breaking news
Non-judicial stamp papers
-
త్వరలో ఒకటే స్టాంపు పేపర్!
సాక్షి, హైదరాబాద్: సరికొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లలో రూ.20, రూ.50 విలువగల పేపర్లను రద్దుచేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. బహుళ ప్రయోజనకరంగా ఉపయోగించే నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల (ఎన్జేఎస్) విధానంతోపాటు అనేక అంశాల్లో మార్పులు చేస్తూ కొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. కొత్త విధానంలో స్టాంపు డ్యూటీ విధింపు, మినహాయింపుల్లో కూడా మార్పులు రానున్నాయి. కొత్త పాలసీ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, చర్చల అనంతరం దీనికి తుదిరూపు ఇస్తారని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. లాభం లేదు.. భారమే అధికం రాష్ట్రంలో ప్రస్తుతం రూ.20, రూ.50, రూ.100 స్టాంపు పేపర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసిన స్టాంపు వెండార్లతోపాటు రిజి్రస్టేషన్ల శాఖ వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది. రూ.50 వేల విలువ వరకు జరిగే లావాదేవీలకు రూ.20.. రూ.లక్ష లోపు లావాదేవీలకు రూ.50.. రూ.లక్ష కంటే ఎక్కువ విలువ ఉండే లావాదేవీలకు రూ.200 చొప్పున (రూ.100 స్టాంపు పేపర్లు రెండు) స్టాంపు పేపర్లను ఉపయోగిస్తున్నారు. పలు రకాల అఫిడవిట్లు, డిక్లరేషన్లు, ఒప్పంద పత్రాలు, సేల్డీడ్లు, కంపెనీల మధ్య ఒప్పందాలు తదితర అనేక లావాదేవీల్లో వీటిని ఉపయోగిస్తుంటారు.ప్రస్తుతం భౌతికమైన స్టాంపు పేపర్లతోపాటు ఆన్లైన్ ఫార్మాట్ (ఫ్రాంకింగ్)లో ఈ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నాసిక్లోని ముద్రణాలయం నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వీటి నిర్వహణ, సీలింగ్, పేపర్, రవాణా లాంటి ఖర్చులు కలిపితే రూ.20, రూ.50 స్టాంపులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వానికి వాటి విలువ కంటే ఎక్కువ ఖర్చవుతోందని, స్టాంపు వెండార్లకు ఇచ్చే 5 శాతం కమీషన్ కలిపితే వీటి అమ్మకాల వల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోందని రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో రూ.20, రూ.50 స్టాంపు పేపర్లను రద్దు చేయాలని, రూ.100 విలువైన పేపర్లను మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా స్టాంపు పేపర్ల సరఫరా నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుని ఫ్రాంకింగ్ విధానంలో మాత్రమే ముందుకెళ్లేలా కొత్త పాలసీలో పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రతి లావాదేవీకి రూ.100 స్టాంపు పేపర్లు కొనుగోలు చేయడం విద్యార్థులు, రైతులు వంటి వర్గాలకు భారమవుతుందని భావించి.. ఆయా వర్గాలు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కార్యక్రమాల్లో ఇచ్చే అఫిడవిట్లు, డిక్లరేషన్లను మాత్రం ఉచితంగా ఇచ్చేలా పాలసీలో మార్పులు తేవాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు.కొందరికి మినహాయింపు: స్టాంపు డ్యూటీ విషయంలోనూ కొత్త పాలసీలో మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములు లేదా ఆస్తులను మహిళల పేరిట రిజి్రస్టేషన్ చేస్తే స్టాంపు డ్యూటీలో 1 శాతం మినహాయింపు ఇవ్వాలని యోచిస్తోంది. కాంట్రాక్టు పనులకు ప్రస్తుతం గరిష్టంగా రూ.200 స్టాంపు డ్యూటీ విధిస్తుండగా ఇకపై ‘బూట్’ పద్ధతిలో నిర్వహించే కాంట్రాక్టు పనులకు స్టాంపు డ్యూటీని విధించాలని, మొత్తం పని విలువలో 0.5 శాతాన్ని డ్యూటీ కింద వసూలు చేయాలని, ఈ మొత్తం గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఉండేలా కొత్త పాలసీలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
ఊరూరా ‘రిజిస్ట్రేషన్’ స్టాంపులు
పోస్టల్ శాఖతో సర్కారు ఎంవోయూ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ పోర్టల్ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రా మాల్లోనూ నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు ల భ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సెప్టెంబరు 1 నుంచి పట్టణ ప్రాంతాల్లోని 859 పోస్టాఫీసుల్లోనూ, త్వరలో 6,500 గ్రామీణ పోస్టాఫీసుల ద్వారా ఈ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు చెప్పారు. సచివాలయంలో గురువారం ఉప ముఖ్యమంత్రి సమక్షంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పోస్టల్ శాఖల ఉన్నతాధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్ఐసీ సహకారంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధునీకరించిన వెబ్పోర్టల్ ను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజి స్ట్రేషన్ల శాఖకు సంబంధించిన మరికొన్ని ఐటీ ఆధారిత సేవలను ప్రజలకు అందుబాట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యద ర్శి వీకే అగర్వాల్, కమిషనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వెంకట రాజేశ్, పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి, ఎన్ఐసీ ఉన్నతాధికారి రామ్మోహన్రావు పాల్గొన్నారు. కొత్త ‘రిజిస్ట్రేషన్’ సేవలిలా.. పోర్టల్ నుంచే అధికారులతో ఇంట రాక్షన్ నవీకరించిన రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు నేరుగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఇంటరాక్ట్ కావచ్చు. తమ ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి స్టాంపు డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను పొందవచ్చు. వెబ్ పోర్టల్ సేవలు ఈ నెల 11 నుంచి లభ్యమవుతాయి. పబ్లిక్ డేటా ఎంట్రీ వ్యవస్థ రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తుల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సమర్పించేందుకు కనీసం గంట పడుతోంది. వెబ్ పోర్టల్లోని పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఏ కంప్యూటర్ నుంచైనా ముందుగానే డేటాను ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ క్షణాల్లో పూర్తి అవుతుంది. ముందుగానే స్లాట్ బుకింగ్ ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ఎవరైనా తాము కోరుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దీని కోసం ఆయా కార్యాలయాల వద్ద తమ వంతు వచ్చిందాక ఇక నుంచి నిరీక్షించాల్సిన పనిలేదు. వెబ్ పోర్టల్ ద్వారా ముందుగా స్లాట్ (ఫలానా రోజు, సమయం)ను బుక్ చేసుకోవచ్చు. ఒకరికి కేటాయించిన స్లాట్(సమయం)లో మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుకాదు. పెండింగ్ పత్రాలూ ఈసీలో ప్రత్యక్షం ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ పూర్తయిన డాక్యుమెంట్ల వివరాలే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్(ఈసీ)లో కనిపిస్తాయి. తాజాగా రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్న పత్రాల వివరాలను కూడా ఇకపై ఈసీలో కనిపించేలా అధికారులు ఏర్పాటు చేశారు. పెండింగ్కు తగిన కారణాలను కూడా పేర్కొంటారు. ఎస్ఎంఎస్ అలర్ట్ ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి వివిధ దశల్లో డాక్యుమెంట్ స్టేటస్ను సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్) రూపంలో వినియోగదారుని మొబైల్కు అందనుంది. రిజిస్ట్రేషన్ దరఖాస్తు నుంచి రిజిస్ట్రేషన్ ముగింపు వరకు వివిధ దశల్లో డాక్యుమెంట్ స్టేటస్ను తెలుసుకునేందుకు వీలవుతుంది. 2 షిఫ్టుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రాష్ట్రవ్యాప్తంగా రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను రెండు షిఫ్టులుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్లోని బోయినపల్లి, మారేడ్పల్లి సబ్రిజిస్ట్రార్ కా ర్యాలయాలను ఎంపిక చేశారు. ఈ నెల 17 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 9 గంటలవరకు ఈ కార్యాలయాలు పనిచేస్తాయి. దీనిద్వారా ఉద్యోగులు, వ్యాపారులు వీలైన సమయాల్లోనే రిజిస్ట్రేషన్కు వెళ్లవచ్చు. పోస్టాఫీసుల ద్వారా స్టాంపుల విక్రయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ కలిగిన పోస్టల్శాఖతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబరు 1 నుంచి పోస్టాఫీసుల్లో నాన్ జ్యుడీషియల్ స్టాంపులను నగదు చెల్లించి లేదా క్రెడిట్ కార్డు ద్వారా(క్యాష్లెస్) కొనుగోలు చే యవచ్చు. పోస్టల్ శాఖ అందించే 343 రకాల సేవలను‘వన్ స్టాప్ షాప్’ల ద్వారా ప్రజలకు మరింత అందుబాట్లోకి తెచ్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. మున్ముందు మరిన్ని సేవలు కీలకమైన పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని, ప్రతి రిజిస్ట్రేషన్ను ఆధార్తో లింక్ చేయాని సర్కారు భావిస్తోంది. త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఆదివారం కూడా పని చేసేవిధంగా సర్కార్ చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.