hi speed train
-
హైస్పీడ్ రైల్తో హైదరాబాద్ కనెక్టివిటీకి బూస్ట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ను దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే హై–స్పీడ్ రైల్ హబ్కు ముందడుగు పడింది. భారతీయ రైల్వేను అత్యాధునికంగా రూపొందించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది ఫ్రిబవరిలో బడ్జెట్లో హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–పుణె కారిడార్లలో పరుగులు పెట్టనుంది. ఈ మేరకు శంషాబాద్ మండలం బహదూర్గూడలోని సర్వే నంబర్లు 28, 62లలో 650 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ప్రయాణ, రవాణా, పారిశ్రామిక, ఆర్థిక వృద్ధి.. భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్తో ఇకముందు దేశానికే ఏరో ట్రోపోలిస్ హబ్గా నిలవనుంది. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్ రైల్వే కారిడార్ నగరంగా శంషాబాద్ అభివృద్ధి చెందనుంది. హై– స్పీడ్ రైల్ కారిడార్లతో ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణం వీలుండటంతో పాటు ప్రాంతీయ రవాణా, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాల వృద్ధి విస్తరణకు వీలవుతుంది. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారుతుందని నిపుణుల అంచనా. దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాలను హైస్పీడ్ రైల్ కారిడార్ను అనుసంధానిస్తుండటంతో ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరో నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. దీంతో విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. తొలుత ఇవి.. బెంగళూరు, చెన్నై, పుణె మూడు నగరాలతో అనుసంధానం కానున్న హైదరాబాద్ రైల్ కారిడార్లో.. తొలుత హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ రెండు కారిడార్ల డీపీఆర్లు పూర్తవుతాయని, ఆ తర్వాత 2027–28 ఆర్దిక సంవత్సరంలో హైదరాబాద్–పుణె కారిడార్ డీపీఆర్ ఉంటుందని సమాచారం. హైస్పీడ్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్–చెన్నై మార్గంలో ప్రయాణానికి 8– 10 గంటలు, హైదరాబాద్– పుణె మార్గంలో 10– 11 గంటల సమయం పడుతోంది. హైస్పీడ్ రైల్తో ప్రతి కారిడార్లో సుమారు ఏడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. -
రయ్.. రయ్.. విమానంతో పోటీపడే రైలు.. గంటకు 600 కిలోమీటర్లు..
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైలు నెట్వర్క్పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన చైనా.. తాజాగా విమానంతో పోటీపడే రైలును తయారు చేసింది. ఈ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్లు అని తెలుస్తోంది. తాజాగా 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్లో మాగ్లెవ్ రైలును చైనా ప్రదర్శించింది. దీంతో, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.చైనా విజయవంతంగా మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీతో సరికొత్త హైస్పీడ్ రైలును ఆవిష్కరించింది. విమానంతో పోటీ పడే రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్లో మాగ్లెవ్ రైలును చైనా ప్రదర్శించింది. ఇది కేవలం 7 సెకన్లలోనే 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు తెలిపారు. ఇక, ఇది అందుబాటులోకి వస్తే.. బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉన్న 1200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 150 నిమిషాల్లో చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 5.30 గంటల సమయం పడుతోంది.Ever wondered what 600 km/h feels like on the ground? 🚄Hop on the world’s fastest train and get ready for an insane, mind-blowing ride.This isn't sci-fi — it’s happening in China! 🇨🇳💨#FastestTrain #ChinaSpeed #Maglev #NextLevelTravel #FutureIsNow #HighSpeedRail #600kmh… pic.twitter.com/1Eq4Flm6U1— Chengdu China (@Chengdu_China) July 14, 2025కాగా, డోంఘు లాబొరేటరీలోని ఇంజనీర్లు 2025 చివరి నాటికి తమ హై-స్పీడ్ ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి ఏఐ గైడెడ్ సస్పెన్షన్ వ్యవస్థలు.. ఖచ్చితమైన విద్యుదయస్కాంత నియంత్రణకు తోడ్పడనున్నట్టు అధికారులు తెలిపారు. హైస్పీడ్ సమయంలో ఇవి ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయన్నారు.ఇదిలా ఉండగా.. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీతో ఈ రైలు అధిక వేగంతో దూసుకెళ్లగలదు. ఈ టెక్నాలజీ అయస్కాంత వ్యతిరేక క్షేత్రాలను ఉపయోగించుకొని.. ట్రాక్ నుంచి రైలును పైకి లేపడానికి సాయపడుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుతుందని బీజింగ్ అధికారులు వెల్లడించారు. ఈ రైలు బరువు 1.1 టన్నులుగా ఉండనుంది. ఇక, ఇది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర సృష్టించనుంది. ఈ ఏడాది జూన్లో చైనా ఇంజినీర్లు దీన్ని పరీక్షించారు. తాజాగా ప్రదర్శించారు. దీంతో, అందరి దృష్టి ఈ రైలు పడింది. 🇨🇳🚄China is redefining the world’s high-speed rail development.The 600km/h driverless high-speed maglev train debuts! pic.twitter.com/1VghGaC1DQ— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) July 12, 2025 -
మనకూ స్పానిష్ హైస్పీడ్ రైలు
ముంబై: గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అత్యాధునిక స్పానిష్ రైలు ఈ నెల 21 న ముంబై రేవుకు చేరుకుంటుంది. దీన్ని తయారుచేసిన టాల్గో కంపెనీ వారం క్రితమే స్పెయిన్లో నౌకలోకి దీన్ని ఎక్కించింది. ముంబై ఢిల్లీ నగరాల మధ్య నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ రైలు ప్రారంభమైతే రెండు నగరాల మధ్య ప్రస్తుత కాల వ్యవధి 12 గంటలకు తగ్గుతుంది. సాధారణ రైలుతో అయితే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం కనీసం 16గంటలవరకు పడుతుంది. అంటే రాత్రి భోజనం చేసి రైలెక్కితే మరుసటి రోజు అల్పాహారానికి గమ్యస్థానం చేరుకుంటారు. టాల్గో కంపెనీ తన 9వ సిరీస్లో భాగంగా తయారు చేసిన ఈ స్పానిష్ రైలు మన రైళ్లకన్నా భిన్నంగా ఉంటుంది. రైలు జంట చక్రాలకు యాక్సిల్ ఉండదు. బోగీలు కూడా కప్లింగ్ పద్ధతిలో ఉండవు. రైలు కింది భాగానికి బోగీలకు మధ్యన గ్యాప్ ఉంటుంది. ఈ ఆధునిక పద్ధతి వల్ల రైలు మలుపుల వద్ద కూడా వేగంగా దూసుకుపోతుంది. బోగీలు, బాడీ అడుగు భాగానికి గ్యాప్ ఉండడంతో కుదుపులు ఉండకపోవడమే కాకుండా చక్రాల శబ్దం ప్రయాణికులకు వినిపించదు. సీటు బెల్టు సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా ఏ రకమైన గేజ్ పట్టాలపై కూడా దీన్ని నడిపేందుకు వీలుగా గేజ్ మార్పిడి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.ఈ రైలును ముందుగా ఢిల్లీ పల్వాల్ సెక్షన్లో ప్రయోగాత్మకంగా నడిపి చూస్తారు. అనంతరం నెలాఖరికి ఢిల్లీ ముంబై నగరాల మధ్య ప్రవేశపెడతారు. ఈ రైలుకు ధర లేదు. అంటే స్పెయిన్కు చెందిన టాల్గో కంపెనీ తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్కు పరిచయంచేసి ప్రచారం చేసుకోవడానికి దీన్ని ఉచితంగా అందిస్తోంది.


