆ వ్యాధిపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. వ్యాధిని సకాలంలో గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నివారించవచ్చు. 1987 తర్వాత నుంచి బహుళ ఔషధ చికిత్స(మల్టీ డ్రగ్ థెరఫీ) ద్వారా వ్యాధిని అరికడుతున్నారు. వ్యాధికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు.
ఆగస్టు 2 వరకు ఇంటింటా
ఎల్సీడీసీ సర్వే
వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా చికిత్స
వ్యాధి లక్షణాలు ఇవీ..
చర్మంపై స్పర్శలేని రాగి రంగు గల మచ్చలు
చెవులపై బొడిపెలు, కణితులు, నరాల తిమ్మిర్లు
మందమైన మెరిసే జిడ్డుగల చర్మం(చర్మం ఉబ్బెత్తుగా బత్తాయి తొక్కలాగా ఉండటం),
కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం
కనురెప్పలు మూతపడకపోవడం
చేతుల నుంచి వస్తువులు జారిపోవడం
అరచేతులు, అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం
తెలియకుండానే చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం
చేతివేళ్లు, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగ వైకల్యం రావడం
కాళ్లకు చెప్పులు జారిపోవడం
చల్లని, వేడి వస్తువులను గుర్తించలేకపోవడం
పాదాల మడమల్లో వాపు
ముప్పు దిబ్బడం, ముక్కు నుంచి రక్తం కారడం
సర్వేకు సహకరించాలి
కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత లేకుండా నివారణకు కృషి చేయాలి. గ్రామస్థాయిలో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆగస్టు 2వ తేదీ వరకు జిల్లాలో సర్వే జరుగుతుంది. వ్యాధి లక్షణాలు ఉన్న వారు వివరాలు అందించాలి. ఏమాత్రం అనుమానం ఉన్నా.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పూర్ణేంద్రబాబు, జిల్లా కుష్టు నివారణ అధికారి

కుష్టు నివారణే లక్ష్యం