పెళ్లి ట్రాక్టర్ బోల్తా-తల్లీకొడుకు మృతి
నందిపేట: పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడటంతో తల్లి, కొడుకు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన ఎర్రొల్ల చిన్న దేవాయి (45) తన కొడుకు మల్లేష్ (13)తో కలిసి మేనకోడలు పెళ్లికి నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి వెళ్లింది.
సాయంత్రం బంధువులతో కలిసి ట్రాక్టర్లో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ పొలంలో బోల్తా పడడంతో బురదలో కూరుకుపోయిన తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.