breaking news
MUMBAI TRANS HARBOUR LINK
-
సీ ‘లింక్’ కుదిరింది..!
సాక్షి, ముంబై: ప్రతిపాదిత శివ్డీ-నవశేవా సీ లింక్ (ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్) ప్రాజెక్టుకు నిధులు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీ (జేఐసీఏ) సంకేతాలిచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు ఎదురైన వివిధ కీలక అడ్డంకుల్లో ఒకటి పరిష్కారమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ సీ లింక్ ప్రాజెక్టును జేఐసీఏ ఆర్థిక సంస్థకు చెందిన బృందం ఇటీవల సందర్శించింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై స్వయంగా తామే నివేదిక రూపొందించుకుంటామని పేర్కొంటూనే రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. శివ్డీ-నవశేవా సీ లింక్ ప్రాజెక్టు మొత్తం 22 కి.మీ. పొడవుంది. ఇందులో 18 కి.మీ. సముద్రంపై ఉండగా మిగతాది రోడ్డు మార్గం. అందుకు రూ.9,630 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) పీపీపీ పద్ధతిలో ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియకు స్పందన రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రన్ (ఐపీసీ) పద్ధతిలో చేపట్టాలని ఎమ్మెమ్మార్డీయే యోచిస్తోంది. ఆ మేరకు జేఐసీఏ ద్వారా నిధులు పొందేందుకు ఎమ్మెమ్మార్డీయే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో కేంద్రం జేఐసీఏతో చర్చలు జరిపింది. ఆ తర్వాత అందుకు సంబంధించిన ప్రతిపాదన పంపించింది. దీంతో జేఐసీఏకు చెందిన 10 మంది సభ్యులు ముంబైకి వచ్చి ప్రతిపాదిత ప్రాజె క్టు ప్రాంతంలో పర్యటించారు. ఎమ్మెమ్మార్డీయే రూపొందించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఎమ్మెమ్మార్డీయే అందించిన సమాచారంతో ౄటు తాము సొంతంగా అధ్యయనం చేసి నివేదిక రూపొం దించుకుంటామని ఆ బృందం స్పష్టం చేసింది. అలాగే, ఎమ్మెమ్మార్డీయే సమర్పించిన ముసాయిదాను పునఃపరిశీలించనున్నట్లు తెలిపింది. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టుకు తక్కువ వడ్డీకే నిధులు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ బృందం సంకేతాలిచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు కొనసాగేందుకు కొంతమేర మార్గం సుగమమైందని ఎమ్మెమ్మార్డీయే భావిస్తోంది. శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు చేపట్టేందుకు గతంలో అనేక్చసార్లు టెండర్లను ఆహ్వానించింది. కాని పెట్టుబడి తిరిగి వస్తుందో..? రాదో.? అనే అనుమానంతో కొన్ని కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో పడిపోయింది. చివరకు జేఐసీఏ ఆర్థిక సంస్థ తక్కువ వడ్డీకే రుణాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలివ్వడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. -
టోల్నాకాల పరిస్థితులపై కంపెనీల ఆందోళన
సాక్షి, ముంబై: ప్రతిపాదిత ‘శివ్డీ-నవశేవా సీలింక్ ప్రాజెక్టు’ కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు గతంలో ఆసక్తి కనబర్చిన ఐదారు కంపెనీలు టెండర్ల ప్రక్రియకు మాత్రం దూరంగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క సంస్థ కూడా టెండరు వేయకపోవడంతో ప్రాజెక్టు భవిత అగమ్యగోచరంగా మారింది. టెండర్లు వేసేందుకు సోమవారం ఆఖరు రోజు కావడంతో సాయంత్రం గడువు ముగిసే వరకు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కమిషనర్ యూపీఎస్ మదన్ స్పష్టం చేశారు. దాదాపు రూ.9,630 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు మొత్తం 22 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 16.5 కిలోమీటర్ల మార్గం సముద్రంపైనే ఉంటుంది. తొలుత ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఆసక్తి కనబర్చిన బడా సంస్థల్లో ఐఆర్బీ ఇన్ఫ్రా, హ్యుందయ్, సింట్రా-సోమా, గ్యామన్ ఇన్ఫ్రా- ఓహెచ్ఎల్, జీఎంఆర్, ఎల్ అండ్ టీ, శామ్సన్, టాటా రియల్టీ, ఆటోస్ట్రెడ్ ఇండియన్ ఇన్ఫ్రా, విన్సి వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో ఐఆర్బీ, హ్యుందయ్ కంపెనీలు ఇటీవల కొల్హాపూర్ టోల్నాకా వద్ద జరిగిన హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రైవేటు పెట్టబడులకు వాతావరణం అనుకూలంగా లేదని కారణం చూపుతూ టెండరు వేయకూడదని గతవారమే నిర్ణయం తీసుకున్నాయి. మిగతా నాలుగు సంస్థలు మాత్రం టెండరు వేయకపోవడానికి గ ల కారణాలను స్పష్టం చేయలేదు. ఆర్థిక సంక్షోభాలు, మార్కెట్లలో మాంద్యం కారణంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సేకరించే అవకాశాలు తక్కువగా ఉండడం, టోల్ వసూళ్లపై భరోసా లేకపోవడం వంటి వాటి వల్ల కంపెనీలు టెండర్ల దాఖలుకు వెనుకడుగు వేసి ఉండవొచ్చని ఎమ్మెమ్మార్డీయే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరిచే అన్ని కంపెనీలతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించక ముందు పలుసార్లు సమావేశాలు జరిగాయి. సీలింక్ ప్రాజెక్టు పూర్తయిన తరువాత వంతెన మీదుగా రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య ఊహించిన విధంగా ఉంటుందా..? టోల్ ద్వారా రాబట్టే డబ్బులతో ఈ ప్రాజెక్టుకు వెచ్చించిన డబ్బులు వసూలవుతాయా..? వంటి అనేక సందేహాలను సదరు సంస్థలు సమావేశంలో వ్యక్తం చేశాయి. కాని ఈ ప్రాజెక్టు నిర్మాణానికిఅవసరమయ్యే వివిధ శాఖల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ), అనేక విధాల సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కల్పించేందుకు హామీ ఇచ్చామని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ అశ్వినీ బిడే చెప్పారు. అయినప్పటికీ ఏ కంపెనీ కూడా టెండరు వేసేందుకు ముందుకు రాలేదని ఆమె అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని, అందుకు నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టును క్యాష్ ఆన్ కాంట్రాక్టు ప్రతిపాదనపై చేపట్టేందుకు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిస్తామని, ఆరు నెలల్లో మరోసారి టెండర్లను ఆహ్వానిస్తామని ఆమె చెప్పారు.