womens reservations
-
నారీ శక్తికి పట్టం కట్టేందుకే!
న్యూఢిల్లీ: చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కోసం మహిళల దశాబ్దాల ఎదురుచూపులకు అతి త్వరలో తెర పడనుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేలా నారీ శక్తి వందన్ అధినియమ్కు రాజ్యాంగ సవరణ చేపట్టనున్నట్టు గుర్తు చేశారు. ఇందుకోసం గురువారం నుంచి పార్లమెంటు మూడు రోజుల పాటు సమావేశం కానుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన ‘నారీ శక్తి వందన్’సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల రూపంలో ఈ శతాబ్దిలోకెల్లా అతి ముఖ్యమైన నిర్ణయాన్ని భారత్ అతి త్వరలో తీసుకోబోతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దాన్ని నారీ శక్తికే అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మహిళా రిజర్వేషన్ల చట్టానికి రాజ్యాంగ సవరణ ద్వారా మన పార్లమెంటు కొత్త చరిత్ర సృష్టించనుంది. మనందరి జీవితకాలంలో దేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన నిర్ణయంగా ఇది మిగిలిపోనుంది. మహిళా సాధికారతకు నిదర్శనంగా, వారి శక్తియుక్తులకు నిజమైన నివాళిగా నిలవనుంది. భారత్లో స్త్రీ పురుష సమతావాదం, సామాజిక న్యాయం కేవలం నినాదాలు కావని, రోజువారీ పని సంస్కృతి మొదలుకునిఅత్యున్నత నిర్ణయ ప్రక్రియ దాకా అన్నింట్లోనూ అవి విడదీయలేని భాగమని నిరూపించనుంది. భారత మహిళలు ఇప్పటికే పాలనలో అన్ని స్థాయిల్లోనూ నిర్ణాయక పాత్ర పోషిస్తూ తమను తాము నిరూపించుకుంటున్నారు. మున్ముందు మరిన్ని పెద్ద బాధ్యతలను సమర్థంగా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు’’అంటూ కొనియాడారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2027 జనగణనతో ముడిపడి ఉన్నాయి. దాంతో ప్రస్తుత చట్టం ప్రకారం వాటిని 2034 నుంచి మాత్రమే అమలు చేయడం వీలు పడుతుంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ స్థానాల సంఖ్యను 816కు పెంచనున్న నేపథ్యంలో 273 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. అత్యున్నత పదవుల్లో ‘ఆమె’ స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకుని రాజ్యాంగ పరిషత్తు దాకా మహిళలు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారని మోదీ గుర్తు చేశారు. స్వతంత్ర భారతానికి పునాదిరాయి వేయడంలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. ‘‘దేశ నిర్మాణంలో కీలకమైన పాత్రలు పోషించే అవకాశం దొరికిన ప్రతిసారీ అద్భుత పనితీరుతో భారత మహిళలు నిత్యం తమను తాము నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి దాకా అత్యున్నత బాధ్యతలను అద్భుతంగా నెరవేరుస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం చురుగ్గా ఉన్నచోట మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 14 లక్షల మందికి పైగా మహిళలు స్థానిక పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. 21 రాష్ట్రాల్లోని పంచాయతీల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతానికి చేరింది. ఈ ఘనతను చూసి ప్రపంచమే విస్తుపోతోంది’’అంటూ ప్రధాని హర్షం వెలిబుచ్చారు. అన్ని పార్టీలదీ అదే ఆకాంక్ష మహిళా రిజర్వేషన్ల బిల్లును 2023లో పార్లమెంటులో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదించాయని, 2029లోపే దాన్ని అమలు చేయాలని ఆకాంక్షించాయని మోదీ గుర్తు చేశారు. చర్చలు, పరస్పర సహకారం ద్వారా దీన్ని పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘దీనిపై దేశవ్యాప్తంగా మహిళల్లో పట్టరాని ఉత్సాహం కనిపిస్తోంది. లోక్సభ, అసెంబ్లీల్లో పెద్ద సంఖ్యలో కాలు పెట్టేందుకు వారు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఆ కలలకు ఇప్పుడిక రెక్కలు రానున్నాయి’’అని అభిప్రాయపడ్డారు.గృహస్తును కాకపోయినా సాదకబాధకాలు తెలుసు! మహిళల ఆర్థిక సాధికారత వల్ల కుటుంబాల్లో వారికి గౌరవాదరాలు పెరిగాయని మోదీ అభిప్రాయపడ్డారు. తాను గృహస్తును కాకపోయినా ఇంటిని నడపడంలోని సాదకబాధకాలు బాగా తెలుసని ఆయన చెప్పడంతో సమావేశంలో పాల్గొన్న మహిళలంతా పెద్దపెట్టున చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు! ‘‘ఇల్లు మొదలుకుని వాహనం దాకా కుటుంబ ఆస్తులన్నీ గతంలో ప్రధానంగా పురుషుల పేర్లతోనే ఉండేవి. పీఎం ఆవాస్ యోజన తదితరాలతో పరిస్థితి మారింది. ఆస్తులకు మహిళలు యజమానులవుతున్నారు. గత 11 ఏళ్లలో 3 కోట్ల మందికి పైగా మహిళలు ఇంటి యజమానులయ్యారు’’అని ప్రధాని అన్నారు. ‘‘గతంలో ఇళ్లలో తండ్రీ కొడుకులు వ్యాపారం గురించి చర్చించుకుంటుంటే మహిళలు వారికి చాయ్ బిస్కట్లు ఇచ్చేందుకే పరిమితమయ్యేవారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడంతో ఇప్పుడు పరిస్థితులు మారాయి. వ్యాపార నిర్ణయాలకు సంబంధించి అమ్మతో కూడా చర్చిద్దామని కొడుకులు తండ్రులతో అంటున్నారు’’అని చెప్పుకొచ్చారు. -
29 తర్వాత అఖిలపక్షం పెట్టండి
న్యూఢిల్లీ: ఎంతో కీలకమైన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఇతర అంశాలను తేల్చకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చర్చించడం వృథా ప్రయాసేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేసి వీటిపై చర్చ జరపాలని కోరారు. ఈ మేరకు ఖర్గే ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని హడావుడిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా, డీలిమిటేషన్ తీరును వివరించకుండానే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో సభలో అర్థవంతమైన చర్చ ఎలా సాధ్యమని భావిస్తున్నారంటూ ఖర్గే నిలదీశారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లో జాప్యంతో కోట్లాది మంది మహిళలకు అన్యాయం జరుగుతుందంటూ ఖర్గేకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. -
మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): త్వరలోనే నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 153 అసెంబ్లీ సీట్లకుగాను 50 సీట్లు అంటే 33 శాతం మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారని చెప్పారు. 33 శాతం సీట్లకు ఇంకో 10 సీట్లు కలిపి మొత్తం 60 సీట్లను ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.మంచిపనులు చేసి పేరు తెచ్చుకొనే మహిళలను గుర్తించి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాకుండా వారిని గెలిపించే పూచీ కూడా తనదేనన్నారు. సోమవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటడం ద్వారా వనమహోత్సం–2025 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటింటా రెండేసి మొక్కలు.. తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని.. దీన్ని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఈ కోవలోనే రాష్ట్రంలోని తల్లులంతా వారి పిల్లల పేరుతో ఇళ్ల ఆవరణలో రెండేసి మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలను పిల్లల్లాగే సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపడుతుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం.. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒకప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్టులను అదానీ, అంబానీలు మాత్రమే ఏర్పాటు చేసేవారని.. కానీ తాము మూడేసి మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులను మహిళా స్వయం సేవా సంఘాలకు అప్పగిస్తున్నామని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించామని.. ఆర్టిసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా ఆర్టిసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రొత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని సీఎం వివరించారు. హైటెక్ సిటీలో విప్రొ, మైక్రోసాప్ట్ లాంటి సంస్థలు ఉండేచోట 3.5 ఎకరాల స్థలాన్ని మహిళా స్వయం సేవా సంఘాలకు కేటాయించి వారు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించామని చెప్పారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 21 వేల కోట్ల మేర రుణాలు అందించామని తెలిపారు. చెట్లు పెంచితేనే సకాలంలో వర్షాలు: మంత్రి కొండా సురేఖ చెట్లను కాపాడితే అవి మనల్ని కాలుష్యం నుంచి కాపాడతాయని, జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడంలో దోహదపడతాయని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చెట్లను పెంచడం ద్వారానే వర్షాలు సకాలంలో కురుస్తాయని చెప్పారు. వనమహోత్సవం కార్యక్రమంలో 100 శాతం మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా అటవీశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను అధికారులు, ప్రజాప్రతినిదులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కొండా సురేఖ తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్, కమిషనర్ కర్ణన్, జిల్లా ఆదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, వీసీలు జానయ్య, రాజిరెడ్డి, ఉన్నతాదికారులు పాల్గొన్నారు. -
Lok Sabha Election 2024: మహిళలు 10 శాతమైనా లేరు!
ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 10 శాతం కంటే తక్కువే ఉంది! ఈసారి మహిళా అభ్యర్థులు కేవలం 797 మందేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అంటే 9.5 శాతం! తొలి విడతలో 1,618 మంది అభ్యర్థుల్లో మహిళలు 135 మంది. రెండో విడతలో 1,192 మంది అభ్యర్థుల్లో 100 మంది, మూడో విడతలో 1,352 మందిలో 123, నాలుగో విడతలో 1,717 మందిలో 170, 5వ విడతలో 695 మందిలో 82 మంది మహిళలున్నారు. పోలింగ్ జరగాల్సిన ఆరో విడతలో 869 మంది అభ్యర్థుల్లో 92 మంది మహిళలున్నారు. ఏడో విడతలో కూడా 904 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం 95 మందే. మహిళా రిజర్వేషన్ల అమలుపై పారీ్టల చిత్తశుద్ధి ఏపాటితో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక్కటి చాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి మొత్తం 8,337 మంది అభ్యర్థులు లోక్సభ బరిలో నిలిచారు. ఇంతమంది పోటీలో ఉండటం 1996 తర్వాత ఇదే తొలిసారి. 1996లో రికార్డు స్థాయిలో 13,952 మంది పోటీ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
భోపాల్: అటవీ శాఖ మినహా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సివిల్ సరీ్వసెస్(స్పెషల్ ప్రొవిజన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఉమెన్) రూల్స్–1997కు సవరణ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇకపై మహిళలకు 35 శాతం కోటా అమలవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పోలీసు శాఖతోపాటు ఇతర ప్రభుత్వ పోస్టుల్లో 35 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు టీచర్ల పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. -
వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు
భువనేశ్వర్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మహిళాసాధికారతకు ఇది తొలిమెట్టు అని పేర్కొన్నారు. ఆదివారం కేంద్రపాడాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో 21 లోక్సభ స్థానాలున్న ఒడిశాలో ఏడుగురు మహిళలకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఒడిశా నుంచి ముగ్గురు మహిళలే లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 147 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో 12 మంది మహిళలు ఉన్నారు. అయితే, పట్నాయక్ ప్రకటనను మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు వేసిన ఎత్తు గడగా కాంగ్రెస్, బీజేపీ కొట్టిపారేశాయి. సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే ప్రతిపాదనపై తమ పార్టీకి అభ్యంతరం లేదని, ప్రజల విశ్వసనీయత కోల్పోయిన నేపథ్యంలో బీజేడీ దీనిని చివరి అవకాశంగా ఉపయోగించుకుంటోందని విమర్శించారు. -
మహిళా రిజర్వేషన్పై ఒడిశా సీఎం తీర్మానం
భువనేశ్వర్: రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోరుతూ ఒడిశా సీఎం పట్నాయక్ మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మహిళా సాధికారత లేకుండా ఏ సమాజం, రాష్ట్రం, దేశం ముందుకు సాగవని ఆయన ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి సభ్యులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 1992లో తన తండ్రి, మాజీ సీఎం బిజూ పట్నాయక్ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారికి రాజకీయ నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. -
‘ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ పెంచాలి’
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో మహిళ సాధికారత కోసం కేంద్రం కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుకా కోరారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె బుధవారం సభలో విన్నవించుకున్నారు. కర్నూలు జిల్లాలో ట్రిపుల్ ఐటీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లోక్సభలో బుట్టా రేణుకా విజ్ఞప్తి చేశారు. అలాగే భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో మహిళలు అగ్రగామి సంస్థల్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న తీరును ప్రోత్సహిస్తూ..మహిళలకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ శాతం పెంచాలన్న అంశాన్ని బుట్టా రేణుక ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. -
ఆ గొంతుకలను విందాం!
మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం చట్టపరమైన అనివార్యత కూడా అవసరమే. ఈ దృష్టితోనే 1996లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రధానమంత్రిని ఒక ప్రశ్న అడగాలని తప్పక ఆశిస్తారు–ఎవరి సలహా ఆశించకుండా ఒక్క దెబ్బతో పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం తీసుకోగలిగిన ప్రధాని 21 ఏళ్ల క్రితం ప్రముఖ పార్టీలన్నింటి ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ ప్రతిపాదనను అమలులోకి తెచ్చే సాహసం చేయగలరా అన్నదే ఆ ప్రశ్న. ఈ సందర్భాన్ని యాదృచ్ఛికమని అందామా లేక మరేదైనా సంకేతమా? మొన్న, అంటే మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినం. సరిగ్గా ఈరోజే ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ యాదృచ్ఛికత మనల్ని రాజకీయాల్లో మహిళల స్థితిగతుల గురించి ఆలోచించేలా చేస్తుంది. నానాటికీ తీసికట్టు మొట్టమొదటగా చెప్పాలంటే వారి పరిస్థితి ఏమంత బాగా లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మొత్తం 4,823 మంది అభ్యర్థులు పోటీకి నిలబడగా వారిలో మహిళల సంఖ్య 445 మాత్రమే. అంటే కేవలం 9 శాతం. వెనుకబాటుతనం మూలంగా ఉత్తరప్రదేశ్లో ఇలా ఉందేమో అని మీరనుకుంటే, పంజాబ్ను తీసుకోండి. ఆ రాష్ట్రంలో పోటీకి నిలబడ్డ మొత్తం 1,145 మంది అభ్యర్థులలో 81 మంది, అంటే 7 శాతం మాత్రమే మహిళలు. ఇది అక్షరాస్యతతో ముడి వడిన సమస్య కూడా కాదు. ఎందుకంటే అక్షరాస్యతలో ఈ ఐదింటి కన్నా ముందున్న రాష్ట్రం గోవా. కానీ అక్కడ కూడా ఎన్నికల బరిలోకి దిగిన 251 మంది అభ్యర్థులలో 18 మంది, అంటే 7 శాతం మాత్రమే మహిళలు. రాజకీయ ఉద్యమాల్లో మహిళ భాగస్వామ్యానికి పేరుగాంచిన ఉత్తరాఖండ్లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేకపోవడం అంతకన్నా ఆందోళన కలిగించే విషయం. ఆ రాష్ట్రంలో 637 మంది అభ్యర్థులలో మహిళా అభ్యర్థులు కేవలం 56 మందే. అంటే 9 శాతం కన్నా తక్కువే. ఇంకా ఘోరమైన విష యమేమిటంటే, మహిళల నాయకత్వంలో సాగే మణిపురీ సమాజం ఈ విష యంలో మిగతా అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడి పోవడం. అక్కడి మహిళలు ఆస్తులకు యజమానులు. మార్కెట్లు నిర్వహిస్తారు. అఫ్స్పా వ్యతిరేక ఉద్య మంలోనూ వారిదే ముందు వరుస. కానీ మణిపూర్లో ఎన్నికల గోదాలోకి దిగిన 265 మంది అభ్యర్థులలో 11 మంది, అంటే 4 శాతం మాత్రమే మహి ళలు. ఇటు మాయావతి నాయకత్వం ఫలితంగానైనా ఉత్తరప్రదేశ్లో మహిళల భాగస్వామ్యంలో పెంపుదల జరగలేదు, అటు ఇరోం షర్మిలా ఎన్నికలలో అడుగుపెట్టినందుకైనా మణిపూర్లో మార్పు రాలేదు. ఇది ఆ ఐదు రాష్ట్రాల సమస్య కాదు రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం అనేది కేవలం ఈ 5 రాష్ట్రాలకో లేదా ఒక్క అభ్యర్థిత్వానికో మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అన్ని రాష్ట్రాలలోనూ మహిళా అభ్యర్థుల నిష్పత్తి దాదాపు ఇదే స్థాయిలో ఉంది. అభ్యర్థులలో మహిళల సంఖ్య ఏ మేరకు తక్కువగా ఉంటుందో, చివరకు ఎన్నికయ్యే ప్రతినిధులలోనూ వారి నిష్పత్తి అదే స్థాయిలో ఉంటుంది. అయితే పురుషులతో పోలిస్తే మహిళా అభ్యర్థులు విజయం సాధించే రేటు కాస్త ఎక్కువ కాబట్టి విధానసభ, లోక్సభల్లో వారి నిష్పత్తి వారికి లభించే అభ్యర్థిత్వం కన్నా కాస్త ఎక్కువే ఉంది. ప్రస్తుతం దేశంలోని అసెంబ్లీలన్నింటిలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో మహిళలు 9 శాతం ఉన్నారు. లోక్సభలో 12 శాతం మహిళా సభ్యులున్నారు. గడచిన ఇరవై ఏళ్లలో ఈ నిష్పత్తిలో కాస్త మెరుగుదల ఉన్నప్పటికీ మొత్తంగా చూసినపుడు పరిస్థితిలో పెద్ద మార్పు లేదనే చెప్పాలి. ఇరవై ఏళ్లుగా పంచాయితీ, ముని సిపల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ లభిస్తుండడం వల్ల వారి ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ దీని ప్రభావం విధానసభలలో తగినంత లేదు. కింది స్థాయిలో మహిళా నాయకత్వం రూపొందుతోంది. ఎన్నికల్లో మహిళలు పురు షులతో సమానంగా ఓట్లు వేస్తున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలూ ఇప్ప టికీ పురుషుల గుప్పిట్లోనే ఉన్నాయి. అసలు సమస్యేమిటంటే రాజకీయ పార్టీ లేవీ మహిళలకు టిక్కెట్లు ఇవ్వడానికి సుముఖంగా లేవు. అసలు వాస్తవాలు వేరు వాస్తవానికి కనిపిస్తున్న ఈ అంకెలకన్నా మహిళల గొంతులు మరీ బల హీనంగా ఉన్నాయి. మహిళా అభ్యర్థులలో, చట్టసభలకు ఎన్నికైన మహిళ లలో ఒక పెద్ద భాగం పలుకుబడి గల రాజకీయ కుటుంబాలకు చెందిన కూతుళ్లదీ, కోడళ్లదీ. వీరికి స్వతంత్రమైన అస్తిత్వం అంటూ ఉండదు. ఏదో ఒక అనివార్య పరిస్థితిలో సదరు కుటుంబం పురుషుడికి బదులుగా మహిళను ముందుకు తీసుకొచ్చి ఎన్నికలలో నిలబెడుతుంది. అయితే ఆ మహిళ పురుషుల అదుపాజ్ఞలలోనే పని చేస్తుంది. ఈ మహిళా ప్రతినిధులకు మహిళా సమస్యలతో గానీ, మహిళా ఉద్యమాలతో గానీ ఎలాంటి సంబంధం ఉండదు. అట్లాగే చట్టసభలకు ఎన్నికయ్యే మహిళలకు మంత్రివర్గాల్లో స్థానం లభించడం కూడా అంతంత మాత్రమే. ఇకపోతే మహిళలు మహిళా లేదా బాల సంక్షేమ శాఖలకు మాత్రమే మంత్రులుగా ఉంటారు తప్ప హోంశాఖ, ఆర్థిక శాఖ వంటి శక్తిమంతమైన మంత్రిత్వశాఖలు వారికి నేటికీ అందని ద్రాక్షలుగానే ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ రికార్డు చాలా అధ్వానంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటులకు ఎన్నికైన మహిళా సభ్యుల అంతర్జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ఉత్తర యూరప్ లోని స్కాండినేవియన్ దేశాలలో మహిళా పార్లమెంటేరియన్ల శాతం 40 కన్నా ఎక్కువగా ఉంది. బొలీవియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో కూడా వీరి శాతం 40 దాటింది. ఆఖరుకు మన పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో సైతం మహిళా ఎంపీల సంఖ్య 20 శాతంకన్నా ఎక్కువగా ఉంది. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, మహిళా ప్రాతినిధ్యం అనే అద్దంలో భారత ప్రజాస్వామ్యపు కురూపితనం స్పష్టంగానే కళ్లకు కడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కుదుపుతున్న వివక్ష మన చట్టసభలలో మహిళల గొంతు బలహీనంగా ఉండడం వల్ల దాని ప్రభావం కేవలం మహిళల పైనే కాకుండా మొత్తం ప్రజాస్వామ్యం పైనే పడు తోంది. ఎక్కువ మంది మహిళలు ఎన్నికైనంత మాత్రాన మన పార్లమెంటు, అసెంబ్లీలు ఎకాయెకిన గౌరవప్రదంగా, నిజాయితీకి నిలువుటద్దంలా మారి పోకపోవచ్చు కానీ, వారి ఉనికి వల్ల కొంత ప్రభావమైతే తప్పక పడుతుంది. పార్లమెంటు, విధానసభల సభ్యులు మహిళలు అయినప్పుడు మహిళలపై నిత్యం జరిగే హింస, లైంగిక వేధింపుల కేసుల విషయంలో పోలీసులపై, అధికారులపై తప్పక కొంత ఒత్తిడి పనిచేస్తుంది. కనీసం అధికార కారిడార్లలో ఊడలు దిగిన మగ పెత్తనం కొంతైనా తగ్గుతుంది. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట్లలో రేషన్ కొరత, నీటి కొరత లేదా మద్యపానం పెచ్చ రిల్లడం వంటి అంశాలపై చర్చ తప్పకుండా జరుగుతుంది. మరేది జరగక పోయినా, కనీసం సాధారణ మహిళలలో తాము తమ సమస్యను ఎంపీ, ఎమ్మెల్యే లేదా అధికారి దృష్టికి తీసుకెళ్లగలమనే ధైర్యమయితే పెరుగుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే, పార్లమెంటు, విధానసభల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య పెరిగేదెలా? ఇందుకోసం రాజకీయాల స్వభావ స్వరూ పాల్లో మార్పు రావాలన్నది తేటతెల్లం. నేతల సంస్కారంలో, పార్టీల సంస్కృ తిలో మార్పు రావాలి. అయితే ప్రపంచ దేశాల అనుభవాలను బట్టి చూస్తే ఇది మాత్రమే సరిపోదు. మహిళా రిజర్వేషన్ బిల్లును తేవాల్సిందే మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం చట్టపరమైన అనివార్యత కూడా అవసరమే. ఈ దృష్టితోనే 1996లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్సభ, విధానసభలలో 33 శాతం సీట్లు మహి ళలకు కేటాయించాలనే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అయితే ఈ బిల్లులో కొన్ని లోపాలున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం నేను కూడా ఈ లోపాలను ఎత్తి చూపుతూ రాశాను. వాటిని సవరించాలని డిమాండ్ చేశాను. అయితే గడచిన 21 ఏళ్లలో ఈ దిశగా జరిగిన ప్రగతి శూన్యం. ఈ బిల్లు ఎప్పుడు పార్లమెంటు ముందుకు వచ్చినా ఏదో ఒక నాటకానికి తెరలేపి లేదా ఏదో ఒక సాకు చెప్పి దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అనేక చర్చోపచర్చల తర్వాత 2010లో దీనిని రాజ్యసభలో ఆమోదించారు. కానీ ఆ తర్వాతి నాలుగేళ్లలో ఇది లోక్ సభలో చర్చకు నోచుకోలేదు. చివరకు లోక్సభ కాలవ్యవధి పూర్తి కావడంతో బిల్లు రద్దయిపోయింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలు ప్రధాన మంత్రిని ఒక ప్రశ్న అడగాలని తప్పక ఆశిస్తారు–ఎవరి సలహా ఆశించకుండా ఒక్క దెబ్బతో పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం తీసుకోగలిగిన ప్రధాని 21 ఏళ్ల క్రితం ప్రముఖ పార్టీలన్నింటి ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ ప్రతిపాదనను అమలులోకి తెచ్చే సాహసం చేయగలరా అన్నదే ఆ ప్రశ్న. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 , Twitter : @_YogendraYadav -
మహిళలు వంటింటికే!
ఆర్మూర్ : మహిళా రిజర్వేషన్లు అభాసుపాలవుతున్నాయి. పేరుకే మహిళా ప్రజాప్రతినిధులు.. వారి వెనక కుటుంబ సభ్యులే ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ గురువారం ఆర్మూర్లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన పట్టణం-మన ప్రణాళిక’ సమీక్ష సమావేశమే. మహిళా కౌన్సెలర్లకు బదులు వారి భర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంకంటే ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు తప్ప సమావేశంలో ఎవ్వరూ ఉండకూడదని సిబ్బంది పలుమార్లు ప్రకటించారు. అయినా మహిళా కౌన్సెలర్ల భర్తలు సమావేశ మందిరంనుంచి బయటికి వెళ్లలేదు. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమీక్ష సమావేశాన్ని అలాగే నిర్వహించారు. సమావేశానికి మహిళా కౌన్సెలర్లు బోన్ల సుజాత, లత జో శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. మిగతా మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలు జాగిర్దార్ శ్రీనివాస్, నర్మె నవీన్, పింజ వినోద్, వన్నెల్దేవి రాము, మాలిక్ బాబా, మరో కౌన్సిలర్ అన్న సుంకరి రంగన్న సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ భర్త సంజయ్ సింగ్ బబ్లూ సైతం సమావేశానికి వచ్చారు. సమావేశం ప్రారంభంలో టీఆర్ఎస్ నాయకులు, మరికొందరు మహిళా కౌన్సెలర్ల భర్తలు సైతం సమావేశానికి హాజరు కావడంతో టీడీపీ కౌన్సిలర్ జీవీ నర్సింహారెడ్డికి కుర్చీ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ కౌన్సెలర్కు కుర్చీ ఇవ్వని విధానం ఏంటని ప్రశ్నించడంతో కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలు బయటికి వెళ్లిపోయారు. అధికారులు సైతం ఇదేమీ పట్టించుకోలేదు.


