breaking news
Trishika
-
రాజ వంశోద్ధారకుడు
బొమ్మనహళ్లి: సుదీర్ఘ కాలం తరువాత యదు వంశానికి వంశోద్ధారకుడు రావడం చాలా సంతోషంగా ఉంది. మహారాజు యదువీర్ భార్య మహారాణి త్రిషికా కుమారి బుధవారం రాత్రి పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. చిన్నారి, మహారాణి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’ అని మైసూరు రాజమాత ప్రమోదాదేవి ఒడెయార్ తెలిపారు. గురువారం బెంగళూరు నగరంలో ఉన్న ఒక ప్రవేట్ ఆస్పత్రిలో యదువీర్తో కలిసి ప్రమోదాదేవి మీడియాతో మాట్లాడారు. చిన్నారి నామకరణంతో పాటు ఇతర అన్ని విషయాలను శాస్త్రోక్తంగా ఈ నెల 17వ తేదీ తరువాత చేపడతామని చెప్పారు. పునర్వసు నక్షత్రంలో... మహారాణి త్రిషికా కుమారి బుధవారం రాత్రి ఇక్కడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రవేట్ ఆస్పత్రిలో 9.32 గంటలకు బాబు జన్మనివ్వడం జరిగిందని ఆమె చెప్పారు. తనతో పాటు మా కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉన్నారని, బాబు పునర్వసు నక్షత్రంలో జన్మించాడని, 3 కిలోల బరువు ఉన్నాడని మహారాణి తెలిపారు. మరో రెండు రోజుల తరువాత ఇద్దరినీ ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేస్తారని చెప్పారు. యదు వంశంలో పుట్టిన బాలుడిని చూసి కన్నడనాడులో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోంది, మాపైన ఇలాగే అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు రాజమాత తెలిపారు. మైసూరుప్రజలు ఇప్పటికే స్వీట్లు పంపిణీ చేస్తున్నారని, మరిన్ని వివరాలను మైసూరుకు వెళ్ళిన అనంతరం ప్రకటిస్తామని అన్నారు. చాముండేశ్వరి దయతోనే: యదువీర్ యదువీర్ మాట్లాడుతూ తల్లి చాముండేశ్వరి మాత దయ వల్ల మాకు బాబు పుట్టాడు, చాలా సంతోషంగా ఉంది, యదు వంశంలో 62 సంవత్సరాల అనంతరం మగసంతానం పుట్టడం మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. జన్మ నక్షత్రం, జాతకం ప్రకారం పేరు పెడతామని, శిశువు చలాకీగా ఉన్నాడని, బాబుకు పెట్టె పేరుతో పాటు పక్కన నరసింహరాజు ఒడెయార్ అనే పేరు తప్పకుండా ఉంటుందని మహారాజు తెలిపారు. బాబు చలాకీగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని తెలిపారు. తమకు సంతానభాగ్యం చాముండేశ్వరి దేవి కృషాకటాక్షే అని రాసిన లేఖను సోషల్ మీడియాలో విడుదల చేశారు. -
400 ఏళ్ల శాపం.. ఇక విమోచనం..
మైసూరు: పెద్ద రాజ్యం..అంగ, అర్ధబలం, ఇంద్రభోగాలు.. అన్నీ ఉన్నాయి... సంతాన భాగ్యమే లేదు. లంకంత ప్యాలెస్ చిన్నారి అల్లరి లేక బోసిపోయేది. రాజ దంపతులు ఎన్ని నోములు వ్రతాలు చేసినా దైవం కరుణించలేదు. మైసూరు మహారాజుల వ్యక్తిగత జీవితంలో ఇదో దుర్భర వేదన. చివరికి వారిపై భగవంతుడు దయచూపాడు. 400 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించాడు. రాచనగరిలో ఈ యేడాది జరిగే దసరా వేడుకల నాటికి మైసూరు మహారాజుల వంశంలో మరో బుల్లి మహారాజు వేంచేయబోతున్నట్లు తెలిసింది. దీంతో మైసూరు రాజవంశీకుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. మైసూరు రాజవంశీకుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్, త్రిషిక కుమారి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. గతేడాది జూన్ 27న అంగరంగ వైభవంగా సాగిన వివాహమహోత్సవంలో వీరు ఒక్కటైన సంగతి తెలిసిందే. దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయర్– రాణి ప్రమోదాదేవికి యదువీర్ దత్త పుత్రుడు. త్రిషిక ఐదు నెలల గర్భిణి. దీంతో రాజమాత ప్రమోదాదేవి, రాజ కుటుంబం ఆనందంలో వెల్లివిరుస్తోంది. అలమేలమ్మ శాపం.. చరిత్ర చెబుతున్న కథనాల ప్రకారం మైసూరు మహారాజులకు పిల్లలు కలగలేదు. నాలుగు వందల ఏళ్ల కిందట శ్రీరంగపట్టణం రాజు శ్రీరంగరాయన (తిరుమలరాజ) భార్య అలమేలమ్మ శాపం వారికి ఉండటంతో మైసూరు సింహాసనాధీశులకు అన్ని సంపదలు ఉన్నా, సంతానభాగ్యం మాత్రం లేకుండా పోతోంది. క్రీ.శ. 1612లో తిరుమలరాజ మైసూరు సింహాసనం ఏలుతుండగా, రాజ ఒడెయర్ ఆయనపై తిరుగుబాటు చేసి రాజవుతాడు. దీంతో ఆవేదనకు గురైన తిరుమలరాజ భార్య అలమేలమ్మ కొన్ని ముఖ్యమైన ఆభరణాలను తీసుకుని తలకాడుకు వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఒడెయర్ సైనికులు ఆమెను చుట్టుముడతారు. ఆ సమయంలో అలమేలమ్మ తీవ్ర ఆగ్రహంతో... మైసూరు రాజులకు ఎప్పటికీ కడుపు పండదని శపించి కావేరి నదిలో దూకి తనువు చాలిస్తుంది. ఆమె శాపం మహత్యమో, లేక మరే కారణమో గానీ అప్పటి నుంచి మొన్నటి శ్రీకంఠదత్త ఒడెయర్ వరకు మైసూరు రాజులు నిస్సంతులే. దీంతో సమీప బంధువుల్లోని మగపిల్లల్ని దత్తత తీసుకుని వారసు నిగా ప్రకటిస్తున్నారు. చరిత్రకు భిన్నంగా ఈసారి రాజ దంపతుల కడుపు పండింది. మగపిల్లాడు పుడతాడని మైసూరు ప్యాలెస్ జ్యోతిష్యులు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.