
అంతా అతలాకుతలం
● గాలివాన బీభత్సం.. విద్యుత్శాఖకు తీవ్ర నష్టం ● జిల్లాలో విరిగిపడ్డ 236 స్తంభాలు ● ఎగిరిపడిన రేకులు, నేలకూలిన వృక్షాలు ● 18 గంటలు నిలిచిన కరెంట్ సరఫరా ● ఇబ్బందులు పడ్డ జనం
ఆదిలాబాద్టౌన్: గాలివాన బీభత్సం జిల్లాను అతలాకుతలం చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈదురుగాలులతో మొదలైన భారీ వర్షం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఉరుములు, పిడుగులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలో 236 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆరు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. కరెంట్ తీగలు తెగిపడడంతో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 18 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా జాగరణ తప్పని పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారులు వర్షం తగ్గిన తర్వాత మరమ్మతు చర్యలు చేపట్టినప్పటికీ విద్యుత్ సరఫరా జరగలేదు. అర్ధరాత్రి 12 గంటలకు కొన్నిచోట్ల సరఫరా అయినప్పటికీ, గంటలోపే మళ్లీ నిలిచిపోయింది. ఈ కారణంగా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్ పడింది.
విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం
ఆదిలాబాద్ అర్బన్తో పాటు ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనథ్ తదితర మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 236 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపడినట్లు ఆ శాఖ అధికారులు వెల్ల డించారు. సుమారు రూ.కోటి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఉట్నూర్లో నాలుగు, ఇచ్చోడలో రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. జైనథ్ మండలంలో 125విద్యుత్స్తంభాలు నేలకొరిగాయి. చాలా చోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. భీంపూర్ మండలంలోని అర్లి(టి) నుంచి వడూర్ వెళ్లే రహదారిలో 17 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. 33కేవీ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు మంగళవారం మధ్యాహ్నం వరకు 11కేవీ ద్వారా సరఫరా పునరుద్ధరించారు. ప్రస్తుతం తాత్కాలికంగా సరఫరా చేస్తున్నారు. చాలాచోట్ల స్తంభాలను ఇంకా సరిచేయాల్సి ఉంది. జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్కు వెళ్లే దారి లో 20 స్తంభాలు నేలకొరిగాయి. ఆ గ్రామంలో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఈదురుగా లులతో 32కేవీ సమస్యలు తలెత్తాయి. ఆదిలాబాద్ పట్టణంలో 10 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మావల మండలంలోని కేఆర్కే నుంచి బాలాజీనగర్కు వెళ్లే దారిలో ఎనిమిది స్తంభాలు పడిపోయాయి. దుర్గానగర్ దారిలో కరెంటు తీగలు తెగిపడ్డాయి. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో నీలగిరి చెట్లు పడిపోవడంతో పట్టణంలోని కై లాస్నగర్, మావల ఫీడర్, ఖానాపూర్ ఫీడర్ సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇన్సులేటర్లు లాస్ఓవరై పగిలిపోయాయి. పలుచోట్ల పిడుగులు పడడంతో విద్యుత్ సమస్య తలెత్తింది. ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ సబ్స్టేషన్ నుంచి ఇతర మండలాలకు సరఫరా చేసే 133 కేవీ ఇన్సులేటర్లు చెడిపోవడంతో అంతరాయం ఏర్పడింది. అయితే ఇంకా ఎక్కడైనా విద్యుత్ సమస్య ఉంటే 1912 టోల్ఫ్రీ, 8712481799కు సమాచారం ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్ తెలిపారు. ఇదిలా ఉండగా పలు గ్రామాల్లో పూరిగుడిసెల పైకప్పు, రేకుల షెడ్లు గాలి బీభత్సానికి ఎగిరిపడ్డాయి. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ రేకులు, ఫ్లెక్సీలు నేలవాలాయి. ఎగ్జిబిషన్ ఆనవాళ్లు లేకుండాపోయాయి.
రోడ్లపై చెట్ల తొలగింపు పనులు..
కైలాస్నగర్: జిల్లాకేంద్రంలో పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు బల్దియా సిబ్బంది సహకారంతో వాటి తొలగింపు పనులు చేపట్టారు. బొక్కల్గూడలో ఓ ఇంటికప్పు ఎగిరిపడగా, మహాలక్ష్మివాడలో అంగన్వాడీ టీచర్ కిరణ్ సింగ్ ఇంటిపైకప్పు రేకులు 250 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి.
ఇంద్రవెల్లి: మండలంలోని ఏమాయికుంట సమీపంలోని విజయలక్ష్మీ జిన్నింగ్ మిల్లు షెడ్డు రేకులు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. తుమ్మగూడ గ్రామానికి చెందిన కాత్లే సంగీత కాలుపై రేకులు పడడంతో గాయమైంది.
బోథ్: విద్యుత్ వైర్లు పడి బోథ్ మండలం మర్లపెల్లి గ్రామానికి చెందిన సిరిసె దీపేందర్కు చెందిన గేదె మృతి చెందింది.