
‘పచ్చడి’ మెతుకులు కరువేనా!
● నిరాశజనకంగా మామిడి పంట ● పెరుగనున్న ధరలు ● మంచిర్యాల జిల్లాలో 15,680 ఎకరాల్లో తోటలు
చెన్నూర్: మంచిర్యాల జిల్లాలో మామిడి కాయల కాపు నిరాశజనకంగా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా పూతకు తెగుళ్లు సోకడంతో పూత రాలిపోయి కాత నిలువలేదు. దీంతో దిగుబడి అమాంతం తగ్గింది. లక్షలాది రూపాయలతో తోటలను కౌలుకు తీసుకున్న రైతులు పెట్టిన పెట్టుబడి వచ్చేదెలా అని తలలు పట్టుకుంటున్నారు. మామిడి దిగుబడి తగ్గడంతో ధరలు రెండింతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు ‘పచ్చడి’ మెతుకులకు సైతం దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి.
15,680 ఎకరాల విస్తీర్ణంలో..
మంచిర్యాల జిల్లా మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లా మామిడికి హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో 6554 మంది రైతులు ఉండగా 15,680 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని బెల్లంపల్లి, నెన్నల, భీమారం, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్, లక్షెట్టిపేట, తాండూర్, దండెపల్లి మండలాలలో మామిడి తోటలు ఉన్నాయి. పది మండలాలలో మామిడి తోటలు ఉన్నప్పటికీ అత్యధికంగా తోటల విస్తీర్ణం బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నల, తాండూర్, చెన్నూర్ నియోజవర్గంలోని భీమారం, జైపూర్, చెన్నూర్ మండలాలలో ఉన్నాయి. జిల్లాకు చెందిన రైతులు దసరి, బంగెనపల్లి, పెద్ద రసాలు, హిమన్పసందు వంటి మేలైన మామిడి రకాలను మహారాష్ట్రలోని నాగాపూర్, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రంగా ఉండడంతో పక్క రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే అవకాశాలు లేవని మామిడి వ్యాపారులు పేర్కొంటున్నారు.
ధరలు పెరిగే అవకాశం..!
జిల్లా వ్యాప్తంగా మామిడి కాయల దిగుబడులు తగ్గాయి. ఇందులో తినే మామిడి 20శాతం దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉండగా, పచ్చడి మామిడి 10శాతం దిగుబడి కూడా లేదు. దీంతో పచ్చడి మామిడి కాయలు కరువయ్యే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పచ్చడి మామిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది పచ్చడి మామిడి వంద కాయలకు రూ.150 నుంచి రూ.200 పలికింది. ఈ ఏడాది వంద పచ్చడి మామిడి కాయలకు రూ. 250 నుంచి రూ.300 పలుకుతుందని పచ్చడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు కష్టమే..
మామిడి ధరలు పెరిగితే పేదలు మామిడి పండ్లు తినలన్నా, పచ్చడి పెట్టాలన్నా కష్టమే. ఈ ఏడాది మామిడి తక్కువ కాచింది. ఇప్పుడే ధరలు మండుతున్నాయి. రానున్న రోజులలో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. – బొగె సారయ్య, చెన్నూర్
దిగుబడి తగ్గింది..
ఈ ఏడాది మామిడి కాయ నిలువలేదు. చెట్టుకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల కాయ దిగుబడి వచ్చేది. ఈ ఏడాది చెట్టుకు 10 నుంచి 20 కిలోల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదు. కాయ దిగుబడి తక్కువగా ఉండడంతో మామిడి కాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. – నాయిని తిరుపతి, వ్యాపారి

‘పచ్చడి’ మెతుకులు కరువేనా!

‘పచ్చడి’ మెతుకులు కరువేనా!