breaking news
new bank licence
-
బ్యాంకింగ్ రేస్లో... టాటా, బిర్లా, బజాజ్!
ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఆర్థిక రంగం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో బ్యాంకింగ్ రంగం బలహీనంగానే ఉంది. మన బ్యాంకింగ్ రంగంలో అధిక ప్రభావం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్లు మొండిబకాయిల భారంతో కునారిల్లుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదకత రంగాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మరిన్ని ప్రైవేట్ బ్యాంక్లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. భారీ కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించడం, రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్లుగా మారే వెసులుబాటును ఇవ్వడం, ప్రమోటర్ వాటాను 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలు వాటిల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి మరో మూడు నెలలు పట్టవచ్చు. ముందు వరుసలో భారీ ఎన్బీఎఫ్సీలు... బ్యాంక్ లైసెన్స్లు పొందడానికి టాటా, బిర్లా, బజాజ్, పిరమళ్ సంస్థలు రేసులో ఉన్నాయి. ఈ దిగ్గజ సంస్థలకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్(ఎన్బీఎఫ్సీ) సంస్థలున్నాయి. రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్లుగా మార్చుకునే వెసులుబాటు ఉండటం ఈ సంస్థలకు కలసివస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన టాటా క్యాపిటల్ ఆస్తులు రూ.83,280 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ ఆస్తులు రూ.46,807 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఆసక్తిగా ఉన్నామని టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రతిపాదనలే వెలువడ్డాయని, ఈ దశలో తమ బ్యాంకింగ్ ప్రణాళికలను వివరించడం సముచితం కాదని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్పష్టత వచ్చాక ఈ విషయమై పరిశీలన జరుపుతామని వివరించారు. 2012లో కూడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్లు ఇస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పుడు టాటా గ్రూప్ కూడా దరఖాస్తు చేసింది. అయితే నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయంటూ 2013లో తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఇక బిర్లా గ్రూప్నకు చెందిన ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆస్తులు రూ.70,015 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఈ సంస్థ కూడా రేసులో ఉంటుందని నిపుణులంటున్నారు. మరోవైపు పిరమళ్ గ్రూప్ కూడా బ్యాంక్ లైసెన్స్ రేసులో ఉంది. సంక్షోభంలో కూరుకుపోయిన డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ గ్రూప్ ఎన్బీఎఫ్సీ ఆస్తులు రూ.50,000 కోట్ల మేర ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో పిరమళ్ గ్రూప్నకు మంచి అనుభవం ఉంది. అయితే ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్స్పోజర్ బాగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని కొంతమంది నిపుణులంటున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తుల్ని కొనుగోలు చేస్తే, పిరమళ్ గ్రూప్నకు నిలకడైన క్యాష్ ఫ్లోస్ ఉంటాయని వారంటున్నారు. బ్యాంక్ లైసెన్స్ల కోసం 2012లోనే బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సంస్థలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్లకు మాత్రమే అప్పుడు లైసెన్స్లు లభించాయి. తాజా ప్రతిపాదనల కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ తదితర సంస్థలు తమ ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేయవచ్చని నిపుణులంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్...! కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్లు ఇచ్చే దిశగా ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సూచనలు చేసింది. అయితే ఈ కమిటీలో ఒక్క వ్యక్తి మినహా మిగిలిన వారందరూ కార్పొరేట్లకు బ్యాంక్ లైసెన్స్లు ఇవ్వొద్దనే సూచించారు. అయితే బ్యాంకింగ్ చట్ట సవరణ అంశాన్ని ఈ కమిటీ ప్రభుత్వ అభీష్టానికే వదిలేసింది. కాగా ఇవి సాహసోపేత ప్రతిపాదనలని నిపుణులంటున్నారు. అయితే కార్పొరేట్ హౌజ్లకు బ్యాంక్ లైసెన్స్లు లభించడం కష్టమేనని మాక్వెరీ క్యాపిటల్ పేర్కొంది. అంతే కాకుండా యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ల సంక్షోభం నేపథ్యంలో ఉదారంగా బ్యాంక్ లైసెన్స్లు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని వివరించింది. కాగా కార్పొరేట్ హౌజ్లకు బ్యాంక్ లైసెన్స్లు ఇవ్వడం ప్రమాదకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు సరికాదు..! రేటింగ్ దిగ్గజం ఎస్ అండ్ పీ ప్రకటన బడా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. భారత్ కార్పొరేట్ పాలన బలహీనంగా ఉందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా రుణ చెల్లింపుల్లో వైఫల్యం చెందుతున్నాయని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తుందని తెలిపింది. కొత్తగా బ్యాంకులను నెలకొల్పడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన ఒక నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయానికి ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఎస్అండ్పీ ప్రకటనలో ముఖ్యాంశాలు ... ► కార్పొరేట్లే బ్యాంకింగ్ నిర్వహించే అంశంలో పలు క్లిష్టతలు ఉంటాయి. అంతర్గత గ్రూప్లకు రుణం, నిధుల మళ్లింపు, పరస్పర ప్రయోజనాల కోణంలో ప్రశ్నలు, ఆర్థిక స్థిరత్వం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. రుణ బకాయిల చెల్లింపుల్లో కార్పొరేట్ల వైఫల్యాల వల్ల ఫైనాన్షియల్ వ్యవస్థలో నెలకొనే ప్రతికూలతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలూ ఉంటాయి. ► 2020 మార్చి నాటికి మొత్తం కార్పొరేట్ రుణాల్లో దాదాపు 13% మొండిబకాయిలు(ఎన్పీఏ)గా మారడం ఇప్పుడు చర్చనీయాంశం. ఇతర దేశాలతో పోల్చితే భారత్లో ఎన్పీఏల సమస్య తీవ్రంగా ఉంది. ► అయితే రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 సంవత్సరాలకు పైగా చక్కటి వ్యాపార నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులగా మార్చే ప్రతిపాదన మంచిదే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. అది పిడుగుపాటే..! కార్పొరేట్ బ్యాంకింగ్పై రఘురామ్ రాజన్, విరాల్ ఆచార్య ఆర్బీఐ మాజీ గరవ్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యలు కూడా ఈ అంశంపై తీవ్ర ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని అమలుచేస్తే, అది బ్యాంకింగ్పై పిడుగుపాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు సంయుక్తంగా రాసిన ఒక ఆర్టికల్ సోమవారం రాజన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పోస్ట్ అయ్యింది. బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ సంస్థల జోక్యం ఎంతమాత్రం సమంజసం కాదని ఆర్టికల్ పేర్కొంది. ఇలాంటి క్లిష్ట రుణదాత–గ్రహీత అనుసంధాన వ్యవస్థ సజావుగా మనుగడ సాగించిన చరిత్ర ఏదీ లేదనీ పేర్కొంది. రుణ గ్రహీతే యజమానిగా ఉన్న ఒక బ్యాంక్ మంచి వ్యాపారం ఎలా చేయగలుగుతుందని ఆర్టికల్ రచయితలు ప్రశ్నించారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట జరిగే ‘పేలవ రుణ తీరు’ను ప్రతిసారీ కట్టడి చేయడం సాధ్యంకాదని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువయ్యిందని ఆర్టికల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్ ప్రతిపాదన మంచిదికాదని స్పష్టం చేసింది. ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ‘‘అసలు ఇప్పుడు ఈ అవసరం ఏమి వచ్చింది...’’ అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోందని ఆర్టికల్ పేర్కొంది. ఆర్బీఐ అధికారాల పెంపు అవశ్యం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారాలను మరింత పెంచాలన్న సూచించిన ఆర్టికల్, ఈ పరిస్థితి ఉన్నట్లయితే, మొండిబకాయిల సమస్య ఇంతలా పెరిగేది కాదనీ స్పష్టం చేసింది. ఆర్బీఐకి మరిన్ని అధికారాలు, మొండిబకాయల తగ్గింపునకు ఆర్బీఐ వర్కింగ్ కమిటీ చేసిన పలు ప్రతిపాదనలను తొలుత అమలు చేయాలని, ‘కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్’ను ప్రస్తుతం పక్కనపడేయాలనీ తమ ఆర్టికల్లో ఆర్థిక నిపుణులు సూచించారు. ప్రపంచంలో పలు దేశాల తరహాలోనే భారత్లో కూడా బ్యాంకింగ్ వైఫల్యం వల్ల ఖాతాదారులు నష్టపోయే పరిస్థితి ఉండదని వారు అన్నారు. ఇందుకు యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంకులను ప్రస్తావించారు. అందువల్ల బ్యాంకుల్లో తమ డబ్బుకు భద్రత ఉంటుందని డిపాజిటర్లు భావిస్తారని పేర్కొన్నారు. అందువల్లే బ్యాంకులు పెద్ద ఎత్తున డిపాజిట్లను సమీకరించగలుగుతున్నాయని కూడా విశ్లేషించారు. ప్రస్తుతం రాజన్, ఆచార్యలు ఇరువురూ అమెరికాలో ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ప్రొఫెసర్గా రాజన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, స్టెర్న్ స్కూల్ ప్రొఫెసర్గా ఆచార్య పనిచేస్తున్నారు. -
కొత్త బ్యాంకులకు లైన్ క్లిమర్
న్యూఢిల్లీ: దేశంలో కొత్త బ్యాంకుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కు బ్యాంకింగ్ లెసైన్స్ల జారీకి అనుమతిస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) ఆమోదముద్ర వేసింది. దీంతో గత కొద్దివారాలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. ‘కొత్త బ్యాంకింగ్ లెసైన్స్లకు సంబంధించి తగిన చర్యలు(జారీ చేసేందుకు సూత్రప్రాయ అనుమతి) చేపట్టడం సహేతుకమేనని భావిస్తున్నాం’ అని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్కు ఈసీ మంగళవారం రాసిన లేఖలో స్పష్టం చేసింది. వాస్తవానికి గత నెల చివరికల్లా కొత్త బ్యాంకింగ్ లెసైన్స్లు ఇవ్వాలన్న ఆర్బీఐ గడువు ముగిశాక ఈసీ గ్రీన్సిగ్నల్ లభించడం గమనార్హం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లెసైన్స్ల జారీ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చా.. లేదా అనేదానిపై మార్గనిర్ధేశం చేయాలంటూ ఈసీకి గత నెల 13న ఆర్బీఐ లేఖ రాయడం తెలిసిందే. దీనిపై కమిషన్ కొన్ని వివరణలు కోరగా, దానికి ఆర్బీఐ సమాధానం కూడా ఇచ్చింది. దీన్ని పరిశీలించిన ఈసీ.. ఎట్టకేలకు లైన్క్లియర్ చేసింది. కాగా, అంతక్రితం పాలసీ సమీక్ష సందర్భంగా గవర్నర్ రాజన్ మాట్లాడుతూ.. ఈసీ ఆమోదం లభించిన వెంటనే లెసైన్స్ల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. ఆర్బీఐ కేంద్ర బోర్డులో చర్చించి సాధ్యమైనంతం తొందరగా లెసైన్స్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని రాజన్ వెల్లడించారు. 25 కంపెనీల పోటీ... గతేడాది జూలైలో కొత్త బ్యాంకింగ్ లెసైన్స్ల కోసం ఆర్బీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన మొత్తం 27 కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. అయితే, ఆతర్వాత టాటా గ్రూప్, వేల్యూ ఇండస్ట్రీస్లు వైదొలగడంతో ప్రస్తుతం లెసైన్స్ల రేసులో 25 కంపెనీలు మిగిలాయి. ఈ జాబితాలో ప్రభుత్వరంగ ఇండియా పోస్ట్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఐఎఫ్సీఐ, ఐడీఎఫ్సీలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగం నుంచి అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్అండ్టీ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ క్యాపిటల్ తదితర కంపెనీలు ఉన్నాయి. కాగా, దరఖాస్తులను మదింపు చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ.. ఫిబ్రవరిలోనే తన నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. లెసైన్స్లకు అర్హత ఉన్న కంపెనీల పేర్లను కూడా నివేదికలో సూచించినట్లు సమాచారం. కాగా, కొత్త బ్యాంకుల ఏర్పాటుకు అత్యధికంగా అవకాశాలున్న సంస్థల్లో ఇండియా పోస్ట్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఐడీఎఫ్సీలు ముందువరుసలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తంమీద 4-5 వరకూ కొత్త లెసైన్స్లు ఆర్బీఐ ఇవ్వొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చివరిసారిగా దశాబ్దం క్రితం.. గడిచిన 20 ఏళ్లలో ఆర్బీఐ మొత్తం రెండు దశల్లో 12 ప్రైవేటు రంగ బ్యాంకులకు లెసైన్స్లు జారీ చేసింది. 1993 జనవరిలో ప్రవేశపెట్టిన మార్గదర్శకాలకు అనుగుణంగా 10 బ్యాంకులకు లెసైన్స్లు దక్కాయి. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్(గతంలో యూటీఐ బ్యాంక్), ఇండస్ఇండ్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటివి ఉన్నాయి. కాగా, కొంత కాలం తర్వాత ఈ 10 కొత్త బ్యాంకుల్లో 4(టైమ్స్ బ్యాంక్, సెంచూరియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ పంజాబ్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్) బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనమయ్యాయి. 2001లో బ్యాంకింగ్ లెసైన్స్ల మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ఇక చిట్టచివరిసారిగా 2003-04 ఆర్థిక సంవత్సరంలో యస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులకు ఆర్బీఐ లెసైన్స్లు ఇచ్చింది. మూడేళ్లపాటు కసరత్తు అనంతరం 2013 ఫిబ్రవరిలో ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ లెసైన్స్లకు మళ్లీ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో 26 ప్రభుత్వరంగ, 22 ప్రైవేటురంగ బ్యాంకులు ఉన్నాయి. వీటితోపాటు 56 రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ)లు కూడా పనిచేస్తున్నాయి. 41 విదేశీ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. మరో 46 విదేశీ బ్యాంకులకు భారత్లో కార్యాలయాలు ఉన్నాయి. -
కార్పొరేట్లకు బ్యాంక్ లెసైన్స్లు వద్దు
వడోదర: ప్రైవేట్ సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్లు ఇవ్వడాన్ని ది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకింగ్ లెసైన్స్లు ఇవ్వడం దేశ ప్రయోజనాలకు హానికరమని, వాళ్ల స్వప్రయోజనాలకే వీటిని వాడుకుంటారని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంకింగ్ సేవలు కూడా ఖరీదవుతాయన్నారు. ప్రభుత్వం కొత్తగా బ్యాంకింగ్ లెసైన్స్లు ఇవ్వాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ఫెడరేషన్ ఆప్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్స్ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1969కు ముందు బ్యాంకులను ప్రైవేట్ వ్యాపార సంస్థలే నిర్వహించేవని, వాటి అస్తవ్యస్త విధానాల కారణంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టపరచాల్సిన అవసరముందని వెంకటాచలం స్పష్టంచేశారు. -
కొత్త బ్యాంక్ లెసైన్సులకు మరికొంత సమయం: ఆర్బీఐ
ముంబై: కొత్త బ్యాంకులకు లెసైన్సుల విషయంలో నిబంధనలను సరళీకరించే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా (బ్యాంకింగ్ పర్యవేక్షణా విభాగం ఇన్చార్జ్) సోమవారం స్పష్టం చేశారు. లెసైన్సుల కోసం వచ్చిన 26 దరఖాస్తులపై ఆర్బీఐ అంతర్గత పరిశీలన మొదలైందని కూడా వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తికి మరికొంత కాలం పడుతుందని తెలిపారు. అనంతరం ఈ దరఖాస్తుల పరిశీలనకు మరొక కమిటీ (ఎక్స్టర్నల్)ని నియమించడం జరుగుతుందని కూడా పేర్కొన్నారు. మొత్తంమీద కొత్త లెసైన్సుల జారీకి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.