రండి.. ఓటేయండి
జీహెచ్ఎంసీ ఓటర్లకు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి విజ్ఞప్తి
* మీకు కలిగే ఇబ్బంది కన్నా జరిగే మేలే ఎక్కువ
* ఓటుకు నోటు ఇచ్చారని రుజువు చేస్తే అభ్యర్థి ఎన్నిక రద్దు
* పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 2న సెలవు ప్రతిపాదించాం
* టీడబ్ల్యూజేఎఫ్ ‘మీట్ ది మీడియా’లో వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘కొద్దిగా కష్టమైనా సరే... విస్తృత ప్రజాప్రయోజనాల కోసం పోలింగ్ రోజున వచ్చి ఓటేయండి. మీకు ఇబ్బంది కలగకుండా సుమారు 46 వేల మంది సిబ్బందితో 7,500 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నీడ, టాయ్లెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. అయినా చిన్నాచితకా ఇబ్బందులు ఎదురు కావచ్చు.
రద్దీ పెరిగితే కొన్ని సందర్భాల్లో గంటపాటు నిలబడాల్సి రావచ్చు. దయ చేసి ఆ ఒక్క రోజు (ఫిబ్రవరి 2న) ఇబ్బందులను సహించండి. ఎందుకంటే మీకు జరగబోయే మేలు ఆ ఇబ్బందితో పోల్చితే చాలా ఎక్కువ’’ అని జీహెచ్ఎంసీ ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘ప్రస్తుతం రూ.10 వేలున్న జీహెచ్ఎంసీ తలసరి వార్షిక ఆదాయం ఐదేళ్ల తర్వాత రూ.20 వేలకు పెరగనుంది. ఈ నిధులను ఖర్చు చేసేది మన ప్రాంత కార్పొరేటరే. మన ఒక్కరి ఓటుతోనే గెలుస్తారా తరహా ఆలోచన సరైంది కాదు.
ఈ ధోరణి నేతల్లో బాధ్యతారాహిత్యానికి తావిస్తుంది. మీ ఓటు వృథా పోదు. ఎక్కువ సంఖ్యలో గెలిచిన వారు బాధ్యత గల అధికార పక్షంగా మారతారు. తక్కువ సీట్లు గెలిచేవారు పట్టుదల గల విపక్షంగా ఉంటారు’’ అని వివరించారు.శనివారం టీడబ్లూజేఎఫ్, హెచ్యూజే సంయుక్తంగా నిర్వహించిన ‘మీట్ ది మీడియా’లో నాగిరెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
ఒక్క ఫిర్యాదుతో ఎన్నిక రద్దు
అంతటా అవినీతి ఎక్కువైందని చెప్పుకుంటాం. కానీ, అత్యంత అవినీతి జరుగుతున్నది ఎన్నికల్లోనే. ఎన్నికల్లో పోటీ చేయడానికి, పోటీ చేయకుండా ఉండడానికి, ఓటేయడానికి, ఓటేయకుండా చేయడానికి... ఇలా దేనికైనా డబ్బులివ్వడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఓటుకు రూ.వెయ్యి ఇస్తున్నారంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో ఆలోచించండి. అవినీతి వల్ల ప్రజలే నష్టపోతారు. దుర్మార్గులు ఎన్నికైతే మన ఆదాయ వనరులనే కొల్లగొడతారు. నగరాన్ని భ్రష్టుపట్టిస్తారు. కానీ రాజకీయాలతో సంబంధం లేని సాధారణ పౌరులెవరూ ఈ ధోరణిని ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. ఫలానా వ్యక్తి రూ.వెయ్యి ఇచ్చాడని ఇకనైనా ఫిర్యాదుతో రండి.
ఆధారాలు సమర్పించండి. ఆ వ్యక్తి ఎన్నిక రద్దవుతుంది. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నా డబ్బులు పంచే వారిని పట్టుకోలేకపోవడం బాధాకరం. ఎవరైనా అభ్యర్థి రూ.5 లక్షలకు మించి ఖర్చు చేశారని నిరూపించినా అతని ఎన్నిక రద్దవుతుంది. ఈ ఎన్నికల్లోనైనా ఈ దిశగా కనీసం ఓ నాలుగు ఫిర్యాదులు వస్తాయని ఆశిస్తున్నాం. కేవలం గత నాలుగు రోజుల్లోనే లక్షకు పైగా పోస్టర్లు, బ్యానర్లను తొలిగించాం. నగరం చక్కగా ఉండాలంటే ఇలాంటి పిచ్చిపిచ్చి రాతలు అవసరం లేదు. మంచి పాలకులుంటే మనకిలాంటి బాధలు తప్పుతాయి.
ఓటింగ్ పెరిగితేనే అభ్యర్థులకు అందరి సమస్యలు తెలిసొస్తాయి రాజ్యాంగంలోని 11, 12వ షెడ్యూళ్లు గ్రామ, పట్టణ పరిపాలన సంస్థలకు విస్తృతాధికారాలు కల్పించాయి. కానీ 73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత ఇప్పటిదాకా స్థానిక సంస్థలకు మూడు, నాలుగుసార్లు మాత్రమే ఎన్నికలు జరగడంతో ఈ అధికారాలను ఇంకా పూర్తిగా అవగతం చేసుకోలేకపోతున్నారు. జాతీయాదాయంలో 49 శాతం రాష్ట్రాలు, 48 శాతం కేంద్రం పంచుకుంటున్నాయి. మిగతా 3 శాతం స్థానిక సంస్థలకు కేటాయిస్తున్నారు. పౌరులకు కనీసావసరాలను తీర్చడానికి 20 శాతం ఆర్థిక వసరులు కావాలి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 30-40 శాతం మంది మాత్రమే ఓటేస్తే ఇది సాధ్యం కాదు. ఈ ఓట్లను ముగ్గురు నలుగురు పంచుకుంటున్నారు. ఒక్కో డివిజన్లో 6 వేల నుంచి 7 వేల ఓట్లొస్తే చాలు, అధికారంలోకి వస్తున్నారు. ఈ మాత్రం ఓట్ల కోసం తెలిసిన 10 కాలనీల్లో బాగా పని చేస్తే గెలుస్తామనే భావన ఉంది. దాంతో మిగతా కాలనీల సమస్యలను అభ్యర్థులు పట్టించుకోవడం లేదు. కాబట్టి డివిజన్లో 45 వేల మంది ఓటర్లుంటే కనీసం 35 వేల మందికి పైగా ఓటేయాలి. అప్పుడు కనీసం 15 వేలకు పైగా ఓట్లు పొందితేనే గెలుస్తారు.
ఇందరి అవసరాలు తీర్చేందుకు 3 శాతం నిధులు ఏమాత్రం చాలవని వారికి అప్పుడర్థమవుతుంది. అవసరాల మేరకు నిధులు కావాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తారు. మరో విషయం. తెలంగాణకు ఆధారం హైదరాబాద్ నగరమే. కోటి మంది ప్రజలు, 74లక్షల మంది ఓటర్లున్నారిక్కడ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క హైదరాబాద్ నుంచే ఏటా ఏకంగా రూ.లక్ష కోట్ల ఆదాయం లభిస్తున్నది! ఐటీ, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రఖ్యాత సంస్థలు నగరంలో ఉన్నాయి. కాబట్టి చక్కటి పాలన వ్యవస్థ కోసం అందరూ ఓటేయండి.
సెలవుకు ప్రతిపాదన
ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆ రోజు ఓటర్లకు సెలవు విషయంలో ప్రభుత్వం ముందు మూడు ప్రతిపాదనలుంచాం. ఒకటి ప్రభుత్వ సెలవు. రెండోది నెగోషియబుల్ ఇనుస్ట్రు మెంట్స్ చట్టం కింద సెలవుగా ప్రకటిం చడం. ఈ రెండింటి పరిధిలోకీ రాని ప్రైవేటు ఉద్యోగులు ఓటేసేందుకు రెండు మూడు గంటల సమయమిచ్చేలా ఆయా సంస్థల యాజమాన్యాలను ఒప్పించడం.