breaking news
Stair Well
-
అద్భుతమైన ఇంజనీరింగ్ శైలి..
కోరుట్ల: పెద్ద పెద్ద రాతి స్తంభాలు.. వాటిపై శిలాఫలకాలతో శ్లాబ్ వంటి నిర్మాణాలు. అక్కడక్కడ చిన్నచిన్న విశ్రాంతి గదులు. దుస్తులు మార్చుకునేందుకు అనువైన నిర్మాణాలు. మూడు అంతస్తుల నిర్మాణం. భూమిపై కనిపించేది కేవలం ఒక అంతస్తు మాత్రమే.. మిగిలిన రెండు అంతస్తుల నిర్మాణం భూగర్భంలోకి వెళ్లిపోయింది. క్రీ.శ. 957–1184 మధ్య కాలం నాటి శిల్పుల ఇంజనీరింగ్ శైలికి నిదర్శనంగా నిలిచిన అద్భుతమైన నిర్మాణం జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. జైన చాళుక్యుల కాలంలో.. క్రీ.శ. 1042–1068 వరకు వేములవాడ రాజధానిగా పరిపాలన సాగించిన జైన చాళుక్యుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మించినట్లు సమాచారం. 7–10వ శతాబ్ది వరకు పరిపాలన సాగించిన కల్యాణి చాళు క్యులు, రాష్ట్రకూటుల హయాంలోనూ ఈ మెట్ల బావి (Stepwell) ఆ కాలం నాటి రాజవంశీయుల స్నానాలకు, విశ్రాంతి తీసుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి వినియోగించారని చెబుతారు. ఈ మెట్ల బావిలోని రాతి స్తంభాలపై చెక్కిన తీరు అమోఘం. రాతి స్తంభాల కింది భాగంలో భూగర్భమార్గంలో రాజకోటను చేరుకోవడానికి సొరంగం వంటి మెట్ల నిర్మా ణం ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. రాజవంశీయుల కాలంలో నిషిద్ధ ప్రాంతంగా ఉన్న ఈ మెట్ల బావి ప్రస్తుతం కోరుట్ల (Korutla) మున్సిపల్ అధీనంలో ఉంది. ఎక్స్లెన్స్ సర్టిఫికెట్ కోరుట్లలోని మెట్ల బావిలో స్నానాలకు వచ్చే రాజవంశీయులకు దుస్తులు మార్చుకోవడానికి అనువుగా మెట్లబావి రెండవ అంతస్తులో చిన్నచిన్న గదులుండటం గమనార్హం. వీటితో పాటు విశ్రాంతి తీసుకోవడానికి మెట్ల బావి చుట్టూ రాతి స్తంభాల మీద నిలబెట్టిన శిలాఫలకాలతో పెద్ద వసారా ఉంది. మెట్ల బావి (stair well) చుట్టూ దీపాలు వెలిగించడానికి అవసరమైన చిన్నపాటి గూళ్లు ఉన్నాయి. మెట్లబావిపై భాగంలో ఉన్న మెట్లకు వెంబడి ఎడమ వైపు ఉన్న ఓ రాతిపై శిలాశాసనం (Epigraphy) ఉంది. ఈ శిలాశాసనం సంపూర్ణంగా చదవడానికి వీలు కానట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న కోరుట్ల మెట్లబావిని మున్సిపల్ ఆధ్వర్యంలో బాగు చేయించి కొత్త సొబగులద్దారు. దీంతో ఈ మెట్లబావికి ఇండి గ్లోబల్ నెట్వర్క్ నుంచి 2022–23 సంవత్సరంలో ఎక్స్లెన్స్ సర్టిఫికెట్ దక్కింది. చదవండి: వెండితెరపై మానుకోట -
శతాబ్దాల క్రితం నిర్మించిన ‘నాగన్నగారి బావి’!
సాక్షి, కామారెడ్డి: చారిత్రక కట్టడాల్లో మెట్ల బావులు ఒకటి. శతాబ్ధాల క్రితం నిర్మించిన మెట్ల బావులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే పాలకుల నిర్లక్ష్యంతో అవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. అప్పట్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు, పంటలు సాగు చేసుకునేందుకు మెట్ల బావులను వాడినట్టు చెబుతుంటారు. శిల్పకళా కౌశలంతో మెట్ల బావులు నిర్మించినట్టు అక్కడి ఆనవాళ్లు చెబుతుంటాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్పేటలో వందల ఏళ్ల క్రితం నాటి మెట్ల బావి వెలుగు చూసిన విషయం తెలిసిందే. అలాంటి కట్టడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల కేంద్రంలో కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఈ బావి ఉంది. దీన్ని ‘నాగన్నగారి బావి’గా పిలుస్తారు. ఈ మెట్ల బావి నిర్మాణంలో కళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది. జక్సాని నాగన్న అనే వ్యక్తి ఈ దిగుడు బావిని నిర్మించాడని, అందుకే దాన్ని నాగన్న బావి అంటారని గ్రామస్తులు చెబుతారు. బావి అడుగు భాగం నుంచి పై భాగం వరకు అందమైన శిలలతో నిర్మించారు. పై నుంచి అడుగు వరకు మెట్లు ఉన్నాయి. బావికి నలు వైపులా మెట్లు ఉన్నాయి. ప్రధాన మార్గాన్ని పడమర దిశలో ఏర్పాటు చేశారు. ఉపరితలం నుంచి 20 అడుగులకు ఒక అంతస్తు చొప్పున ఐదు అంతస్తులు అంటే దాదాపు వంద అడుగుల లోతు ఈ బావిని నిర్మించారు. దీన్ని 18 వ శతాబ్దంలో నిర్మించినట్టు కొందరు పేర్కొంటున్నారు. సంస్థానాదీషుల పరిపాలన కొనసాగిన కాలంలో ఈ కట్టడం నిర్మితమైందని తెలుస్తోంది. అయితే ఏ సంస్థానాదీషులు నిర్మించారన్నదానిపై సరైన ఆధారాలు లభించడం లేదు. అద్భుతమైన నిర్మాణ శైలి.... లింగంపేటలోని నాగన్నబావి (మెట్ల బావి)ని చూస్తే అప్పటి కళానైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. నాలుగు వైపులా ఒకే రకమైన శైలితో అద్భుతమైన నిర్మాణం జరిగింది . బావి ఉపరితలం నుంచి అడుగు వరకు మెట్లు నిర్మించారు. శంఖుచక్రాలు, పుష్పాలు... ఇలా రకరకాల శిల్పాలు చెక్కించారు. బావికి నలువైపులా సుందర దృశ్యాలు ఉంటాయి. బావి పైభాగంలో చిన్నచిన్న కంకర రాళ్ల, డంగు సున్నంతో పైకప్పు వేశారు. తూర్పు భాగంలో బావి నుంచి నీటిని పైకి చేదడానికి మోటబావి లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి నీటిని కాలువ ద్వారా తరలించి పంటలకు చేరేలా ఏర్పాట్లు ఉన్నట్టు తెలుస్తోంది. పాడుబడిపోతున్న సంపద.... ఎంతో కళానైపుణ్యంతో నిర్మించిన ఈ మెట్ల బావి నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎవరూ పట్టించుకోకపోవడం మూలంగా పాడుబడిపోతోంది. ఇప్పటికే పెద్దపెద్ద చెట్లు పెరిగి చెట్ల ఊడలు బయటకు వచ్చాయి. ఎవరూ అటువైపు వెళ్లకపోవడంతో కళావిహీనంగా మారుతోంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావి చుట్టూ పెరిగిన చెట్లను తొలగించి బావిలోపల పెరిగిన పూడికను తొలగించడం ద్వారా పురాతన కట్టడానికి పూర్వ వైభవం తీసుకురావచ్చు. బావి పూడిక తొలగిస్తూ నీటి ఊటలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ బావిపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న బావి... –గణపతి పంతులు, లింగంపేట నాగన్నబావికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. అప్పట్లో పంటలకు మోటలద్వారా నీరు పారేదని చెబుతారు. మా చిన్నతనంలో చాలా లోతు ఉండేది. రానురాను పూడుకుపోతుంది. మెట్లు ఎంతో అందంగా ఉన్నాయి. గుమ్మటాలు ఆకర్శనీయంగా ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలు మరెక్కడా కనిపించవు. వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. చారిత్రక కట్టడాన్ని కాపాడాలి... –కొట్టూరి లక్ష్మినారాయణ, లింగంపేట ఎంతో కళానైపుణ్యంతో బావిని, మెట్లను నిర్మించారు. వందల ఏళ్ల క్రితం నాటివైనా, నిర్లక్ష్యానికి గురవుతున్నపటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి చారిత్రక కట్టడాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పెద్దలు ఈ బావి గురించి చర్యలు తీసుకోవాలి. దానికి మరమ్మతులు చేయించి పూర్వ వైభవం తీసుకురావాలి.