breaking news
Indo American Cancer Hospital
-
క్యాన్సర్ కాపురం
భరోసా క్యాన్సర్ ప్రాణాంతకవ్యాధి. రాక్షసుడైన భర్త దొరికితే కాపురం కూడా ప్రాణాంతకమే. హైదరాబాద్ గోల్కొండకు చెందిన అర్షియా నాజిమా ఈ రెండు క్యాన్సర్ల బారిన పడింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వదిలేసిపోయాడు. చుట్టూ గాఢాంధకారం. కావల్సింది ఈ సమాజం ఉంది అన్న భరోసా. అశ్రువును తుడిచే ఔషధం. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, థర్డ్ బ్లాక్, సెకండ్ ఫ్లోర్లో 20వ నంబర్ బెడ్పైన అచేతనంగా పడుకొని ఉంది 32 ఏళ్ళ అర్షియా నాజిమా. వెంట్రుకలు ఊడిపోయి పలుచబడిన తలను చున్నీలాంటి దానితో కప్పుకుని ఉంది. చున్నీని చూపిస్తూ పెగలని గొంతుతో అంది- నా భర్త ఇలాంటి చిన్న గుడ్డ కూడా ఎరుగడు. ఆ చున్నీ వెనుక ఉన్న శరీరమే అతనికి కావాల్సింది అని. ఆమెది ఇరవై ఏళ్ల విషాద గాథ. విన్నవారికి మనిషికి ఇలాంటి కష్టాలు ఉంటాయా అనిపించేంత వేదన. ఆ వేదనను ఆమె ఇలా ఏకరువు పెట్టింది. ‘‘మాది గోల్కొండ ఏరియా. మా నాన్న గోల్కొండ ఫోర్ట్ దగ్గర చరిత్ర పుస్తకాలు అమ్మేవాడు. మేము ఏడుమంది సంతానం. నలుగురు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. నేను చివరిదాన్ని. నాన్న సంపాదన అంతంత మాత్రం కావడంతో మాది చాలీచాలని బతుకని చెప్పాలి. నా భర్త ఒక హాస్పిటల్లో అటెండర్గా పని చేసేవాడు. పేరు మహ్మద్ అలీ అహ్మద్. మా ఏరియాలోనే వాళ్లూ ఉండేవాళ్లు. నన్ను చూసి చేసుకుంటానని వెంటపడ్డాడు. మా పెళ్లి జరిగిపోయింది... అత్త రాక్షసి... మా అత్తకు ఈ పెళ్లి ఇష్టం లేదో లేదంటే కొడుకు నా ప్రేమలో ఆమెను నిర్లక్ష్యం చేస్తాడని భయమో చాలా రాక్షసంగా ప్రవర్తించేది. నా భర్తతో నా తొలిరాత్రి జరిగిన సంఘటనే భయానకమైనది. మా అత్త తొలిరాత్రి నన్ను నా భర్త దగ్గర నుంచి ఈడ్చుకొచ్చి ‘ఇంత లావుగా వున్నావు. వెళ్లి వాకింగ్ చేసిరా’ అని ఇంటి నుంచి బయటకు నెట్టింది. అంత రాత్రిపూట ఏం చేయాలో తోచక బిక్కు బిక్కుమంటూ ఇంటి బయటే గడిపాను. నా భర్త నీడని కూడా తాకకుండా చాలా రోజులు కాపలా కాసింది మా అత్త. ఇంటికి సరైన తలుపు కూడా లేని గదిని మాకిచ్చింది. చుట్టుపక్కల కుర్రాళ్ళు అర్ధరాత్రుళ్ళు తలుపుకొడుతుంటే భయంతో నిద్రలేని రాత్రిళ్ళు గడిపాను. పెళ్ళయిన కొత్తలో నా భర్త లేని సమయంలో ఎవడో ఒక అపరిచితుడిని నా గదిలోకి నెట్టి బయట గడిపెట్టింది నా అత్త. భయంతో కేకలు పెట్టాను. ఆడపిల్ల ఇష్టం లేదు... నాకు తొలిచూలు ఆడపిల్ల. నా భర్తకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు. అత్తకు కూడా. కాని పుట్టిన బిడ్డను ఎలా వద్దనుకుంటాం. పాప పుట్టిన ఆరు నెలలకు రంజాన్ పండుగ వచ్చింది. అందరూ కొత్త గుడ్డలు కొనుక్కుంటున్నారు. నా చూపు వాళ్ల గుడ్డలపైన లేదు. గిన్నె నిండా వున్న పాలపైన వుంది. బిడ్డ నా దగ్గర పాలు తాగడం లేదు. గిన్నెలో పాలు పడదామని చిన్నగ్లాసుడు పాలు తీసుకున్నాను. అంతే నా ఐదుగురు ఆడబిడ్డలూ, భర్తా, అత్తా కలిసి నన్ను గొడ్డును బాదినట్టు బాదారు. రెండో కాన్పులో మగపిల్లాడు పుట్టాడు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బిడ్డ చాలా అందంగా పుట్టాడని వాడు నా కొడుకు కాదని వెళ్లిపోయాడు. నా అన్నలే ఆసుపత్రి బిల్లు కట్టి ఇంటికి తెచ్చారు. నా అదృష్టమో దురదృష్టమో మూడో కాన్పులో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. అదే నా నేరం అయ్యింది. నన్ను విడిచి వెళ్లిపోయాడు. తొమ్మిదేళ్లుగా అతడు ఏమయ్యాడో నాకు తెలియదు. ఎప్పుడూ రాలేదు. కనీసం ‘తలాక్’ కూడా చెప్పలేదు. పెళ్లయిన 20 ఏళ్ళలో తండ్రిగా తన బాధ్యతను ఏనాడూ నిర్వర్తించలేదు. పిల్లలకి ఓ బిస్కెట్టు కొనిపెట్టిన జ్ఞాపకం నాకు లేదు. కనీసం వాళ్ళనాన్న మొహం ఎలా వుంటుందో చూసిన జ్ఞాపకం నా పిల్లలకి లేదు. బ్లడ్ క్యాన్సర్... మూడు నెలల క్రితం ఆరోగ్యం సరిగా ఉండకపోతే హాస్పిటల్లో చూపించుకున్నాను. నాకు ఎఎంపిఎల్ బ్లడ్ క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అని చెప్పారు. భోరున విలపించాను. పదహారేళ్ళకే నన్ను జీవచ్ఛవంలా మార్చిన అత్తగారితో పోరాడాను. చిన్నవయస్సులోనే మోయలేని భారాన్ని నా భర్త మిగిల్చి పోతే విధితో పోరాడాను. కాని ఈ క్యాన్సర్తో మాత్రం పోరాడలేకున్నాను. ఇంత ఖరీదైన జబ్బుని తట్టుకునే స్థాయి కాదు మాది. కటిక పేదరికం అనుభవిస్తున్నాం. అయినప్పటికీ ఎలాగో కష్టాలు పడి జూలై మొదటి తారీఖున ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు మా అన్నలు. 35 రోజులు ఇక్కడే ఉన్నాం. రెండున్నర లక్షలకు పైగా ఖర్చయ్యింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 85 వేలు సాయం చేసింది. నిజాం ట్రస్ట్ కొంత సాయపడింది. మా బంధువులు, మిత్రులు అంతా ఏదో తోచిన సాయం చేసారు. ఇప్పుడు మళ్లీ హాస్పిటల్లో చేరాను. ఈ జబ్బుకి ఇంకా చాలా ఖర్చవుతుందంటున్నారు. దాదాపు 20 లక్షలు. అంత డబ్బు ఎలా తేగలం? నువ్వు అమ్మవవుతావా తల్లీ... నా పెద్ద కూతురు గులఫ్షా ఇంటర్మీడియట్ చదువుతోంది. కొడుకు ఒజియాప్కి 11 ఏళ్ళు. సెవెంత్ క్లాస్. చిన్నకూతురు మరియంకి తొమ్మిదేళ్ళు ఫోర్త్ చదువుతోంది. నాకేదైనా అయితే నా పిల్లలేం అవుతారోనని నా బెంగ. నా చిన్న కూతురు మరియంకి దిండుపైన పడుకునే అలవాటు లేదు. నా చేతిపైనే ఎప్పుడూ నిద్దరోతుంది. గత మూడు నెలలుగా నేను ఆసుపత్రిలో ఉన్నాను. అప్పటి నుంచి ఇంట్లో నా బిడ్డకి నిద్రలేదు. ఆమే కాదు. నా ముగ్గురు పిల్లలకీ కంటిపైన కునుకులేదు. బక్కచిక్కి పోయారు. నా బిడ్డలకు తల్లీ తండ్రీ నేనే. ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్తో నేను చనిపోతే వాళ్ళేమౌతారోనని నా గుండె తరుక్కుపోతోంది. అల్లా నాకిలా చేసి ఉండాల్సింది కాదు. నా అన్నలిద్దరూ గోల్కొండకోటలో టూరిస్ట్ గైడ్స్. వాళ్ళకొచ్చే నాలుగైదొందల్లో ప్రతి రోజూ నాకు యాభయ్యో వందో ఇచ్చి నన్ను పోషిస్తూ వచ్చారు. గత మూడు నెలలుగా వాళ్లిద్దరూ వంతులు వేసుకొని నా దగ్గర ఉంటున్నారు. ఒక్కరోజు డబ్బుల్లేకపోయినా పొయ్యి వెలగని పరిస్థితి మాది. నా బిడ్డలకోసమే నాకు బతకాలని వుంది. అల్లా కరుణిస్తే, ఎవరైనా సాయం చేస్తే నేను బతుకుతానన్న ఆశ వుంది. ‘నేను చనిపోతే నీ చెల్లికీ, తమ్ముడికీ నువ్వు అమ్మవవుతావా అమ్మా’ అని నా పెద్దకూతురిని అడిగాను. బోరున ఏడ్వడం తప్ప తను సమాధానం చెప్పలేకపోయింది. అల్లానే నాకు అన్యాయం చేసాడు. ఇక నా కష్టం ఎవరు తీరుస్తారు’’. - అత్తలూరి అరుణ ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి అర్షియా నాజిమాకు సహాయం చేయదలచినవారు 96185 52260కు సంప్రదించవచ్చు. అకౌంట్ వివరాలు: MD Baseed Khan, A/C No. 3243700561, CBI, Chota Bazar, Golconda Fort, IFS Code CBIN0 282389లో కూడా డబ్బు జమ చేయొచ్చు. -
ఏటా 1.7 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా కొత్తగా 1.7 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నట్లు అసోసియేషన్ ఆఫ్ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఇండియా(ఏజీఓఐ)- 2015 మూడు రోజుల సదస్సు ప్రకటించింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల పట్టణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది మహిళల్లో 35, గ్రామీణ ప్రాంతాల్లో 8 మంది రొమ్ము క్యాన్సర్కు గురవుతున్నట్టు వెల్లడించింది. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సు శుక్రవారం హోటల్ మారియట్లో ప్రారంభమైంది. పది మంది అంతర్జాతీయ, 100 మంది జాతీయ ఫ్యాకల్టీలు... గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో వస్తున్న అధునాతన మార్పలు, మెళకువలను లైవ్ సర్జరీల ద్వారా ఇందులో వివరించారు. 400 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజీఓఐసీఓఎన్ ఆర్గనైజింగ్ చైర్మన్ టి.సుబ్రహ్మణ్యేశ్వర్రావు, ఏజీఓఐ అధ్యక్షురాలు నీరజాభట్ల, కార్యదర్శి రమాజోషి, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ క్లినికల్ చీఫ్ శశికాంత్ లేలే మాట్లాడారు. తగ్గిన సర్వైకల్ క్యాన్సర్... గతంతో పోలిస్తే ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ తగ్గిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత శుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించడం, అవగాహన పెరగడం, యుక్త వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవడమే ఇందుకు కారణమన్నారు. శరీరాకృతి దెబ్బతింటుందనే అపోహలతో పిల్లలకు పాలివ్వక పోవడంవల్ల అనేక మంది మహిళలు 30 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉందన్నారు. ముందస్తు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చన్నారు. జాతీయ టీకాల కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్ను చేర్చి బాలికలు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా నెలకోసారి రొమ్ము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలని, మార్పులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
కేన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ బర్త్డే వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన 55వ జన్మదినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో కేన్సర్పై పోరాడుతున్న చిన్నారులు, అభిమానుల మధ్య జరుపుకొన్నారు. కేన్సర్ బాధిత చిన్నారులతో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్, అనంతపురానికి చెందిన అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బాలకృష్ణ సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కార్యకర్తలను, అభిమానులను అభినందించారు. ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసిన బాలకృష్ణ ఆ తర్వాత ‘కేన్సర్ రహిత సమాజం.. మనందరి లక్ష్యం’ అన్న పేరుతో తయారు చేసిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రికి తాను చైర్మన్గా సేవలు చేసే భాగ్యం కలగడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆస్పత్రి సీఈవో ఆర్పీ. సింగ్, మెడికల్ డెరైక్టర్ డాక్టర్ టి.ఎస్.రావు, సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.