world cup football tournment
-
మరో విజయం సాధిస్తే...
వెల్లింగ్టన్: వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు అర్హత సాధించేందుకు న్యూజిలాండ్, న్యూ కాలడోనియా జట్లు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఓసియానియా జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. ఈనెల 24న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్లో గెలిచిన జట్టు 2026 ప్రపంచకప్ టోర్నీ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకుంటుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ 7–0 గోల్స్ తేడాతో ఫిజీ జట్టుపై గెలుపొందగా... న్యూ కాలడోనియా జట్టు 3–0తో తాహితి జట్టును ఓడించింది. ఫిజీ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ తరఫున క్రిస్టోఫర్ వుడ్ (6వ, 56వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. సర్ప్రీత్ సింగ్ (16వ నిమిషంలో), టైలర్ గ్రాంట్ బిండన్ (23వ నిమిషంలో), టిమోతీ జాన్ పేన్ (32వ నిమిషంలో), బార్బరూసెస్ (73వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తాహితి జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూ కాలడోనియా తరఫున జార్జెస్ గోప్ ఫెనెపెజ్ (50వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... లూయిస్ వాయా (90+1వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. న్యూజిలాండ్ జట్టు ఇప్పటికి రెండుసార్లు (1982లో, 2010లో) ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో పోటీపడింది. మరోవైపు న్యూ కాలడోనియా జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేదు. -
హమ్మయ్య.. సమ్మె ఆగింది!
సావో పాలో: ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ నిర్వాహకులు ఇప్పుడు ఇలాగే ఫీలవుతున్నారు. ప్రారంభ వేడుకలతో పాటు ఆరంభ మ్యాచ్ కూడా జరిగే ప్రధాన స్టేడియానికి రవాణా సదుపాయం కలిగించే సావో పాలో సబ్వే కార్మికులు గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో అభిమానులను అక్కడికి ఎలా చేర్చాలనే దానిపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. అయితే తమ సమ్మె కారణంగా దేశానికి చెడ్డ పేరు వస్తుందనుకున్నారో.. ఏమో కానీ బుధవారం రాత్రి నుంచి తమ ఆందోళనను విరమించుకున్నారు. జీతాల పెంపు కోరుతూ చేస్తున్న ఈ సమ్మె పట్ల 15 వందల మంది సబ్వే కార్మికులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి సరైందని నమ్ముతున్నట్టు యూనియన్ అధ్యక్షుడు అల్టినో ప్రెజర్స్ పేర్కొన్నారు. అయితే పూర్తిగా తాము సమ్మెకు దూరం కాలేదని.. ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా తిరిగి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రియో ఎయిర్పోర్ట్ సిబ్బంది సమ్మె రియో డి జనీరో: ఫుట్బాల్ ప్రపంచకప్ ప్రారంభమైన గురువారం నుంచి ఒక రోజు పాటు రియో విమానాశ్రయ సిబ్బంది పాక్షిక సమ్మెకు దిగారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి 70 శాతం మంది విధుల్లో ఉండగా మిగిలిన వారు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రపంచకప్ బోనస్, మంచి వాతావరణ పరిస్థితులను కల్పించడం, 12 శాతం జీతాల పెంపును వీరు డిమాండ్ చేస్తున్నారు.