కరెన్సీ కేటుగాళ్ల అరెస్ట్
ఉయ్యూరు :
వెయ్యి నోటుకు మరో వెయ్యి నోటు తయారు చేస్తామని ఆశచూపి రూ.7 లక్షలు అపహరించి పారిపోయిన ఘరానా మోసగాళ్లను ఉయ్యూరు పోలీసులు పట్టుకున్నారు. ఈస్ట్ జోన్ ఏసీపీ బి.విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వరపర్ల గ్రామానికి చెందిన షేక్ బాషా, గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన షేక్ బడేషా దూరపు బంధువులు. షేక్ బాషాకు నేర చరిత్ర ఉంది. ఇతను 2008లో ప్రకాశం జిల్లా మేదరమెట్లలో డబ్బు కోసం ఓ హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. తన దూరపు బంధువైన బడేషాతో కలిసి కరెన్సీ నోట్ల మోసాన్ని ప్రారంభించారు.
తెల్ల పేపరుకు రూ.వెయ్యి నోటును అంటించి..
తెల్ల పేపరుపై టింక్చరు రాసి రూ.వెయ్యి నోటును అంటించి అదే నోటును తయారు చేసే విధానాన్ని బాషా, బడేషా కనిపెట్టారు. రూ.లక్షకు రూ.లక్ష వస్తుందంటూ జనాన్ని మోసం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం షేక్ బాషా, బడేషా ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని పరిచయం చేసుకున్నారు. రూ.వెయ్యి నోటును ముందుగానే ఏర్పాటు చేసుకుని నోటుకు నోటు తయారు చేసినట్లుగా నమ్మించి బుట్టలో వేశారు. రూ.10 లక్షలు ఇస్తే రూ.20 లక్షలు తయారు చేసి ఇస్తామని చెప్పారు. ఈ మేరకు జూన్ 23న ఆర్ఎంపీ వైద్యుడు తన ఇల్లు తనఖా పెట్టి రూ.7 లక్షలు తీసుకుని కరెన్సీ నోట్ల తయారీకి అంగీకరించాడు. ఘరానా మోసగాళ్లు రూ.వెయ్యి నోటు సైజులో తెల్ల పేపరు, నల్ల పేపరు కట్టలు, టింక్చరు తీసుకుని సామగ్రితో వచ్చి ఆర్ఎంపీ వైద్యుని దృష్టి మరల్చి రూ.7 లక్షలను మాయం చేసి వారు తెచ్చిన పేపరు కట్టలను తౌడు బ్యాగ్లో ఉంచి గంట వరకు తెరవొద్దని చెప్పారు. భోజనం చేసి వస్తామని పరారయ్యారు. ఎంత సేపటికీ రాకపోవడంతో ఆర్ఎంపీ వైద్యుడు బ్యాగ్ తెరచి చూశాడు. బ్యాగ్లో పేపరు కట్టలు ఉండటంతో లబోదిబో మంటూ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రూ.5.70 లక్షలు స్వాధీనం :
డీసీపీ కె.ప్రవీణ్ ఆధ్వర్యాన ఏసీపీ విజయభాస్కర్, సీఐ జీవీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో టౌన్ ఎస్ఐ డి.సత్యసుధాకర్, క్రైం సిబ్బంది వెంకన్న, మూర్తి, రవికృష్ణ, జమేష్, ఇద్రీస్, చంటి తదితరులు కరెన్సీ నోట్ల మాయ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన సమాచారంతో అన్వేషణ ప్రారంభించారు. కంకిపాడు మండలంలోని గన్నవరం రోడ్డులో ఉన్న బొప్పన ఆయిల్ మిల్స్ సమీపంలో గురువారం షేక్ బాషా, బడేషాలను అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి నుంచి రూ.5.70 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.