breaking news
sadabainama
-
సాదాబైనామా..50 ఏళ్ల హైరానా..! 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా.. తెల్ల కాగితాలపై రాసుకుని జరిపే భూముల క్రయ విక్రయ లావాదేవీలకు పెట్టిన పేరు ఇది. ఈ సాదాబైనామాలు సాధారణమైనవేమీ కాదు.. రామాయణమంత చరిత్ర ఉంది అంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సాదాబైనామాలు సమస్యల్లో చిక్కుకుని 50 ఏళ్లు గడిచినా ఇంతవరకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో 9.24 లక్షల దరఖాస్తులు సాదాబైనామా కింద పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం–1971 అమల్లో ఉన్నప్పుడు 2.4 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, కొత్త రెవెన్యూ చట్టం (2020) అమల్లోకి వచ్చాక మరో 7 లక్షల దరఖాస్తులు పరిష్కారం కోసం వచ్చాయి. 12 రోజుల్లోనే 7 లక్షల మంది కేవలం తెల్లకాగితంపై రాసుకున్నవి కావడం, ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలూ లేకపోవడంతో ఏళ్లు గడిచే కొద్దీ వివాదాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సాదాబైనామాల క్రమబద్ధీకరణ మొదలయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్ 2 లోపు తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 2.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లభించలేదు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టం–1971కి సవరణలు చేసి ఆర్వోఆర్ చట్టం–2020ని అమల్లోకి తెచ్చింది. 2020, అక్టోబర్ 29న ఈ చట్టం అమల్లోకి రాగా, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు మరోమారు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ 12 రోజుల్లోనే 7 లక్షల మంది తమ సాదాబైనామా లావాదేవీలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాగా రెండోసారి దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా 2014, జూన్ 2నే కటాఫ్ డేట్గా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు ఆ 9.4 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించలేదు. 1971 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే.. సాదాబైనామా లావాదేవీలు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యేవి. 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్–1948 ప్రకారం సాదాబైనామా లావాదేవీలను తహశీల్దార్లు క్రమబద్ధీకరించే వారు. రిజిస్ట్రేషన్లు, నోటిమాట, తెల్ల కాగితాల ద్వారా జరిగిన భూముల క్రయవిక్రయ లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని జమాబందీ ద్వారా తహశీల్దార్లు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేవారు. 1970 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1948 చట్టాన్ని సవరించి 1971 ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు ఈ సాదాబైనామాల విషయంలో నిబంధనలు మార్చారు. భూమి కొనుగోలు లావాదేవీలపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటేనే పట్టాదారు పాస్పుస్తకం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో తెల్లకాగితాలు, నోటిమాట లావాదేవీలు అధికారికంగా చెల్లకుండా పోయాయి. ఆ తర్వాత 1989లో ఓసారి 1971 చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం తహశీల్దార్లకు సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సవరణ చట్టం ద్వారానే సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తున్నారు. 1989, 2000, 2014, 2020లో నాలుగుసార్లు ఇలా సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త చట్టంలో అధికారాలేవీ..? అయితే 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో తహశీల్దార్లకు గానీ, ఇతర ఏ స్థాయి రెవెన్యూ యంత్రాంగానికి గానీ సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించలేదు. అసలు సాదాబైనామాల ప్రస్తావనే లేదని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక నోటిఫికేషన్ ఇచ్చి మరీ 7 లక్షల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. పరిష్కార వ్యవస్థను కొత్త చట్టంలో ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు మొత్తం 9.4 లక్షల (20 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంటుందని అంచనా.) సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించాలంటే చట్ట సవరణే మార్గమని, ఆర్వోఆర్ చట్టం–2020కి సవరణ జరిగేంతవరకు ఈ సాదాబైనామాల క్రమబద్ధీకరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల మాట అలా ఉంచితే... 2014 జూన్ 2 తర్వాత జరిగిన సాదాబైనామాల పరిస్థితి ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరి, చట్ట సవరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ, కటాఫ్ డేట్ మార్పు లాంటి అంశాల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో..సాదాబైనామాల అంశాన్ని ఎప్పటికి శాశ్వతంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. -
మాటకు ‘కట్టుబడి’..
♦ పక్కా ప్రణాళికతో డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు నెలలో పూర్తి చేసి తీరుతాం.. ♦ ఆన్లైన్లో సాదాబైనామాలు ప్రజా ఆస్తుల పరిరక్షణే ధ్యేయం ♦ ‘సాక్షి’తో జిల్లా జాయింట్ కలెక్టర్ మాటామంతీ ‘‘నేను వచ్చిన కొత్తలోనే అనంతసాగర్ భూములపై ‘సాక్షి’లో వేసిన వరుస కథనాలు చదివాను. చాలా మంచి ప్రయత్నం.. తరువాత మిగిలిన పత్రికలు కూడా రాసినట్టున్నాయి. 15 రోజుల్లో అనంతసాగర్ గిరిజనులకు అసైన్డ్ భూముల్లో పట్టాలిస్తాం. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తయింది. అటవీ భూములను గుర్తించి మార్కింగ్ పెట్టాం. లబ్ధిదారులను గుర్తించాలని మెదక్ ఆర్డీవో నగేష్ను ఆదేశించాం. ఆయన చాలా పట్టుదలతో అసైన్డ్ భూములను, లబ్ధిదారులను గుర్తించారు. పట్టాలను సిద్ధం చేస్తున్నాం. మంచిరోజు చూసి పట్టాలు పంపిణీ చేస్తాం’’ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవేవీ అద్భుత కట్టడాలు కావు.. అయినా అవి చరిత్రలో నిలబడనున్నాయి. ఆయనేమీ ఇటుకలు పేర్చలేదు.. ఇంటింటికీ నగిషీలు చెక్కలేదు. కానీ అందరూ ఆయన్నే శిల్పి అంటున్నారు. అంత అపురూపంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడి జనాలు ఐదు ఇంగ్లిష్ అక్షరాలు నేర్చుకుంటే.. అందులో మొదటి మూడు అక్షరాలు.. కేసీఆర్, మిగిలిన రెండక్షరాలు.. జేసీ అని వల్లిస్తున్నారు. ఎర్రవల్లిలో రెండు పడక గదుల ఇళ్లకు కేసీఆర్ జీవం పోస్తే.. జేసీ రూపమిస్తున్నారు. రూ 5.4 లక్షల్లో ఒక్క పైసా కూడా వృథా చేయకుండా ఇచ్చిన మాటకు ‘కట్టుబడి’ చేసి చూపిస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లకు తొవ్వజూపేలా ఎర్రవల్లిలో ఇళ్లను నిర్మిస్తున్న జేసీ (జాయింట్ కలెక్టర్), ఎర్రవల్లి డబుల్ బెడ్రూం పథకం ప్రత్యేక అధికారి వెంకట్రామిరెడ్డితో ‘సాక్షి’ ముఖాముఖీ.. సాక్షి: గృహ ప్రవేశం ఎప్పుడు సార్? జేసీ:ముహూర్తం ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. మేం మాత్రం ఆగస్టు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఎర్రవల్లిలో 330, నర్సన్న పేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఒకేసారి పూర్తి చేస్తున్నాం. నిజానికి ఇలాంటి పథకాల పూర్తికి రెండు నుంచి మైడేళ్ల వ్యవ ధి పడుతుంది. కానీ సీఎం ప్రోత్సాహంతో కలెక్టర్, నేను, ఇతర అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్, భవన నిర్మాణ కార్మికులు సమష్టిగా పని చేశాం. 8 నెలల్లోనే పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్లో, సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడం సంతోషంగా ఉంది. సాక్షి: కాంట్రాక్టర్ను ఎలా ఒప్పించారు? జేసీ: ఉద్యోగికైనా, కాంట్రాక్టర్కైనా, సగటు మనిషికి ఎవరికైనా సోషల్ రెస్పాన్స్బిలిటీ అవసరం. ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్కు పదేపదే చెప్పింది ఇదే. ఆయన ఆ స్పృహతోనే పని చేయడంతోనే ఇళ్లు కట్టగలుతున్నాం. ఇక లాభాలంటారా! అన్ని పనులనూ లాభనష్టాలతో ముడి పెట్టలేము. కాంట్రాక్టర్ పది పనులు తీసుకుంటే ఆరు పనుల్లో లాభాలు రావటం, ఒకటి రెండు పనుల్లో గిట్టుబాటు లేకపోవటం, ఇంకొన్నింట్లో నష్టం రావటం సర్వసాధారణం. డబుల్ బెడ్రూం పనుల్లో కాంట్రాక్టర్కు గిట్టుబాటు కాకపోవచ్చేమో కానీ, సామాజిక బాధ్యతతో పని చేశారనే గుర్తింపు దక్కుతుంది కదా! సాక్షి:ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉంది? జేసీ: పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్లకు వైట్ పాలిష్ చేస్తున్నాం. ఇంకొన్నిటికి కరెంటు వైరింగ్ వర్క్ నడుస్తోంది. మిగతా అన్ని పనుల్ని నెల రోజుల్లో పూర్తి చేస్తాం. సాక్షి: జనాలు మిమ్మల్ని ‘జేసీబీ’ అంటారు కదా! జేసీ: (చిరునవ్వుతో) మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. సాక్షి:మీకు కూల్చడమే తెలుసు కదా? ఎర్రవల్లి ప్రజలేమో నిర్మాతగా అభివర్ణిస్తున్నారు? జేసీ: నిజానికి నన్ను ‘జేసీబీ’ అంటారని మీరు చెప్పే వరకు నాకైతే తెలియదు. పటాన్చెరు మండలం శెట్టికుంట, జిన్నారం మండలం దాచారంలో కూలగొట్టిన అక్రమ కట్టడాల గురించి ఇలా అంటున్నారనుకుంటా. నేను జేసీగా చార్జ్ తీసుకున్న కొత్తలోనే ఆ రెండు పనులు పూర్తి చేశాం. ఎంత దుర్మార్గమండీ.. చెరువులను కబ్జాపెట్టి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. ఇక దాచారంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడలేనప్పుడు ఈ సీటులో ఉండి ప్రయోజనం ఏముంది. ప్రజా ఆస్తులను కాపాడే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. సాక్షి: మిలటరీ తరహాలో ఆపరేషన్ పూర్తి చేశారు కదా? జేసీ: అవును. ఆర్భాటపు ప్రచారం లేకుండా పూర్తి చేశాం. శెట్టికుంట మీద దాదాపు 15 రోజులకు పైగా ప్రతి అంశాన్ని అధ్యయనం చేశాం. పక్కా చెరువు భూమిలో దర్జాగా ఇళ్లు నిర్మించేశారు. బిల్డర్ ఎక్కడా చట్టాన్ని గౌరవించలేదు. రాత్రి 12 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసి తెల్లారే సరికి ముగించేశాం. దీనికి ఇంకో కారణం ఉంది. కూల్చివేతకు ఎక్కువ సంఖ్యలో జేసీబీలు అవసరం. ఆ టైంలో అనుకున్నన్ని జేసీబీలు దొరకడంతో పని సులభమైంది. ప్రభుత్వ, శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు ఎప్పటికైనా ప్రమాదమే. సాక్షి:సాదా బైనామా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు? జేసీ: ఇప్పటి వరకు 62 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. అన్నిటినీ పూర్తిగా అప్లోడ్ చేసి ఆన్లైన్ చేస్తున్నా. దాని ద్వారా నోటీసులు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 48 వేల దరఖాస్తులకు పరిష్కారం చూపించగలిగాం. సాదాబైనామాల భూములను పట్టా చేయడంలో పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవహరిస్తున్నాం.