breaking news
Subsidized onions
-
రేపటి నుంచి రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లలో శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు విక్రయించనున్నారు. అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. బుధవారం అనేక పట్టణాల్లోని రిటైల్ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హోల్సేల్ మార్కెట్లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కర్నూలు, తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్లలో ఉల్లిపాయలు కొనుగోలు చేయనుంది. ఆ మార్కెట్లలో ఎంతకు కొనుగోలు చేసినా రైతుబజార్లలో కిలో రూ.40కి అమ్మాలని నిర్ణయించింది. రెండోదశలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. -
‘ఉల్లి’పోటు!
చిత్తూరు (అర్బన్), తిరుపతి రూరల్: ఉల్లి ధర బయట భగ్గు మంటోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకెళ్లి ఎక్కిరిస్తోంది. ఈ నేపథ్యంలో రైతు బజారుకొస్తున్న సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం ఎగబడుతున్నారు. కొత్త సినిమా టికెట్ల కోసం ఎగబడ్డట్టు పలువురు బారులు తీరుతున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు రైతు బజార్లకు బుధవారం సబ్సిడీ ఉల్లిపాయలొచ్చాయి. కిలో రూ.20 వంతున అధికారులు విక్రయానికి సిద్ధమయ్యారు. ఉల్లిపాయల కోసం జనం ఎగబడ్డారు. ఉదయం 5 గంటల నుం చే క్యూలైన్లలో వేచి ఉన్నారు. చిత్తూరులోని రైతు బజార్లో 5 కౌంటర్లు ఏర్పా టు చేశారు. అయినా ఇబ్బందులు తప్పలేదు. అరుపులు, తోపులాటలు మిన్నంటాయి. చివరకు పోలీసుల జోక్యంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. వినియోగదారుల తాకిడి ఎక్కువవ్వడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉల్లిపాయలు ఇచ్చిన అధికారులు, తర్వాత కౌంటర్లు మూసేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావు రైతు బజారును తనిఖీ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలి రోజు చిత్తూరులో 20 టన్నులు తెప్పించగా 12 టన్నులు అమ్ముడయ్యాయని తెలిపారు. ఇక తిరుపతి రైతుబజార్కూ వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరారు. బుధవారం రైతు బజారుకు సెలవు అయినప్పటికీ ప్రజల సౌకర్యార్థం విక్రయిం చినట్లు రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ అయ్యప్పన్ తెలిపారు. బుధవారం ఒక్కరోజే 4,500 కిలోల ఉల్లిపాయలు విక్రయించినట్టు తెలిపారు. -
పేట్రేగిన ఉల్లి
♦ ఢిల్లీ ధరలతో వ్యాపారుల పోటీ ♦ రిటైల్ మార్కెట్లో కిలో రూ.70-80 ♦ సబ్సిడీ ఉల్లికి జనం బారులు సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి ధర జనాలను హడలెత్తిస్తోంది. ఢిల్లీలో ఉల్లి ధర కిలో రూ.100కు చేరువవుతోందన్న వార్త నగరంలోని రిటైల్ వ్యాపారుల్లో అత్యాశను రేపింది. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే కిలోపైఅదనంగా రూ.10-15 పెంచేశారు. మలక్పేటలోని హోల్సేల్ మార్కెట్లో గ్రేడ్ -1 ఉల్లి కేజీ ధర రూ.67 పలకడంతో వెంటనే రిటైల్ వ్యాపారులు పెంచేశారు. నిన్న మొన్నటి వరకు కేజీ రూ.65కు లభించిన మహారాష్ట్ర ఉల్లి ఇప్పుడు రూ.80కి, కర్నూలు ఉల్లి కిలో రూ.50 నుంచి రూ.60కి ఎగబాకాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నగరానికి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో పాటు కర్నూలునుంచి కూడా సరఫరా నిలిచిపోయింది. మహారాష్ట్రలో స్థానికంగానే ఉల్లికి మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఇక్కడికి పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. నగరంలోని మహబూబ్ మాన్షన్ హోల్సేల్ మార్కెట్కు నిత్యం 16-18వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతయ్యేది. మంగళవారం 14వేల క్వింటాలు మాత్రమే వచ్చింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధర లు పెంచేశారు. నిన్నటి వరకు కేజీ రూ.50 ఉన్న గ్రేడ్-2 నీరుల్లి (కర్నూలు) ధర ఒక్కరోజులోనే రూ.60కి చేరింది. తోపుడు బండ్ల వారైతే... థర్డ్ గ్రేడ్ ఉల్లిని గ్రేడింగ్ చేసి కాస్త పెద్దవి కేజీ రూ.70, చిన్నవి రూ. 60 వంతున విక్రయిస్తున్నారు. టీవీలు, పత్రికల్లోని కథనాలను చూసి నగరానికి ఉల్లి సరఫరా ఆగిపోయిందని... ధరలు ఢిల్లీ తరహాలోనే ఉంటాయని కొందరు వ్యాపారులు ప్రచారం చేస్తున్నారు. కిక్కిరిసిన రైతుబజార్లు సబ్సిడీ ఉల్లి కోసం జనం పోటెత్తుతుండటంతో నగరంలోని రైతుబజార్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి సోమవారం సబ్సిడీ ఉల్లి కౌంటర్లను మూసేస్తుంటారు. ఇది తెలియని కొందరు సోమవారం ఉల్లి కోసం వచ్చి సరుకు అయిపోయిందని ప్రచారం మొదలెట్టారళు. దీన్ని నమ్మిన గృహిణులు మంగళవారం ఉదయాన్నే కౌంటర్ల వద్ద క్యూలు కట్టారు. స్కూల్కు వెళ్లాల్సిన పిల్లలను కూడా క్యూలైన్లో నిలబెట్టి ఉల్లి కొనుగోలు చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా విక్రయాలు సాగించినా రద్దీని నియంత్రించలేక పోతున్నామని రైతుబజార్ సిబ్బంది వాపోతున్నారు. కావాల్సినంత సరుకు ఉందనీ పదే... పదే మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నా... ఎవరూ పట్టించుకోవట్లేదని, పోలీసుల సహకారంలో విక్రయిస్తున్నామని చెబుతున్నారు. కృత్రిమ కొరత కొందరు ఉల్లి వ్యాపారులు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వినికిడి. కర్నూలు ఉల్లి వారం రోజులకు మించి నిల్వ ఉండ దు. మహారాష్ట్ర ఉల్లి నెల రోజుల వరకు బాగుంటుంది. కొందరు వ్యాపారులు నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి ధరలు పెంచేశారని తెలుస్తోంది. వర్షాలు, ఇతర కారణాలతో ఒక్కరోజు దిగుమతులు ఆగిపోతే... ఆ కొరతను బూచిగా చూపి ధరలు పెంచుతుండటం నగరంలో పరిపాటి. ఈ తరుణంలో మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించడంతో పాటు, ఉల్లి ధరలకు కళ్లెం వేయకపోతే పరిస్థితి మరింత భారమయ్యే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే సెప్టెంబర్ నాటికి నగరంలో ఉల్లి కేజీ రూ.100కు చేరినా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదని మార్కెటింగ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.