breaking news
UNESCO list
-
ఇలాంటివి కుతూహలం కలిగిస్తాయి: విజయ్ దేవరకొండ
తక్కువ టైంలో దక్కిన క్రేజ్ను నిలబెట్టుకుంటూ ప్యాన్ ఇండియన్ లెవల్కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్లో ఒక పోస్ట్ చేశాడు. ‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు. Have always been very intrigued by the historic past.. The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe — Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021 కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్సీ కమిటీ వోటింగ్ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా? -
ఆ టేస్టే వేరు!
నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ ప్యాలెస్లోని రాయల్ కిచెన్లో వందలాది మంది వంటగాళ్లు ఉండేవారు. వీరు దేశవిదేశాలకు చెందిన వంటలను వండి వడ్డించేవారు. ఫలక్నుమా, చౌమొహల్లా తదితర ప్యాలెస్లు ఎప్పుడూ విందులు వినోదాలతో సందడిగా ఉండేవి. ప్రపంచంలో ఎక్కడా లేని బిర్యానీ ఘుమఘుమలు నగరంలోనే ఉన్నాయి. నిజానికి కుతుబ్షాహీల కాలంలోనే బిర్యానీ సిటీకి పరిచయమైంది. సైనికులకు బలవర్థకం కోసం ఆహారంతో మాంసం కలిపి ఇచ్చేవారు. ఇదే కాలక్రమంలో బిర్యానీగా మారింది. సరికొత్త రుచులను సంతరించుకొని రూమీ బిర్యానీ, రా బిర్యానీ, దుల్హన్ బిర్యానీ, మహబూబీ బిర్యానీ, షెనా బిర్యానీ, ముర్గా బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ... ఇలా అనేక రుచులను ప్రపంచానికి పరిచయం చేసింది. బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, పాయా షోర్వా, రోటీ... ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాదీ రుచులెన్నో వాటి ఘనతలన్నీ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఇలాంటి వంటకాలెన్నో మన సొంతం. సంస్కృతీ సంప్రదాయాలను సమున్నతంగా ఆవిష్కరించే భాగ్యనగరం రుచులకు పెద్ద పీట వేసింది. కుతుబ్షాహీలు, ఆసఫ్జాహీల పాలనతో వెరైటీ వంటకాలకు అడ్డాగా మారింది. బిర్యానీ పర్షియన్ వంటకమే అయినప్పటికీ నగరమే ప్రపంచానికి దాని రుచిని చూపించింది. హలీమ్తో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించింది.ఓవైపు సంప్రదాయ వంటకాలవైభవాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఆధునిక రుచులను అందిపుచ్చుకుంది. అందుకే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కు మన సిటీ ఇటీవల అర్హత సాధించింది. ‘గ్యాస్ట్రానమీ’ కేటగిరీలో ఈ గుర్తింపు లభించింది. సాక్షి, సిటీబ్యూరో: వైవిధ్య భరితమైన సాంస్కృతిక నగరం హైదరాబాద్. వందల ఏళ్ల మహోన్నతమైన చారిత్రక, వారసత్వ పరిమళాలు ఇప్పటికీ గుబాళిస్తూనే ఉంటాయి. విభిన్న సాంస్కృతిక సమూహాలు, జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు హైదరాబాద్ సాంస్కృతిక వైభవానికి వన్నెలద్దాయి. పర్షియా నుంచి వచ్చిన కుతుబ్షాహీలు హైదరాబాద్ ప్రజలతో మమేకమయ్యారు. తెలుగు, పర్షియన్, ఉర్దూ భాషల మేళవింపుతో అద్భుతమైన దక్కనీ ఉర్దూ వాడకంలోకి వచ్చింది. ‘ఆదాబ్’, ‘తస్లీమ్’, ‘ఖుదా–హఫీజ్’ వంటి మర్యాదపూర్వకమైన పలకరింపులు ఈ నేల సొంతం. భాషలకు అతీతమైన భావసమైక్యత కూడా హైదరాబాద్ సొంతమే. ఆసఫ్ జాహీల పాలనలో ఈ సాంస్కృతిక వైవిధ్యం మరింత పరిమళభరితమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన ఆహారపదార్థాలు, వెరైటీ రుచులు కూడా హైదరాబాద్ ప్రత్యేకమే. పర్షియన్ వంటకమే అయినా ప్రపంచానికి బిర్యానీ రుచిని చూపించింది హైదరాబాదే. లండన్ వంటి నగరాల్లో ‘హైదరాబాద్ బిర్యానీ ’ రెస్టారెంట్లు వెలిశాయి. ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్, లుక్మీ వంటి స్నాక్స్ భాగ్యనగరం ప్రత్యేకం. వందల ఏళ్లుగా విభిన్న రుచులను ఒక వారసత్వ సంపదగా ప్రపంచానికి పరిచయం చేసిన హైదరాబాద్ నగరం ఈ ఏడాది యునెస్కో ప్రపంచంలోని 66 క్రియేటివ్ సిటీస్ జాబితాలో సమున్నతంగా చేరింది. రుమాలీ రోటీ చార్ రుమాలీ ... ఏక్ తలాహువ (వేయించిన మాంసం) లావో.. అని యువకులు ఎక్కువగా ఆర్డర్ ఇస్తారు. రాత్రి వేళ డిన్నర్లో దీన్ని ఎక్కువగా తింటారు. మైందా పిండితో తయారు చేసిన ఈ రొట్టె పరిమాణంలో రుమాల్ అంత ఉంటుంది. కాగితం కంటే కూడా పల్చగా ఉంటుంది. మైదాతో పాటు కోడిగుడ్లు, పాలు, వెన్నతో రొట్టెను తయార చేస్తారు. వీటిని నిప్పుల పెనంపైన కాల్చుతారు. ఒక్కోటి రూ. 10 ఉంటుంది. బిరియానీఘుమఘుమలు.... నవాబులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. మహబూబ్ అలీఖాన్ ప్యాలెస్లోని రాయల్ కిచెన్లో వందలాది మంది వంటవాళ్లు పని చేసేవారు. దేశవిదేశాలకు చెందిన అద్భుతమైన వంటలను వండి వడ్డించేవారు. ఫలక్నుమా, చౌమొహల్లా వంటి ప్యాలెస్లు నిత్యం విందులు, వినోదాలతో సందడిగా ఉండేవి. ప్రపంచంలో ఎక్కడా లేని బిర్యానీ ఘుమఘుమలు హైదరాబాద్లో ఉన్నాయి. నిజానికి కుతుబ్షాహీల కాలంలోనే బిర్యానీ వంటకం నగరానికి పరిచయమైంది. సైనికులకు బలవర్ధకమైన ఆహారం కోసం అన్నంతో పాటు మాంసం కలిపి అందజేసిన ఆహారం (పర్షియన్ సాంప్రదాయ వంటకం) కాలక్రమంలో బిర్యానీ అయింది. సరికొత్త రుచులను సంతరించుకుంది. రూమీ బిర్యానీ, రా బిర్యానీ, దుల్హన్ బిర్యానీ, మహబూబీ బిర్యానీ, షెనా బిర్యానీ, ముర్గా బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ వంటి అనేక రకాల బిర్యానీలను హైదరాబాద్ ప్రపంచానికి పరిచయం చేసింది. మహబూబ్ అలీ ప్యాలెస్లో కనీసం 650 రకాల ఆహారపదార్థాలను తయారు చేసేవారు. ఆయన మంచి భోజనప్రియుడు. దేశవిదేశాలకు చెందిన అతిథులు ప్రతి నిత్యం ఆయన ఇంట్లో భోజనం చేసేవారు. ఒక్క బిర్యానీలే కాకుండా ఖబూలీ, కిచిడీ చిరోంజీ, కిచిడి మాంగ్, ఆసఫియా దూపియాజా, దూపియాజా ఆస్మాన్జాహీ,భూనా గోష్, గుర్దా సీనా మొగులాయి,లివర్ కర్రీ, గోట్ టంగ్, గ్రీన్ చిల్లీస్ దోపియాజా, కోఫ్త, పొటాటో కుర్మ, శేమానీ కుర్మా, అచరీ గోష్, చికెన్ మొగులాయి, ఫిష్ కోఫ్త వంటి అనేక రకాల అద్భుతమైన మాంసాహార వంటలు చేసేవారు. కబాబ్స్ అనే వంటకం,పులావ్ లక్నో నుంచి వచ్చాయి. కుర్మ, బేషనీ, రోటీ మొగలులు పరిచయం చేసినవే. కిచిడి, తందూర్ పార్శీలు పరిచయం చేసిన ఆహారం. ఉస్మాన్ అలీఖాన్ సైతం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. రొట్టెలు .. లొట్టలేసుకుంటూ తినాల్సిందే నగరాన్ని పాలించిన నవాబుల ఆహారపు అలవాట్లు ఇక్కడి జీవనశైలిలో భాగమయ్యాయి. వందల ఏళ్ల క్రితమే రకరకాల రోటీలు ప్రజల ఆహారమయ్యాయి. ఇప్పటికీ పాతబస్తీవాసులకు రోటీతోనే దినచర్య మొదలవుతుంది. వందలాది కుటుంబాలు అనేక తరాలుగా రోటీలను తయారు చేసి ప్రజలకు అందజేస్తున్నాయి. తమ పూర్వీకుల నుంచి మొదలైన రోటీ తయారీని ఒక వారసత్వ వృత్తిగా కొనసాగిస్తున్నాయి. పాతబస్తీ కేంద్రంగా తయారయ్యే అనేక రకాల రోటీలు పోషకాల ఖజానాలు. ఒక్క పురానీహవేలీలోనే 30కు పైగా రోటీ తయారీ కేంద్రాలు ఉన్నాయి. నాన్, షీర్మాల్, కుల్చా, తందూరీ, రుమాలీ, వర్ఖీ రోటి, పరాట,పుల్క రోటీలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అనేక ప్రాంతాలకు ఈ రోటీలు ఎగుమతి అవుతున్నాయి. వాహ్.. హలీమ్... పసందైన రుచిని, చక్కటి ఆరోగ్యాన్ని, అద్భుతమైన శక్తిసామర్థ్యాలను అందజేసే హలీంకు అందరూ సలాం అంటూ వాలిపోతారు. ఒకప్పుడు ముస్లిం వంటకంగా మొదలైన హలీం ఇప్పుడు మతాలకతీతంగా, అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే ఆహార పదార్థంగా మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీలాగే నగర ప్రజల ఫేవరేట్ డిష్గా గుర్తింపు తెచ్చుకుంది. భౌగోళిక సూచీ (జియోగ్రాఫికల్ ఇండెక్స్) గుర్తింపును కూడా దక్కించుకుంది. ఏటా రూ.700 కోట్లకు పైగా అమ్మకాలతో దేశవిదేశాలకు చెందిన ఆహార ప్రియుల మనస్సు దోచుకుంటోంది మన ‘హైదరాబాద్ హలీం. ఆరో నిజాం హయాంలోనే పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించిన వంటకాలలో ఓ ప్రత్యేక వంటకం గురించి పర్షియా ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ఖానా (వంటగది) సిబ్బందిని పిలిపించి ఆ వంటకాన్ని సిద్ధం చేయించారు. అలా పర్షియాతో పరిచయమైన హలీం హైదరాబాద్ బిర్యానీలాగే ఇక్కడి వంటకమైంది. అక్కడి వంటకాల కంటే అద్భుతమైన రుచిని సంతరించుకుంది. ఇరాన్, ఇరాక్,తదితర దేశాల్లో తయారయ్యే హలీంలో గోధుమలు, మాంసం, పప్పు, ఉప్పు, నూనె మాత్రమే వినియోగిస్తారు. కానీ హైదరాబాద్ హలీంకు మొదట నెయ్యి తోడైంది. ఆ తరువాత కారం, షాజీరా, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వచ్చి చేరాయి. ఆ తరువాత అనేక రకాల మార్పులతో మరింత గొప్ప రుచిని సంతరించుకుంది. ఏడో నిజాం నాటికి హలీంకు అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. ఇప్పుడు దేశవిదేశాల్లోనే హైదరాబాద్ హలీం పేరు వింటే చాలు లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్, ఇండోనేషియా, అమెరికా, బ్రిటన్లలో ఎంతో డిమాండ్ ఉన్న వంటకం హైదరాబాద్ హలీం. నోరూరించే పాయా షోర్వా... చలికాలంలో చక్కటి ఆహారం పాయా షోర్వా. దాంతో పాటు జబాన్ (నాలుక), జబడా ( తలకాయకూర ) కూడా నోరూరిస్తాయి. వణికించే చలిలో ఉదయం, సాయంత్రం పాయా షోర్వా తాగేస్తే ఆ మజాయే వేరు. శరీరంలో వేడినిచ్చే వంటకం ఇది. పాయాతో పాటు, మరగ్ (మటన్ సూప్)లను ఔషధ దినుసులు, మసాలాలతో తయారు చేస్తారు. దీంతో పాటు ప్రధానంగా మేక పొట్టేలు కాళ్లు , నాలుక, తలకాయ ఇందుకోసం వినియోగిస్తారు. కుతుబ్ షాహీలు, ఆసీఫ్ జాహీల కాలంలో కూడా శుభకార్యాలు, ప్రభుత్వ వేడుకలు జరిగినప్పుడు పాయా, మరగ్లను వడ్డించే వారు. అ రోజుల్లో కేవలం వేడుకల్లో తయారు చేసే వంటకం ఇప్పుడు అన్ని సీజన్లలో లభిస్తుంది. కానీ చలికాలంలో దీని వినియోగం ఎక్కువ. పాయా షోర్వాలాగే నహారీ (మేకకాళ్లతో ) షోర్వా కూడా వందల ఏళ్లుగా హైదరాబాద్ వంటకమైంది. రోటీతో పాటు దీన్ని నంజుకొని తింటారు.ఉదయం తింటే సాయంత్రం వరకు ఆకలి వేయదు. ఇందులో పోషక గుణాలు ఎక్కువగా ఉంటాయి. చక్కటి బలవర్ధకమైన ఆహారం. నిజాం నవాబుల కాలంలో పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో ఉన్న హోటళ్లతోపాటు ఖిల్వత్, షేయరాన్ తదిర ప్రాంతాల్లో నహరీ షోర్వా హోటళ్లు వెలిసాయి. హోటల్లలో నహారీ షోర్వాతో పాటు కుల్చా రోటీ కూడా అందుబాటులోకి తెచ్చారు. వర్ఖీ పరాటా... మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీలతో కలిపి వర్ఖీ పరాటా తింటే ఆ రుచియే వేరు.పాలు, మైదాపిండి, గుడ్డు, పెరుగు. ఉప్పుల మిశ్రమాన్ని పెద్దసైజులో రొట్టెలాగా తÐయారు చేసి దీన్ని నెయ్యిలో వేయిస్తారు. ఎక్కువగా దీన్ని మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో తింటారు. పోషక విలువలు ఎక్కువగా ఉండడంతో ఎంతో మంది దీన్ని తినడానికి పాతబస్తీకి వస్తుంటారు. ఇది కేవలం పాలబస్తీలోనే లభిస్తుంది. దీని ధర రూ. 15 ఉంటుంది. తందూర్కీ రోటీ.. పాతబస్తీలో ఏ హోటల్కు వెళ్లినా ‘‘ ఏక్ తందూరీ మటన్ మసాలా లావో’’ అనే మాటలు యథాలాపంగా వినిపిస్తాయి. మైదాపిండి, పాలు, మొక్కజొన్న పిండి మిశ్రమంతో తందూరీ రొట్టె తయారు చేస్తారు. ఎక్కువ శాతం మధ్యాహ్న భోజనంలో తందూరీని మటన్, చికెన్తో లాగిస్తారు. ఒక్కోటి రూ. 12 ఉంది. ఇది కూడా మొగలాయి వంటకమే. నాన్రోటీ.. మైదాపిండి, గోధుమ పిండి, పెరుగు, పాలు మిశ్రామాన్ని నాలుగు పలకలగా తయారుచేసి 8 గంటల పాటు ఆరబెడుతారు. ఆ తరువాత ప్రత్యేకమైన బట్టీల్లో వేడిచేస్తారు. ఈ రోటీలకు నెయ్యిరాసుకొని తింటే రుచికరంగా ఉంటాయి. ఉదయాన్నే గొర్రె, మేక ఎముకలతో తయారు చేసిన నహారీ (సూప్)తో రోటీ నంజుకొని తినడం ఒక చారిత్రక ఆహారపు అలవాటు. మధ్యాహ్నం నాన్ రోటీలను కబాబ్లతో తింటే ఆ మాజాయే వేరు. ఒక్కోటి రూ.15 ఉంటుంది. నాన్ రోటీ లేకుండా ఎలాంటి శుభకార్యాలు జరగవంటే అతిశయోక్తి కాదు. పెళ్లిళ్లలో నాన్, చికెన్ఫ్రై తప్పకుండా ఉండాల్సిందే. రోజుకు వెయ్యికి పైగా నాన్లు విక్రయిస్తున్నట్లు 166 ఏళ్ల పురాతన నాన్ దుకాణ యజమానీ ఖాజీ అబ్దుల్ హమీద్ చెప్పారు. ఈ నాన్ రోటీల్లోనూ గుండ్రంగా ఉంటే షీర్మాల్ అనీ, చిన్న పరిమాణంలో ఉంటే కుల్చా అనీ అంటారు. -
చూసొద్దాం!అలనాటి వైభవం...
సెలవు రోజు వస్తే ఇంటిల్లిపాది దగ్గరలోని ఆహ్లాదకర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ఆసక్తి చూపుతారు. మరికాస్త ఆసక్తి, తీరిక ఉంటే రాష్ట్ర పరిధిలోని చారిత్రక కట్టడాలను, ప్రదేశాలను చూసి వస్తుంటారు. కాని అరుదుగా కొంతమంది మాత్రం యునెస్కో జాబితాలో ఉన్న ప్రాచీన కట్టడాలను చూసి రావడానికి, ఆ విశేషాలను గ్రంథస్థం చేయడానికి పూనుకుంటారు. ఆ విధంగా వారు చారిత్రక విషయాలను తెలుసుకోవడం, అధ్యయనం చేయడం భావి తరాలకు వారసత్వ సంపద విశేషాలు తెలియజేయడం కోసమేనని భావిస్తారు. దానితోబాటు యునెస్కో ట్రావెలర్స్గా గుర్తింపు పొందాలని తపన పడుతుంటారు. మీరూ ఆ గ్రూప్లో ఉండాలనుకుంటే.. ఈ సమాచారం మీ కోసమే! ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థగా పేరున్న ‘యునెస్కో’ కార్యాలయం ప్రపంచంలోని అన్ని ప్రాచీన కట్టడాల, జాతీయ ఉద్యానాల, జీవజాలాల పరిరక్షణకు సహకారం అందిస్తోంది. అందులో భాగంగానే ప్రపంచంలోని వేలాది ప్రాచీన కట్టడాలు, జాతీయ ఉద్యానాలు ఈ సమితి జాబితాలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికే మన దేశంలోని 25 ప్రాచీన కట్టడాలు, ఏడు జాతీయ ఉద్యానాలు వారసత్వ సంపదలో చోటు చేసుకోగా... ఇంకా వందకు పైగా కట్టడాలు, ఉద్యానాలు పరిశీలనలో ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళలు ఇప్పటికే వారసత్వ సంపదలో చేరిన ఘనతను పొందాయి. కానీ తెలుగు రాష్ట్రాలకు ఇంకా ఆ ఘనత లభించలేదు. అయితే ఇటీవల.. అద్భుత శిల్పకళా సంపద, అబ్బురపరిచే అతి పురాతన నిర్మాణ పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా ఉన్న వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ సంపద హోదాను కేటాయించే ‘యునెస్కో’ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయని, ఈ సంవత్సరం చివరిలో పారిస్ నుంచి యునెస్కో ప్రతినిధులు వచ్చి ఈ ప్రాచీన కట్టడాలను పరిశీలిస్తారనే వార్తలు ఇటీవల వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటైనా యునెస్కో గుర్తింపు పొందితే తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆ విధంగా ప్రాచీన వారసత్వ కట్టడాల సందర్శనను మొదలుపెడితే ముందుగా వరంగల్ చేరుకోవచ్చు. అటునుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరి, వివిధ రాష్ట్రాలలో యునెస్కో జాబితాలో ఉన్న కట్టడాలను సందర్శించి, వాటి విశేషాల సమాహారాన్ని తెలుసుకోవచ్చు. ముందుగా యునెస్కో జాబితా ఖాతా తెరిచిన మన దేశ ప్రాచీన వారసత్వ సంపదలో.. ఆగ్రా కోట, తాజ్మహల్, మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహలు చేరాయి. 1983లో యునెస్కో జాబితాలో ఇవి చేరడంతో మన దేశ ప్రాచీన వారసత్వ సంపద విదేశీ ప్రయాణికులలో ఆసక్తిని కలిగించింది. ఆ విధంగా విదేశీ ప్రయాణికుల రాక మన వద్ద పెరుగుతూ వచ్చింది. వీటికి దగ్గరలోనే ఉన్న కుతుబ్ మినార్, హుమాయూన్ టూంబ్ మరో పదేళ్లకు అంటే 1983లో యునెస్కో జాబితాలో చేరాయి. ఢిల్లీ వెళితే వీటితో పాటు జహంగీర్ ప్యాలెస్, మరో రెండు సుందరమైన మసీదులను చూసి రావచ్చు. ఆ తర్వాత సంవత్సరం 1984లో తమిళనాడులోని మహాబలిపురం, ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయాల ఖ్యాతి యునెస్కోలో చేరింది. 1985లో అస్సాంలోని కజిరంగ, మానస్, రాజస్థాన్లోని కొలాడియో జాతీయ ఉద్యానాలు చోటు చేసుకోగా..1986లో గోవాలోని చర్చ్, ఉత్తర్ప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీ, కర్ణాటకలోని హంపీ దేవాలయాలు, మధ్యప్రదేశ్లోని ఖజురహో శిల్పసముదాయాలు.. చోటు చేసుకున్నాయి. 1987లో తమిళనాడులోని అతిగొప్పవైన చోళ దేవాలయాలు, కర్ణాటకలోని పట్టాడకల్ ప్రాచీన కట్టడాలు, మహరాష్ట్రలోని ఎలిఫెంటా గుహలు, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ జాతీయ ఉద్యానం, 1988లో ఉత్తరాఖండ్లోని నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉద్యానం చోటు చేసుకున్నాయి. 1999లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేగా పేరుపొందిన మౌంటెయిన్ రైల్వైస్, తర్వాత మరో మూడేళ్లకు బీహార్ రాష్ట్రంలోని మహాబోధి దేవాలయం, 2003లో మధ్యప్రదేశ్లోని రాక్షెల్టర్స్ భింబెట్కా, 2004లో గుజరాత్లోని పావగడ్ ఆర్కియలాజికల్ పార్క్, ముంబయ్లోని ఛత్రపతి శివాజి టెర్మినస్గా పేరున్న విక్టోరియా టెర్మినస్ చోటు చేసుకోగా 2007లో ఢిల్లీలోని రెడ్ఫోర్ట్ కాంప్లెక్స్ యునెస్కో జాబితాలో చేరింది. 2010లో జైపూర్లోని జంతర్మంతర్, 2012లో వెస్ట్రన్ ఘాట్స్, 2013లో రాజస్థాన్లోని హిల్ ఫోర్ట్స్ చోటు చేసుకోగా ఈ ఏడాది ప్రకృతి ప్రసాదితమైన గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్కి ఆ గౌరవం దక్కింది. యునెస్కో జాబితాలో తమ ప్రాంతపు ప్రాచీన కట్టడాలు చేరడం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతి దేశం భావిస్తుంటుంది. మనకు ఆకాశమంత కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టే ఈ అద్భుత వారసత్వ సంపద సందర్శన మదిలో ఎప్పటికీ నిలిచిపోయే విజ్ఞాన ఖనిగా భాసిల్లుతూనే ఉంటుంది. యునెస్కో జాబితాలో చోటు పొందిన ప్రాచీన కట్టడాలు, జాతీయ ఉద్యానవనాల జాబితాను సంవత్సరాల వారీగా విభజించుకుంటే రవాణా మార్గాలను వెతుక్కోవడం సులువు అవుతుంది. మన దేశంలో ప్రఖ్యాత ప్రాచీన కట్టడాలను చేరుకోవడానికి ఆయా రాష్ట్రాల రాజధానుల నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి. ప్రసిద్ధ కట్టడాల గురించి పర్యాటకుల కోసం ట్రావెల్ గైడ్ బుక్స్, ఆడియో రికార్డ్స్ లభిస్తున్నాయి వాటి ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా వీటి సమాచారం తెలుసుకోవాలనుకునేవారు ‘గో యునెస్కో’ వెబ్సైట్కు లాగిన్ అయితే ప్రపంచంలోని వారసత్వ కట్టడాలు, ప్రదేశాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడే యునెస్కో ట్రావెలర్ గ్రూప్స్ను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది.