breaking news
K S Eshwarappa
-
కాంట్రాక్టర్ ఆత్మహత్యపై స్పందించిన మంత్రి..‘ రాజీనామా చేసే ప్రసక్తే లేదు’
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ను తను ఇప్పటి వరకు కలవలేదని కర్ణాటక గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ మరణానికి తను బాధ్యుడిని కాదని అన్నారు. కాగా బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి ఈశ్వరప్ప కమీషన్లు అడిగారని కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. తాజాగా కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. నేను ఇప్పటి వరకు కాంట్రాక్టర్ను చూడలేదు, కలవలేదు. కేంద్రానికి రాసిన ఆ లేఖను మా శాఖకు పంపించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సమాధానమిచ్చారు. అయితే పాటిల్కు సివిల్ పనులు అప్పగించినట్లు ఎలాంటి రికార్డ్ లేదు. అలాగే పేమెంట్ గురించి కూడా చర్చించలేదు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిస్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి, హోం మంత్రిని కోరాను’ అని ఈశ్వరప్ప తెలిపారు. సంబంధిత వార్త: సూసైడ్ కలకలం: మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు.. రంగంలోకి సీఎం కాగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ లాడ్జీలో మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణానికి ముందు తన చావుకు ఈశ్వరప్పే కారణమని, అతనికి శిక్ష పడాలని.. స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసెజ్లు పంపారు. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కోరారు. సంతోష్ పాటిల్ ఆత్మహత్యతో ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి. దీంతో ఈశ్వరప్ప రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. తను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంతోష్ పాటిల్ ఆరోపణలపై పరువు నష్టం కేసు కూడా వేసినట్లు తెలిపారు. -
కాఫీ.... టిఫిన్లాగా... అత్యాచారాలు నిత్యకృత్యం
శాసనమండలిలో విపక్ష నేత కె.ఎస్. ఈశ్వరప్ప బెంగళూరు : కాఫీ, టిఫిన్ లేకుండా ఎలా రోజు గడవదో అలాగే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగని రోజంటూ లేదు. మహిళలు, పిల్లలపై లైంగిక, భౌతిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండమే ఇందకు కారణం' అని అధికార కాంగ్రెస్ పై శాసనమండలిలో విపక్షనాయకుడు కె.ఎస్.ఈశ్వరప్ప నిప్పులు చెరిగారు. మండలిలో బుధవారం సభా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయమై జరిగిన చర్చలో ఈశ్వరప్ప మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆరేళ్ల చిన్నారితో మొదలుకుని అరవై ఏళ్ల ముసలి వారిపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాంగ్రేప్లు రాష్ట్రంలో నిత్యకృత్యమైనా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించిన వారిపై భౌతిక దాడులు జరుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మడికేరి ఘటనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి నలుగురు వ్యక్తులు చనిపోవడం సర్కారు వైఫల్యమని ఆయన ఆరోపించారు. ఇలా ప్రతి రోజూ ఏదో ఓ చోట శాంతిభద్రతల సమస్య తలెత్తుతున్నా మంత్రులతోపాటు అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఓ వర్గం ప్రజలు దేశద్రోహానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఓట్ల కోసం వారిని వెనకేసుకొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హోంశాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ స్పందిస్తూ... కె.ఎస్. ఈశ్వరప్ప ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మండలి చైర్మన్ శంకరమూర్తి వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు.