రాజకీయ ‘క్రీడ’ | - | Sakshi
Sakshi News home page

రాజకీయ ‘క్రీడ’

Jun 10 2025 3:20 AM | Updated on Jun 10 2025 3:20 AM

రాజకీయ ‘క్రీడ’

రాజకీయ ‘క్రీడ’

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్‌వో) పోస్టుపై రాజకీయం నెలకొంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత క్రీడా రంగానికి సంబంధించిన రెగ్యులర్‌ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి విధుల్లో చేరేందుకు జిల్లాకు చేరుకోగా, బాధ్యతలు తీసుకోవద్దంటూ ఆ శాఖకు సంబంధించిన రాష్ట్ర ఉన్నతాధికారులు హుకుం జారీ చేయడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జిల్లాలో క్రీడా రంగ అభివృద్ధికి పాటుపడాల్సిన కీలకమైన అధికారిని విధుల్లో చేరకుండా కొంత మంది రాజకీయం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ సంగతి..

ఇటీవల వరకు డీవైఎస్‌వోగా పనిచేసిన వెంకటేశ్వర్లు గతనెల 31న ఉద్యోగ విరమణ పొందారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో యువజన సర్వీసుల శాఖ అధికారిగా ఉన్న ఆయనను ప్రభుత్వం డీవైఎస్‌వోగా నియమించింది. దీంతో ఎలాంటి క్రీడా పరిజ్ఞానం లేకుండా ఎనిమిదేళ్లుగా ఆయన విధులు నిర్వహించారు. ఇదిలా ఉండగా, ఆయన ఉద్యోగ విరమణతో జిల్లా కలెక్టర్‌ తాత్కాలికంగా ఓ సీనియర్‌ పీడీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న రెండు రోజులకే ప్రభుత్వం రెగ్యులర్‌ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15ఏళ్ల తర్వాత క్రీడా పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అధికారిగా రాబోతుండడంతో జిల్లా క్రీడా రంగానికి మంచిరోజులు రానున్నాయని క్రీడాకారులతో పాటు తల్లిదండ్రులు సంబరపడ్డారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొంత మంది కుల సంఘాల నాయకులు, మరికొంత మంది పీడీలు, రాజకీయ నాయకులు ఆయనను విధుల్లో చేరకుండా రాష్ట్రస్థాయిలో పైరవీలు చేసి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రెగ్యులర్‌ అధికారి వచ్చిన తర్వాత కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులు బాధ్యతలు తీసుకోవద్దని, హోల్డ్‌లో ఉండాలని, తిరిగి రావాలని మౌఖికంగా ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పలు శాఖల్లో ఇన్‌చార్జి అధికారులతోనే కొనసాగుతుంది. దీంతో ఆయా శాఖల్లో పర్యవేక్షణ లోపించి పాలన పూర్తిగా గాడి తప్పింది.

అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటి..

జిల్లాలో ఉన్న క్రీడా పాఠశాలలో కోచ్‌లు లేకపోవడంతో క్రీడా పాఠశాల విద్యార్థులు నష్టపోతున్నా రు. బాస్కెట్‌ బాల్‌ కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉండడంతో పాటు ఉమ్మడి జిల్లా వాసి అయిన ప్రశాంత్‌ను జిల్లాకు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు క్రీడా పాఠశాలల్లో పనిచేసిన అనుభవంతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ సలహాదారుగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని జిల్లా అధికారిగా నియమించడంతో క్రీడా పాఠశాలకు మంచిరోజులు రావడంతో పాటు జిల్లా క్రీడా రంగానికి మేలు జరుగుతుందని అంతా భావించారు. అయితే సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి డీవైఎస్‌వోగా బాధ్యతలు చేపడితే నిరంతర పర్యవేక్షణ ఉండి తమ ఆటలు సాగవనే ఉద్దేశంతో కొంత మంది పీడీలు రాజకీయంగా తమ పలుకుబడి ఉపయోగించి కుల సంఘం ద్వారా రాష్ట్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి సదరు అధికారిని విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్నట్లు చర్చ సాగుతుంది. అయితే ఈ రెగ్యులర్‌ అధికారిని విధుల్లో చేర్చుకుంటారా.. లేక ఇన్‌చార్జి అధికారితోనే క్రీడా పాఠశాలను ముందుకు తీసుకెళ్తారా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. కాగా, జిల్లాలో కొనసాగుతున్న క్రీడా పాఠశాలను తమ జిల్లాకు తరలించేందుకు కేబినెట్‌లో సీనియర్‌గా ఉన్న ఓ మంత్రి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికారిని రాకుండా అడ్డుపడుతున్నారనే చర్చ కూడా ఉంది. ఈ విషయమై డీవైఎస్‌వోగా వచ్చిన ప్రశాంత్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

జిల్లాకు వచ్చిన రెగ్యులర్‌ డీవైఎస్‌వో

విధుల్లో చేరకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి ?

వెనక్కి వెళ్లాలని హుకుం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement