ఒక పోస్టు@ నలుగురు అధికారులు
= విధి నిర్వహణలో ఇక్కట్లు
= మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారుల నిర్వాకం
ఒక్క పోస్టుకు ఒక అధికారి.. పని ఒత్తిడి ఉంటే మహా అంటే అదనంగా మరొకరుండవచ్చు. కానీ బనగానపల్లె మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో మాత్రం ఒక్క ఏఈఈ పోస్టుకు ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అధికారులు కొనసాగుతున్నారు. పోనీ పనులైనా సక్రమంగా నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు. నలుగురు ఒకే సీటులో ఇమడలేక, ఎవరు ఏ పని చేయాలో తెలియక అలా అని ఖాళీగా ఉండలేక అవస్థలు పడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
బనగానపల్లె :ఎక్కడైనా పోస్టులు ఖాళీగా ఉండి పనులు ఆగిపోయిన సందర్భాలుంటాయి కానీ ఒక పోస్టుకు నలుగురు అధికారులుండి పనులు నడవని పరిస్థితి మాత్రం ఒక్క బనగానపల్లె మైనర్ ఇరిగేషన్ కార్యాలయానికే చెల్లింది. ఉన్న ఒక్క ఏఈఈ పోస్టుకు అధికారికంగా ముగ్గురు, రాజకీయ పలుకుబడితో మరొకరు కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది(2016–17) ఏఈఈ పోస్టు ఖాళీగా ఉన్న సమయంలో రూ.13కోట్ల నీరు– చెట్టు నిధులు మంజూరయ్యాయి. అప్పుడు రెగ్యులర్ ఏఈఈని నియమించలేని ఉన్నతాధికారులు నంద్యాల డివిజన్ పరిధిలోని ఓ సెక్షన్ ఏఈఈకి బనగానపల్లె, అవుకు మండలాలకు సంబంధించి బనగానపల్లె మైనర్ ఇరిగేషన్ కార్యాలయ అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఆయన పరిధిలో నాలుగు మండలాలున్నా రాజకీయ పలుకుబడితో ఉన్నతాధికారుల ఆశీస్సులతో ఆయన నియమితులైనట్లు సమాచారం.
ఆయన పరిధిలోనే గత ఏడాది నీరు–చెట్టు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. వీటిలో కొన్ని.. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి. 2017–18 సంవత్సరానికిగాను మళ్లీ రూ. 17కోట్లు మంజూరు కాగా ఒక్క బనగానపల్లె మండలానికే రూ. 12కోట్లు ఇచ్చారు. అయితే ఇన్చార్జి అధికారి ఆధ్వర్యంలో పనులు సరిగా సాగడం లేదన్న భావనతో ఉన్నతాధికారులు బనగానపల్లె, అవుకు మండలాలకు ప్రత్యేకంగా ఇద్దరు ఏఈఈలను ఎస్సార్బీసీ కార్యాలయం నుంచి నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో డిప్యూటేషన్పై పంపించారు. మూడు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్ విధించారు. అయితే మూడు నెలలు కాకుండానే ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఈనెల 1న రెగ్యులర్ ఏఈఈగా అశ్వర్థనారాయణ వచ్చారు.
విధి నిర్వహణలో ఇక్కట్లు..
నిబంధనల మేరకు సెక్షన్ పరిధిలోని అభివృద్ధి పనులన్నీ రెగ్యులర్ అధికారి ఆధ్వర్యంలో జరగాలి. ఆయన బాధ్యతలు స్వీకరించగానే డిప్యూటేషన్పై కొనసాగుతున్న వారు వారి పోస్టులకు వెళ్లాలి. కాని అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందకపోవడంతో రెగ్యులర్ ఏఈఈతోపాటు డిప్యూటేషన్ పై వచ్చిన ఇద్దరు ఏఈఈలు అధికారికంగా ఉండగా, గత ఏడాది ఇన్చార్జిగా పనిచేసిన అధికారి ఆధీనంలోనే సెక్షన్ పరిధిలోని అభివృద్ధి పనులు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. అనధికారికంగా ఏఈఈ చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంబుక్ ఎలా రికార్డు చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలా చేయాలంటే సదరు అధికారికి ఈఈ ప్రత్యేక అధికారాలివ్వాలి. అందుకు నిబంధనలు వర్తించవని, ఎవరైనా కోర్టుకు వెళితే ఆయన ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొందరు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి రెగ్యులర్ ఏఈఈ కూడా ఆవేదన చెందినట్లు సమాచారం.
ఎంబుక్ నమోదుపై సందిగ్ధం..
బనగానపల్లె మండలంలో నీరు–చెట్టు అభివృద్ధి పనులు అనధికార ఏఈఈ ఆధీనంలో జరుగుతున్నా బిల్లులు మంజూరు కావాలంటే రెగ్యులర్ ఏఈఈగా బాధ్యతలు స్వీకరించిన తానే ఎంబుక్ రికార్డు చేయాలంటూ అశ్వర్థనారాయణ పేర్కొంటున్నారు. తాను చేపట్టని పనులకు ఎలా ఎం బుక్ రికార్డు చేస్తానంటూ మొండికేస్తున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా నీరు–చెట్టు పనులు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు బిల్లుల మంజూరుపై ఒకింత ఆందోళన చెందుతున్నారు.