breaking news
In the novel
-
నందులో అలాంటి నటుణ్ణి చూశా
– బోయపాటి ‘‘నందు ఆల్ రౌండర్. ఏ తరహా పాత్రలోనైనా... దర్శకుడు కోరుకున్నట్లు కనిపించగలడు. నందులో అలాంటి నటుణ్ణి చూశా. ఇదొక్కటే కాదు... ముందు ముందు నందు నటించే చిత్రాలూ హిట్టవ్వాలి. వాటిలో ఈ సినిమా ముందుండాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. నందు, సౌమ్య వేణుగోపాల్ జంటగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో ఎస్. శ్రీకాంత్రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మించిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. పూజ రామచంద్రన్ కీలకపాత్ర చేశారు. ఆదివారం నందు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను బోయపాటి శ్రీను విడుదల చేశారు. అనంతరం నందు మాట్లాడుతూ– ‘‘బోయపాటి గారు నాకు దేవుడిచ్చిన అన్నయ్య. ‘జయ జానకి నాయక’లో మంచి పాత్ర ఇచ్చారు. దాంతో నాకు బాగా గుర్తింపు వచ్చింది. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే, మంచి కథాంశంతో తెరకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఉత్కంఠభరితమైన కథనంతో విభిన్నంగా ఉండే చిత్రమిది. అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సహనిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్, కెమెరా: ఎస్. మురళీమోహన్రెడ్డి, సంగీతం: యాజమాన్య. -
పతంజలి-మోహన్
పురస్కార ప్రదానం పతంజలి తన తొలి నవల ‘ఖాకీవనం’ను శ్రీశ్రీ, చాసో, రావిశాస్త్రిలకు అంకితం ఇచ్చాడుగానీ వాస్తవానికి ఆయన గురజాడ స్కూల్కి నిజమైన వారసుడు. కన్యాశుల్కంలో గిరీశం లెక్చర్ అంతా విన్నాక బండివాడు ‘అయితే మా వూరి పోలీసుకు ఎప్పుడు బదిలీ అవుతుంది’ అని అడుగుతాడు. ఒక రకంగా ఆ మాటకు కొనసాగింపే పతంజలి ఖాకీవనం. పోలీసు వ్యవస్థపై పతంజలి వేసిన ఇరవయ్యవ శతాబ్దపు అత్యుత్తమ చురక- ఖాకీవనం. దీని ఛాయ ఆయన కథ ‘చూపున్న పాట’లోనూ ఆ తర్వాత ‘పిలక తిరుగుడు పువ్వు’లోనూ కనిపిస్తుంది. పిలక తిరుగుడు పువ్వులో ఆఖరున పోలీసు ప్రభువు ఇలా అంటాడు- ‘ఆలమండ గ్రామస్తులందరికీ భూమి ఎలాగుందో అర్థం అయిందా లేదా? జాగ్రత్తగా వినండి. భూమి గుండ్రంగా లేదు. బల్లపరుపుగా కూడా లేదు. భూమి నా టోటీ లాగుంటాది. భూమి పోలీసోడి లాఠీ లాగుంటాది.’... ప్రపంచస్థాయి రచన చేయడంలో గురజాడ తర్వాత పతంజలి పేరు చెప్పాలి. పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, రచయితగా తన యాభై ఏడేళ్ల జీవితంలో పతంజలి సాధించిన అభివృద్ధి రేటు గమనించినా ఆయన పక్కన నంబర్ టు నంబర్ త్రీ అంటూ వేరే ఎవరినైనా నిలబెట్టడం కష్టం. గురజాడ ఒక గిరిశాన్ని చిత్రించి ఊరుకుంటే మనుషులందరిలో దాగిన గిరీశాల సామూహిక దర్శనం చేయించినవాడు పతంజలి. అందుకు ఉదాహరణ ‘గోపాత్రుడు’. భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా అంటూ ఆల్బర్ట్ కామూ స్థాయిలో ఒక తాత్విక విరోధాభాష సాధించినవాడు పతంజలి. లోకం మీద వ్యంగ్యపు అక్షౌహిణులను నడిపించి దుర్మార్గపు వ్యవస్థల మీద కురుక్షేత్ర యుద్ధం చేసిన సాహిత్య సరోత్తమ సేనాని ఆయన. మరి అలాంటి రచయిత మీద తొలి పురస్కారం ఎవరికిస్తాం? ఇంకెవరికి? చిత్రకారుడు మోహన్కే. రాతలో పతంజలి చేసిన పని చిత్రకారుడిగా మోహన్ గీతలో చేశాడు. కార్టూనిస్టుగా ఆయన రాజకీయ నాయకులకు పెట్టిన వాతలు, పోస్టర్లతో ఉద్యమాలకు ఊదిన ఊపిరులు, భిన్న సందర్భాలలో చేసిన రచనలు పతంజలి వలే మోహన్ను కూడా ప్రజల పక్షాన నిలబెట్టాయి. హాస్యం, వ్యంగ్యం అనే పచ్చి బెత్తాలతో వ్యవస్థను చక్కదిద్దే పని చేశాయి. అందుకే విశాఖలో ఉత్సవం. ఈ ఆదివారం (మార్చి 29) పతంజలి జన్మదినం సందర్భంగా విజయనగరంలో మోహన్కు పురస్కార ప్రదానం. ఈ సందర్భంగా ‘పతంజలి సాహిత్యావలోకనం’ పేరిట మొజాయిక్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో సభ. విశాఖ మ్యూజియంలో 28, 29 తేదీలలో మోహన్ చిత్రాల ప్రదర్శన. ఒక రాతను తలచుకుని, ఒక గీతను నమస్కరించుకునే ఈ ఉత్సవానికి అందరికీ ఆహ్వానం. - రామతీర్థ -
కులం మేడిపండు విప్పి చూపిన దాటు
80 ఏళ్ల కింద కన్నడ గ్రామీణ జీవితంలో బలంగా పాతుకుపోయిన కుల వ్యవస్థలోని కుళ్లుని మన ముందు నిలబెట్టిన మూడు తరాల ఆలోచనే ఈ నవల. ‘బ్రాహ్మణత్వానికి రెండు నియమాలున్నాయి. ఆత్మజ్ఞానం, వేదం. వేదం అంటే జ్ఞానం. కనక ప్రతి ఆత్మకూ జ్ఞానం పొందే అధికారం- అంటే వేదాధ్యయన అధికారం ఉన్నది. అధికారం ఒకరిని అడిగి పుచ్చుకోవలసినది కాదు. చెలాయించవలసినది. మీరందరూ అధికారం చెలాయించండి. మీరందరూ బ్రాహ్మణులే’.... తమ తమ కులాలని గొప్పవిగా గుర్తించాలంటూ ఊరి గుడి ముందు పోగయిన కుల పెద్దలతో ‘దాటు’ నవల ప్రధాన పాత్ర సత్యభామ చెప్పిన మాటలివి. దాటు- సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన కన్నడ నవల. రాసింది ఎస్.ఎల్.బైరప్ప. సినిమాలు తెలిసిన వారికి ‘వంశవృక్షం’ ద్వారా, సాహిత్య పరిచయం ఉన్నవారికి ‘పర్వ’ నవల ద్వారా బైరప్ప బాగా తెలిసిన రచయిత. ఆయన రచనలు తెలుగుకి అనువాదం అయ్యే ఆనవాయితీ ఉంది. ‘దాటు’ను పరిమి రామసింహం తెలుగులోకి తీసుకు వచ్చారు. 80 ఏళ్ల కింద కన్నడ గ్రామీణ జీవితంలో బలంగా పాతుకుపోయిన కుల వ్యవస్థలోని కుళ్లుని మన ముందు నిలబెట్టిన మూడు తరాల ఆలోచనే ఈ నవల. ఒక్క కర్నాటకకే కాదు మొత్తం దేశంలో ఈ రోజుకు కూడా సమాజాన్ని వెనక్కు లాగుతున్న ఈ రుగ్మతకు అందులో ఉన్న అంతర్గత వైరుధ్యాలకి ఈ నవల ఒక నిలువుటద్దం. పూజారి వెంకట రమణయ్యగారి కూతురు సత్య. బాగా చదువుకోవడమే కాకుండా అభ్యుదయ భావాలు ఉండి కుల వ్యవస్థపై నమ్మకం లేని వ్యక్తి. ఉపమంత్రి, ఆలయ ధర్మకర్త అయిన మేలగిరి గౌడ కొడుకు శ్రీనివాసు, సత్య ప్రేమించుకుని పెళ్లికి సిద్ధపడతారు. ‘ఒక్కలింగ’ కులంలోకి బ్రాహ్మణుల పిల్ల కోడలుగా రావటం మంత్రిగారికి ఇబ్బందేమి లేదుగాని కాకపోతే ఈలోపు డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వేరే గౌడగారు పిల్లనిస్తామని వచ్చారు. వారి రాజకీయ బలంతో కేబినెట్ మంత్రిని కావచ్చుననే ముందుచూపుతో గౌడ తన భార్య అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని సత్య అన్న వెంకటేశం సహాయంతో పెళ్లి చెడగొడతాడు. జరిగిన సంఘటనలతో పాటు తనకి మాదిగ మాతంగితో ఉన్న పాత జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేయటంతో పూజారి వెంకట రమణయ్య ఆత్మహత్య చేసుకుంటాడు. తన వాటాగా తండ్రి ఇచ్చిన పొలంలో అన్నకు దూరంగా సొంతంగా వ్యవసాయం చేసుకుంటుంది సత్య. మాదిగ ఎం.ఎల్.ఏ బెట్టయ్యగారి కొడుకు మోహన్దాసు, కూతురు మీరాలతో పరిచయం అవుతుంది. మోహన్దాసు దళితులు తిరగబడి, ఆయుధాలు తీసుకుంటేగాని సమాజంలో మార్పు రాదని నమ్మిన వ్యక్తి. ఇంతలో మంత్రిగారి కొడుకు శ్రీనివాసు భార్యను పోగొట్టుకుని చెడు అలవాట్ల పాలవుతాడు. తండ్రి ప్రోత్సాహంతో సత్యకు మళ్లీ దగ్గర అవడానికి ప్రయత్నిస్తాడు. సత్య తనకు పెళ్లి మీద నమ్మకం లేదని, మీరాను చేసుకోమని సూచిస్తుంది. శ్రీనివాసు నెమ్మదిగా మీరాకు దగ్గర అవుతాడు. బ్రాహ్మణ అమ్మాయి అయితే పర్వాలేదుగాని, ఈ మాదిగ అమ్మాయితో వ్యవహారం మంత్రిగారిని కలవరపెడుతుంది. మళ్లీ సత్య అన్న వెంకటేశం సహాయంతో శ్రీనివాసు మనసు చెడగొడతాడు. మీరా ఆత్మహత్య చేసుకుంటుంది. శ్రీనివాసుకి మతి చెడుతుంది. దళిత విప్లవంలో భాగంగా మోహన్దాసు మొదలుపెట్టిన ఆలయ ప్రవేశ కార్యక్రమం రసాభాసగా మారుతుంది. మోహన్దాసు బాంబులతో చెరువుగట్లను పేల్చివేయడంతో ఆ జలప్రళయంలో అంటరానితనానికి ప్రతీకగా నిల్చిన ఊరి గుడి కొట్టుకుపోవడంతో నవల ముగుస్తుంది. ఈ నవలలో పాత్రలన్నీ మన మధ్య ఉన్న మనుషులే. బ్రాహ్మణ గర్వం, పురుష అహంకారానికి ప్రతీక సత్య అన్న వెంకటేశం తనకు లాభం వచ్చే ఏ పనైనా సరే చేయడానికి వెనుకాడడు. పదేళ్లుగా కాపురం చేస్తున్న భార్యను కూడా ఆస్తి కోసం వదిలేయడానికి సిద్ధపడతాడు. మంత్రి మేలగిరి గౌడ తన చేతుల పాడవకుండా తనకి ప్రయోజనం కలిగించేలా ఏ సంఘటననైనా మలుచుకోగలిగిన రాజకీయ నాయకుడు. మాదిగ బెట్టయ్య గాంధేయవాది. ఈ పైకులాలతో మనకెందుకు? మనకి హాని కలిగించకుండా ఉంటే చాలు అనే తత్వం. అందుకు విరుద్ధం ఆయన కొడుకు మోహన్దాసు. ప్రధాన పాత్రల మధ్య జరిగే సంభాషణలు, సత్య తనలో తాను అనుకునే విషయాలు చదివే వాళ్లలో చాలా ఆలోచనలు రేకెత్తిస్తాయి. ఈరోజు రాజకీయాల కోసం ఓట్ల కోసం కుల సంఘాలని పెంచి పోషిస్తూ కులాల వారీ రాజ్యాధికారాన్ని పంచుకోవటం చూస్తున్నాము. సాంకేతికంగా ఎంతో సాధించాం అని చెప్పుకుంటున్న మనం ‘ఖాప్’ పంచాయితీలు, పరువు హత్యలు, దళితుల ఊచకోతలు, ఆడవాళ్ల మీద అరాచకాలు టి.వి.ల ద్వారా మన గదుల్లోకే చొచ్చుకుని వస్తున్నప్పుడు నిస్సహాయంగా చూడటం తప్ప ఏం చేయగలుగుతున్నాం? ఇవన్నీ దాటాలి అంటే ఏదో ఒక బలమైన శక్తి రావాలి. - కృష్ణమోహనబాబు 9848023384