రోడ్డుప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే వైద్యసహాయం అందించి తగినంత పరిహారం చెల్లించాల్సిందిగా వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
వివరాలు.. వైఎస్ఆర్ జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం నాగులగుట్టపల్లె గ్రామానికి చెందిన 60 మంది లారీలో పొలతల పుణ్యక్షేత్రానికి బయలు దేరారు. చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్రోడ్డులో సోమవారం లారీ అదుపుతప్పి ముప్పై అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. లారీ లోయలో పడి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 50మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. దాంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.