breaking news
telangana bonalu festival
-
బోనాల జాతర.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బోనాల ఉత్సవాలను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం జూబ్లీహిల్స్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని దాశరథి ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బోనాలు కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక చిహ్నమని అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్కు తరలివస్తారని, అమ్మవారి దర్శనం కోసం వివిధ దేవాలయాలను సందర్శిస్తారని చివరి భక్తునికి కూడా అమ్మవారి దర్శనాన్ని కల్పించాలని దేవదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.బోనాలు, గణేష్ ఉత్సవాలు, రంజాన్, మొహర్రం వంటి భారీ మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం హైదరాబాద్ యంత్రాంగానికి ఉందని, అదే సమన్వయం, ప్రణాళిక, అంకితభావంతో బోనాల ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, లక్షలాది మంది భక్తులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నిరంతరం పెంచుతూ వస్తోందని పేర్కొన్నారు. 2021లో 1,028 ఆలయాలకు, 2022 మరియు 2023లో చెరో 1,073 ఆలయాలకు, 2024లో 1,253 ఆలయాలకు, 2025లో రికార్డు స్థాయిలో 3,026 ఆలయాలకు రూ.5.80 కోట్ల ఆర్థిక సహాయం అందించిందన్నారు. అర్హత కలిగిన ఆలయాల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, భక్తుల రద్దీ, ఆలయ అవసరాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సహాయం అందించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యంత్రాంగాలకు, దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు.భక్తుల సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన మంత్రి, ప్రధాన ఆలయాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, తాగునీటి సౌకర్యం, ప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ, క్యూ లైన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, వైద్య శిబిరాలు, అత్యవసర స్పందన వ్యవస్థలు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని ఆదేశించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశమున్నందున టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని సూచించారు.గోల్కొండ, బాల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, సబ్జీ మండి, అక్కన్న మాదన్న ఆలయాల వద్ద అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, జీహెచ్ఎంసీ, ఇతర పౌర శాఖలు సమగ్ర భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ, జనసమ్మర్థ నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా భక్తులు, విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బంది భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ముందస్తు ప్రణాళికల ద్వారా సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.బోనాల పండుగ విశిష్టత, చరిత్ర, సంప్రదాయాలు, కార్యక్రమాల షెడ్యూల్, ట్రాఫిక్ ఆంక్షలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సమాచార, పౌర సంబంధాల శాఖను మంత్రి ఆదేశించారు. బోనాల విశిష్టతపై ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం గావించాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణ సందర్భంగా అధికారులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు.గోల్కొండ బోనాల చారిత్రక ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, ఆషాఢ మాసం సందర్భంగా గోల్కొండ కోటను సందర్శించే భక్తులకు పురావస్తు శాఖ ఉచిత ప్రవేశాన్ని కొనసాగించాలని మంత్రి సూచించారు. తెలంగాణ సంస్కృతి, విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన బోనాల ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిపూర్వకంగా, వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు, ఆలయ కమిటీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవస్థానంలో జాతర తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలోని ఐదు గురువారాలు, నాలుగు ఆదివారాల్లో గోల్కొండలో జాతర ఉత్సవాలు నిర్వహించబడతాయి మరియు రాష్ట్ర ప్రభుత్వం జూలై 16న పట్టు వస్త్రం సమర్పించనుంది. జూలై 21న బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో కళ్యాణోత్సవం, పట్టు వస్త్రాల సమర్పణ, జూలై 22న రథోత్సవం జరుగుతాయి.ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ప్రధాన బోనాల ఉత్సవాలు, పట్టు వస్త్రాల సమర్పణ నిర్వహించబడగా, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, అంబారీ ఊరేగింపు నిర్వహించబడతాయి. ఆగస్టు 9న ఇతర ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ జరగనుంది. అదే రోజు సబ్జీ మండి, కార్వాన్ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు నిర్వహించబడగా, ఆగస్టు 10న హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఉత్సవాల కాలమంతా ఘటోత్సవం, బోనం సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజు విన్యాసాలు, శివసత్తుల కార్యక్రమాలు, రంగం, తదితర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.అంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలు, సమర్థవంతమైన అమలు అవసరమని అన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా సమావేశంలో బోనాల విశిష్టత గురించి మాట్లాడారు.సమావేశంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, డీజీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..
ఆషాఢమాసంలో బోనాల జాతర ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. పాతబస్తీలో ఈసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇప్పటికే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పాతబస్తీలో బోనాల సమర్పణ అనంతరం నిర్వహించే సామూహిక ఘటాల ఊరేగింపులో ప్రధాన పాత్ర వహించే శకటాలు, కళాకారుల విన్యాసాల కోసం సంబంధిత ఉత్సవాల నిర్వాహకులు పెద్ద ఎత్తున కళాకారులకు ఇప్పటికే బుకింగ్స్ ఇస్తున్నారు.(చదవండి: ఆదివాసీ కోయిల.. ! ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాస్తా.. ర్యాప్ సింగర్గా..)కళాకారుల నృత్య ప్రదర్శనలు.. ఈసారి ఉత్సవాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు హైలెట్గా నిలువనున్నాయి. కళాకారులు ప్రదర్శించే హావభావాలను చూసే ప్రతి ఒక్కరూ భక్తిపారవశ్యంతో తన్మయత్వం పొందుతారు. ఘట స్థాపన ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు తదితర కార్యక్రమాల్లో వివిధ రకాల అలంకరణల్లో, రూపాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరిస్తాయి. పాతబస్తీకి ప్రత్యేకం..నిజాం కాలం నుంచి ఇక్కడి అమ్మవారి దేవాలయాల్లో పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని సమర్పించడం ఆనవాయితీ. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా నగరంలో ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. తెలంగాణ జిల్లాల్లోనే అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు పాతబస్తీ ప్రత్యేకతను చాటుతాయి.ఇతర రాష్ట్రాల కళాకారులకు ఉపాధిగా.. రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, తమిళనాడుకు చెందిన కళాకారులు ఎక్కువగా పాల్గొంటారు. నగరంలో బోనాల జాతర ఉత్సవాల్లో కళాకారులు, వినూత్న తరహా సెట్టింగ్స్ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. ఈసారి కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని ప్రముఖ దేవాలయాల నిర్వాహకులు కళాకారుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో కొన్ని వందల కుటుంబాల కళాకారులకు ఈ బోనాల జాతర ఉత్సవాలు యేటా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆకట్టుకునే రూపాలు, నృత్యాలు.. బోనాల జాతర ఉరేగింపులో కేరళ పులికళి, భేరీ నృత్యం, గరిగెలు, బేతాళ నృత్యం, ఒగ్గోళ్ల నృత్యం, బోనాలు, కాళికాదేవీ, లక్ష్మీదేవీ, వేంకటేశ్వర స్వామి, పొట్టి పోతరాజులు, సింహరథం, డప్పులోళ్లు, హనుమంతునిలో రాముడు, తయ్యం, దేవ నృత్యం, ఉరుములు, కొమ్ముకొయ్య, జడ కోలాటం, యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి శకటం.. అందులో ఏర్పాటు చేసే మూర్తులు, విజయవాడ కనకదర్గమ్మ దేవాలయ రథం.. అందులో కొలువుదీరే అమ్మవారి వేషధారణలోని కళాకారుల హావభావాలు.. ఇలా ఒకటేంటి పలు రకాల శకటాలు, కళాకారుల నత్యాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా బోనాలు
ఈ ఏడాది కోవిడ్ నిబంధలను సడలించడంతో సింగపూర్ బోనాల పండుగ వేడుకలు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి. ఇక్కడి సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో సింగపూర్ ప్రభుత్వం, ఆలయ నిబంధనలకు లోబడి ఘనంగా బోనాలు సమర్పించారు. స్థానిక నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని, ప్రపంచం కరోనా కోరల నుంచి పూర్తిగా ఉపశమనం పొందాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. వందల మంది భక్తులు పాల్గొన్న ఈ బోనాల ఊరేగింపులో బోనాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ బోనాల పండుగను సింగపూర్కు ఆరేళ్ల క్రితం పరిచయం చేయడం ద్వారా టీసీఎస్ఎస్(TCSS) పేరు చరిత్రలో నిలిచింది. అది సొసైటీకి దక్కిన అదృష్టంగా వారు భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో ఏకైక తెలంగాణ సంస్థ, టీసిఎస్ఎస్ అని తెలిపారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో బండ శ్రీదేవి మాధవ రెడ్డి, గోనె రజిత నరేందర్ రెడ్డి , గడప స్వాతి రమేశ్, మద్దుకుంట్ల స్వరూప రాజు, గదంశెట్టి స్వరూప్, దార అలేఖ్య ఉన్నారు. వీరితో పాటు ఫణి రోజా రమణి అమ్మవారికి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకువచ్చింది. ఈ వేడుకలకు సమన్వయకర్తలుగా నంగునూరి సౌజన్య, గర్రెపల్లి కస్తూరి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు వ్యవహరించారు. అదే విధంగా సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహయం అందించిన దాతలకు, మై హోమ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల పై ఉజ్జయని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ జేశారు. -
బోనమెత్తిన తెలుగు సినీ నటి
రాయికల్(కరీంనగర్ జిల్లా): తెలంగాణ ఎన్నారై ఫోరం (టీఎన్ఎఫ్) ఆధ్వర్యంలోలండన్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సినీనటి పూనమ్ కౌర్ హాజరై బోనమెత్తారు. యుకే నలుమూలల నుంచి సుమారు 700 మందికి పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి రామచంద్రు తేజావత్ (రిటైర్డ్ ఐఏఎస్), స్థానిక ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, బాలాజీ (ఇండియన్ హైకమిషనర్-లండన్) ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించారు. రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ పెట్టుబడుల్లో భాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో భారతీయ ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపును జరుపుకున్న తీరు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులను కూడా మంత్రముగ్దులని చేసింది.


