ప్రజాస్వామ్య స్ఫూర్తికనుగుణంగా జరగలేదు
రోజా ఏడాది సస్పెన్షన్పై మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాదిపాటు ఏపీ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం సభా సంప్రదాయాల ప్రకారం జరిగిందని చెబుతున్నా, ప్రజాస్వామ్య స్ఫూర్తికనుగుణంగా మాత్రం జరగలేదని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్రెడ్డి అభిప్రాయపడ్డారు. చట్టసభల నిర్వహణ స్ఫూర్తిని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదన్నారు. ఇలా ఎక్కడా జరగదని చెప్పారు. గతంలో ఎమ్మెల్యే కరణం బలరాంపై విధించిన ఆరుమాసాల సస్పెన్షన్కు, దీనికి అసలు పొంతనే లేదన్నారు. నిబంధనలు-కట్టుబాట్లు ఎలా ఉన్నా సమావేశపు సందర్భం, పరిస్థితినిబట్టి సభ నిర్ణయం తీసుకునే సంప్రదాయం ఉన్న మాట వాస్తవమేనన్నారు. సభా నిర్ణయమే అంతిమం అనటంలోనూ సందేహం లేదన్నారు.
నాడు ఎథిక్స్ కమిటీ క్షుణ్నంగా పరిశీలించింది..
బలరాం కేసులో సభ్యుడు చేసిన వ్యాఖ్యలు సభ బయట, అదీ స్పీకర్ పైన. తనపై వచ్చిన అభియోగాలకు స్పీకర్ సమాధానం చెప్పే పరిస్థితి,సందర్భం ఉండదు కనుక ఈ అంశాన్ని సభ తీవ్రంగా పరిగణించింది. ఎథిక్స్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది, విపక్షాలు కూడా నిర్ణయానికి మద్దతిచ్చాయి. ఆ మేరకు నిర్ణయం జరిగింది’ అని ఆయన గుర్తు చేశారు.