‘పది’లో టాప్–5 లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. జిల్లా టాప్ ‘5’లో ఉండేలా చర్యలు చేపడుతున్నాం.. వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ కనబరుస్తున్నాం.. రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నామ ని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో ఎస్.రాజేశ్వర్ అన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: ఈ ఏడాది ఫలితాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
డీఈవో: గతంతో పోల్చితే మెరుగైన ఫలితాలు సా ధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. టీచర్ల కొరత ఉన్న చో ట స్మైల్ ఫౌండేషన్ ద్వారా గెస్ట్ టీచర్లను నియమించాం. అలాగే సర్దుబాటు ద్వారా అవసరం ఉన్నచోట ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థులకు ఇప్పటికే కరదీపికలను పంపిణీ చేపట్టి రివిజన్ చేస్తున్నాం. ఏ,బీ,సీ గ్రూపులుగా ప్రత్యేక తరగతులు కొనసాగిస్తున్నాం.
సాక్షి: విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారా..?
డీఈవో: ప్రత్యేక తరగతుల నేపథ్యంలో విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ అందించేందుకు చర్యలు చేపట్టాం. ఉపాధ్యాయుల అకౌంట్లలో డబ్బులు కూడా జమ చేశాం. పరీక్షల దృష్ట్యా విద్యార్థులను మానసికంగా దృఢంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాం.
సాక్షి: కాపీయింగ్ జరుగుతుందనే ఆరోపణలున్నా యి.. నిరోధించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
డీఈవో: ఎట్టి పరిస్థితుల్లో కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. టీచర్లు ఎవరూ విద్యార్థులను కాపీయింగ్కు ప్రోత్సహించవద్దు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ఏడాదంతా కష్టపడి చదువు చెప్పినప్పుడు కాపీయింగ్ ప్రోత్సహించడం సరికాదు.
సాక్షి: గతేడాది ఫలితాలు ఎలా ఉన్నాయి.. ఈసారి ఎన్నో స్థానంలో ఉండొచ్చు..?
డీఈవో: గతేడాది 97.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రస్థాయిలో ఈ సారి జిల్లా ఐదు లోపలే ఉండేలా చూస్తున్నాం.
సాక్షి: ఈ సారి ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారు.. ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?
డీఈవో: మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 10,888 మంది హాజరుకానున్నారు. 52 కేంద్రాలు ఏర్పా టు చేశాం.
సాక్షి: నిర్వహణ కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
డీఈవో: పరీక్షల నిర్వహణ కోసం 52 మంది చొప్పు న సీఎస్, డీవోలను, 13 మంది కస్టోడియన్లను, ముగ్గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారుల ను నియమించాం. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన త్వరలోనే సమావేశం ఉంటుంది. ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సలహాలు ఏమిటి.?
డీఈఓ: పదో తరగతి పరీక్షలకు ఇంకా 20 రోజులు ఉంది. ఈ సమయాన్ని విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలి. మాస్ కాపీయింగ్పై ఆధారపడొద్దు. శుభకార్యాలు, ఇతర వాటికి దూరంగా ఉండాలి. సెల్ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియాను వినియోగించవద్దు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు.
అదనపు కలెక్టర్,
డీఈవో రాజేశ్వర్
‘పది’లో టాప్–5 లక్ష్యం


