-
భూరిశ్రవసుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 35 భూరిశ్రవసుడు అర్జునుణ్ని ఆడిపోసు కోవడం మొదలుపెట్టాడు; అస్త్ర ధర్మాన్నెరి గిన నువ్వు నీతో యుద్ధం చేయని నా కుడిచేతిని కొట్టెయ్యడం ఏ రకమైన ధర్మం? వాసుదేవుడి మాట విని నువ్వు ఈ నికృష్టమైన పని చేశావని తెలిసిపోతోంది. నువ్వు కృష్ణ సఖుడివి కాకపోతే ఈ పని చేసేవాడివి కావు’ అని అర్జునుణ్ని తప్పు బట్టడమే కాకుండా కృష్ణుణ్ని కూడా దూషించాడు. భూరిశ్రవసుడు భీష్ముడికి వరసకు మనవడవుతాడు. భూరిశ్రవసుడికి భూరి దక్షిణుడనీ యూపకేతువనీ యజ్ఞశీలుడనీ పేర్లు ఉన్నాయి. యజ్ఞంలో బలిపశువును కట్టే స్తంభాలను యూపస్తంభాలని అంటారు. ఆ యూపస్తంభాన్నే తన రథానికి ధ్వజంగా చేసుకున్నాడు ఈ కర్మప్రతీకుడు. యజ్ఞ కర్మల్లో ఎక్కువగా దక్షిణలిచ్చేవాడు గనక ఇతన్ని భూరి దక్షిణుడని కూడా అంటారు. భూరిశ్రవసుడి పుట్టుక వెనుక ఒక కథ ఉందని చెబుతారు. వసుదేవుడికి కాబోయే భార్య అయిన దేవకికి స్వయంవరం చేసి నప్పుడు, శిని అనే వృష్ణి వర్గంవాడు, ఆమెను తెచ్చి వసుదేవుడికిచ్చి పెళ్లిచేద్దా మని ఆవిణ్ని తీసుకొని వస్తున్నాడు. తోవలో ఆ పనికి సోమదత్తుడు అడు ్డపడ్డాడు. శినీ సోమదత్తుడూ పోట్లాడు కున్నారు. ఓడిపోయిన సోమదత్తుణ్ని శిని చంపకుండా తన్ని అవమానపరిచి విడిచిపెట్టాడు. ఆ అవమానం సోమదత్తుణ్ని పీడించింది. తన రాజ్యానికి తిరిగి పోకుండా, అతను అక్కణ్నించే తపస్సు చేయడానికి వనానికి వెళ్లిపోయాడు. అయితే, తపస్సుకు కావలసిన ఫలితం వచ్చేలోపులో శినీ చచ్చిపోయాడు, శిని కొడుకు సత్యకుడూ చచ్చిపోయాడు. అంచేత శిని మనవణ్ని ఓడించగలిగే కొడుకు తనకు కలగాలని వరం కోరుకున్నాడు సోమదత్తుడు. ఆ వరప్రసాదంగానే భూరిశ్రవసుడు పుట్టాడు. శిని మనవడే సత్యకుడికి కొడుకైన సాత్యకి. ఈ సాత్యకి అసలు పేరు యుయుధానుడు. బ్రహ్మచైతన్య యోగం కోసం యుద్ధం చేయడానికి బుద్ధిని ధారణ చేసినవాణ్నే యుయుధానుడని అంటారు. అంటే, యోగం కోసం పోరాడాలన్న శ్రద్ధా భక్తీ ఉన్నవాడన్నమాట. అంచేతనే ఈ సాత్యకిని శ్రద్ధకు ప్రతీకగా చెబుతారు. శినికో శిని కొడుకుకో పడవలసిన కర్మశిక్ష, శిని మనవడైన సాత్యకికి దిగివచ్చింది. కర్మఫలం తప్పకుండా వచ్చిపడడం వరప్రసాదంగా కథారూపేణా చెప్పుకొంటాం. సాత్యకి అర్జునుడికి శిష్యుడు. సాత్యకి విలువిద్య అంతా అర్జునుడి ప్రసాదం. అదీగాక సాత్యకి వరసకి, సత్యభామకు తమ్ముడుగా, శ్రీకృష్ణుడికి బావమరిది అవుతాడు. సైంధవుణ్ని సూర్యుడు అస్తమించేలోపుగా వధించాలనే ప్రతిజ్ఞను నెరవేర్చుకోడానికి, ద్రోణుణ్ని తప్పించుకొని, కౌరవ సేనా వ్యూహంలో చొరబడిన అర్జునుడికి సాయంగా ఉండమని ధర్మరాజు, భీముణ్నీ సాత్యకినీ పంపించాడు. సాత్యకి యుద్ధం చేస్తూ చాలామందినే సంహరిస్తూ ముందుకు వస్తున్నాడు. చాలా అలసిపోయిన స్థితిలో అతనికి తటాలున భూరిశ్రవసుడు ఎదురయ్యాడు. ‘చాలా కాలానికి నా కోరిక తీరబోతోంది. ఈ రోజున నువ్వు యుద్ధరంగం వదిలి పారిపోకుండా ఉంటే, నా చేతిలో చనిపోవడం నీకు తప్పదు. నా చేతిలో నువ్వు చనిపోయినప్పుడు, నిన్ను ఈ వ్యూహంలోకి పంపిన ధర్మరాజు నీలాంటి దుర్బలుణ్ని పంపినందుకు సిగ్గుపడతాడు. ‘రా, యుద్ధానికి సిద్ధపడు’ అని అంటూ సాత్యకిని కవ్వించాడు భూరిశ్రవసుడు. యుయుధానుడు నవ్వుతూ సమాధానం చెబుతూ, ‘నేను నీ మాటలకే భయపడిపోయే పిరికివాణ్ని కాను. నన్ను యుద్ధంలో నిరాయుధుణ్ని చేసినవాడే నన్ను గెలవగలుగుతాడు. అయినా, వట్టిగా బడబడలాడడం వల్ల లాభమేమిటి? నువ్వన్నది చేసి చూపించు చూద్దాం’ అంటూ ఆ సవాలును స్వీకరించాడు సాత్యకి. ఒక ఆడ ఏనుగు కోసం భీషణంగా కొట్టుకొనే రెండు ఏనుగుల్లాగ జయం కోసం పోరాడుతూ వాళ్లిద్దరూ ఒకళ్ల మీద మరొకళ్లు బాణవర్ష ధారలు కురిపించడం మొదలుపెట్టారు. విల్లులు విరగ్గొట్టుకొని రథాలను ధ్వంసం చేసుకొని, ఇక కత్తి యుద్ధానికి దిగారు. రకరకాలుగా ఖడ్గ యుద్ధం చేస్తూ ఒకరి డాలును మరొకరు విరగ్గొట్టి ఆమీద మల్లయుద్ధానికి ఉపక్ర మించారు. వాళ్లిద్దర్నీ కొంతదూరంలో ఉన్న కృష్ణార్జునులు చూస్తున్నారు. కృష్ణుడు ‘సాత్యకి బాగా అలసిపోయినప్పుడు ఈ భూరిదక్షిణుడు యుద్ధాన్ని కోరుకొంటూ ఎదురుపడ్డాడు. అంచేత వీళ్ల యుద్ధం సమయుద్ధంగా లేదు. యుయుధానుడు నేలమీద పడిపోయాడు చూడు! నీ శిష్యుణ్ని ఇప్పుడు నువ్వు కాపాడాలి’ అంటూ అర్జునుణ్ని పురిగొల్పాడు. సాత్యకి జుట్టు పట్టుకొని, కాలితో ఛాతీమీద తన్నుతూ భూరి శ్రవసుడు తన ఒర నుంచి ఖడ్గాన్ని తీశాడు. యుయుధా నుడి శిరస్సును కోద్దామని భూరిశ్రవసుడు ఉంకిస్తున్నాడు. కుమ్మరి చక్రం మీది కన్నంలో కర్రను పెట్టి కుమ్మరి చక్రాన్ని తిప్పినట్టు, సాత్యకి యూపకేతువు కత్తికి అందకుండా తిప్పుతూ ఉన్నాడు. ‘నువ్వు నీ శిష్యుణ్ని తక్షణమే కాపాడాలి’ అంటూ శ్రీకృష్ణుడు చెబుతూన్న మాటలను విని, అర్జునుడు గాండీవం మీద ఒక బాణాన్ని సంధించి, ఖడ్గంతో సహా భూరిశ్రవసుడి కుడిచేతిని కొట్టేశాడు. భూరిశ్రవసుడు అర్జునుణ్ని ఆడిపోసు కోవడం మొదలుపెట్టాడు; ‘మరొకడితో యుద్ధం చేస్తూన్నవాడి చేతిని కొట్టడం నీకు ఇంద్రుడు చెప్పాడో కిరాతుడైన రుద్రుడే చెప్పాడో సాక్షాత్తూ నీ గురువు ద్రోణుడే చెప్పాడో మొదటి గురువు కృపాచార్యుడే చెప్పాడో నాకు తెలియదు. అస్త్ర ధర్మాన్నెరి గిన నువ్వు నీతో యుద్ధం చేయని నా కుడిచేతిని కొట్టెయ్యడం ఏ రకమైన ధర్మం? వాసుదేవుడి మాట విని నువ్వు ఈ నికృష్టమైన పని చేశావని తెలిసిపోతోంది. నువ్వు కృష్ణ సఖుడివి కాకపోతే ఈ పని చేసేవాడివి కావు’ అని అర్జునుణ్ని తప్పు బట్టడమే కాకుండా కృష్ణుణ్ని కూడా దూషించాడు. ‘మాకోసం ప్రాణాలను ఒడ్డి యుద్ధం చేస్తూన్న యోద్ధను రక్షించడం నా ధర్మం. యుద్ధం చేసే వీరుడు కేవలం తననే రక్షించుకొంటూ కూర్చోకూడదు; తన పనుల్ని చేసి పెడుతూన్న వాళ్లను రక్షించడం కూడా రాజు కర్తవ్యమే. అలాగే వాళ్లు కూడా రాజును రక్షిస్తూ ఉండాలి. అయినా ఈ సంగ్రామం ఒక్కొక్కరూ ఒక్కొక్కరితో చేస్తున్నారని చెప్పడానికి కుదరదు. ఇదో సైన్య సాగరం. ఎవరెవర్ని దెబ్బతీస్తున్నారో చెప్పలేం. ఒక పక్షమూ వేరు పక్షమూ మధ్య జరుగుతూన్న యుద్ధమని చెప్పగలం తప్ప, ఒక ఫలానా యోద్ధా మరొక ఫలానా యోద్ధా మధ్య జరుగుతూన్న యుద్ధంగా దీన్ని చెప్పడం చెల్లదు. అదీగాక సాత్యకి అలసిపోయి ఉన్నాడు. అంచేతనే నీకు దొరికిపోయాడు. అటువంటి సమయంలో నాలాంటి బాధ్యత గల యోద్ధ అతన్ని కాపాడడంలో ఏ దోషమూ లేదు సరిగదా న్యాయమే ఉంది. అయినా మీరందరూ కలిసి అభిమన్యుణ్ని చంపలేదా? అప్పుడు ఈ నువ్వు చెప్పే న్యాయం ఎక్కడికి పోయింది?’ అంటూ దీటైన జవాబు చెప్పాడు అర్జునుడు. ఈ మాటలు విని, యూపకేతువు మారుమాటాడలేదు. అతను తన ఎడమచేత్తో బాణాలను కింద పరుచుకొని, ఆ శరాసనం మీద కూర్చొని ధ్యానమగ్నుడై ప్రాణాలను వదిలిపెట్టడానికి సంసిద్ధుడయ్యాడు. ‘నాకు ధర్మరాజూ భీముడూ నకుల సహ దేవులూ అంటే ఎంత ప్రేమో నువ్వన్నా అంతే ప్రేమ. నేనూ కృష్ణుడూ నువ్వు పుణ్యలోకాలకు పోవాలని ఆకాంక్షి స్తున్నాం’ అంటూ అర్జునుడు అనడంతో బాటు కృష్ణుడు కూడా ‘నాతో సమానంగా గరుడుడి మీద ఎక్కి సంచరించేవాడివి కా’ అంటూ దీవించాడు. ఇంతలో సాత్యకి లేచి, కృష్ణార్జునులు వద్దు వద్దు అని అంటూన్నా వినకుండా భూరిశ్రవసుడి శిరస్సును తన కత్తితో కోసేశాడు. దాన్ని తప్పుబట్టిన కౌరవులకు అర్జునుడన్నమాటే అప్పజెప్పాడు: ‘శస్త్రాలూ కత్తులూ ఏమీలేని విరథుడూ కవచ హీనుడూ అయిన అభిమన్యుణ్ని చంపడం ధర్మమైతే ఇదీ అంత ధర్మమే. నేను ఈ భూరిశ్రవుడి తల తీయడానికి నా ప్రతిజ్ఞే కారణం. ఎవరైతే నన్ను రణరంగంలో బతికుండ గానే కోపంతో కాలితో తంతాడో వాణ్ని, అతను ముని వ్రతుడైనా సరే, చంపుతా నని నా ప్రతిజ్ఞ. అది తీర్చుకోవడం సబబే గనక నేను ఈ పని చేశాను’ అని తన పనిని సమర్థించుకొన్నాడు సాత్యకి. కథాపరంగా చూస్తే, ఈ చంపడం ఒప్పా తప్పా అనే వాదాలు సహజంగానే పుడతాయి. కానీ శ్రద్ధను (సాత్యకిని) నాశనం చేద్దామని చూసే కర్మనీ కర్మ బంధాన్నీ (భూరిశ్రవసుణ్ని) మనో నిగ్రహంతో (అర్జునుడి ద్వారా) మట్టు బెట్టడం నూటికి నూరుపాళ్లూ ఒప్పే. అలాగే శ్రద్ధే సూటిగా కర్మబంధాన్ని కోసెయ్యడమూ బేషరతుగా ఒప్పే. ఇటువంటి సన్నివేశం ద్రోణవధ ఘట్టంలో కూడా ఉంది. ద్రోణుడు, కొడుకు చనిపోయాడని వినగానే, కుడిచేయి తెగిన భూరిశ్రవసుడి లాగ, అస్త్ర సన్యాసం చేసి, యోగధ్యానంలో కూర్చున్నాడు. అతన్ని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు తటాలున అతని రథం ఎక్కి, ద్రోణుడి తలకాయను నిర్దాక్షిణ్యంగా కోసేశాడు. ఇదీ ఒప్పా తప్పా అనే మీమాంసకు తెరతీసింది. కానీ అలవాట్లను మప్పి నేర్పే వాసన అనే ఆచార్యుడి తలను ఆగమశక్తి తెగ్గోయడం అత్యంతమూ సబబే. అంచేతనే మనం ఈ భారతవ్యాసాల పరంపరలో అంతటా, మనుషుల వెనక ఉన్న భావాలనే గ్రహించాలని పదేపదే చెబుతూ వస్తున్నాం. - డా॥ముంజులూరి నరసింహారావు -
విరటుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 30 విరటుడు మత్స్యదేశానికి అధిపతి. పాండవులు పన్నెండేళ్ల వనవాసం పూర్తి చేసుకొని, ఎవరికీ తెలియకుండా గడప వలసిన పదమూడో ఏడాదిని మారు వేషాల్లోనూ మారుపేర్లతోనూ ఈ విరాట రాజు కొలువులో గడిపారు. భౌతికమైన కోరికలు అలవాట్లుగా స్థిరపడి, మనిషిని పూర్తిగా వశం చేసు కున్నప్పుడు, ఆ అలవాట్లనే దొంగరాజుల పాలన నుంచి తన శరీర రాజ్యాన్ని విడి పించడానికి, కనీసం పన్నెండేళ్లైనా వ్యవధి పడుతుంది సాధకుడికి. శారీరకమూ మాన సికమూ అయిన మార్పులకూ... మంచి అలవాట్లను అలవర్చుకుని, వాటిని దృఢంగా నిలుపుకోడానికీ అథమపక్షం ఒక పుష్కర సమయం కావాలి. పోయిన శరీర రాజ్యాన్ని తిరిగి పొందడానికి వివేక గుణబలగాలు, ఆ బలాన్ని సమాధి యోగానుభవంలో స్థిరమూ దృఢమూ చేసుకోవాలి. అలా వివేక బలాల్ని నిలుపు కొంటూ శరీరం గుండా, ఇంద్రియాల గుండా వాటిని రూఢీగా ప్రకాశింప జేయగలగాలి. అలా తమ సామర్థ్యాన్ని నిరూపించుకొన్న తరవాత, అవి శారీరక రాజ్యాన్ని తిరిగి తమ అధీనంలోకి తీసు కోవడానికి చేయవలసిన ఆధ్యాత్మిక యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి. వన వాసాన్ని పాండవులు తమ ఆధ్యాత్మిక శక్తుల్ని దృఢపరుచుకోడానికి ఉపయో గించారు. పన్నెండేళ్లు వాళ్లు తమ తమ వివేక బలగాల్ని దిట్టపరుచుకొని, విరటుడి కొలువుకి పదమూడో ఏడాదిని అజ్ఞాతంగా గడపడానికి చేరుకున్నారు. ‘విరాట’ అనే మాటను ‘వి’, ‘రాజ్’ అనే రెండింటి అర్థాల్ని కలిపి రాబడతారు. ‘వి’ అనేది ఒక ఉపసర్గః. దానికి ‘విశేషంగానూ, వివిధంగానూ’ అనే అర్థాలున్నాయి. ‘రాజ్’ అంటే, పరిపాలించడమూ ప్రకాశించడమూ అనే అర్థాలు ఉన్నాయి. విశేషంగానూ వేరు తీరులోనూ పరిపాలించడమంటే, సామాన్యమైన మానుషచైతన్యంతో కాకుండా, సమాధి ధ్యానంలో అనుభవానికి వచ్చే దివ్య చైతన్యంతో పరిపాలించడమని అర్థం. అంచేతనే విరాటరాజు పరిపాలన మరోలా ఉంటుంది. కీచకుడనే సేనాపతి బావమరిది ద్వారానే అతని పాలన సాగుతూన్నట్టనిపిస్తుంది. త్రిగర్తరాజు సుశర్మని, సాల్వ దేశస్థుల్ని కీచకుడు తన బంధుసేనలతో ఆక్రమించి చాలాసార్లు సతాయించాడు. విరటుడి పరిపాలన ఇలా ఉండడం, ‘విరటుడు’ సమాధి తాలూకు తాత్కాలికమైన దివ్య యోగ స్థితులకు ప్రతీక అని చెప్పడానికి సరిపడుతుంది. సవికల్ప సమాధిలో సాధకుడు, విశేషంగా ఆత్మలో మునిగిపోయి, బయటి విషయాల్ని తెలియని స్థితిలో ఉంటాడు. విరాటరాజు కొలువులో మహారాజైన ధర్మరాజు తోటిరాజు దగ్గర సేవకుడిగా పనిచేయడానికి కంకుభట్టనే బ్రాహ్మ ణుడిగా మారువేషం వేసుకున్నాడు. ఆ రాజును సంతోషపెట్టడానికి అతనితో పాచికలాడుతూ ఉండేవాడు. భీముడు వలలుడనే వంటవాడిగా ఉంటూ, తన శారీరక బలాన్ని చూపిస్తూ మల్లయుద్ధాలు చేస్తూ రాజును సంతోషపెట్టేవాడు. ఊర్వశి ఇచ్చిన శాపాన్నే వరంగా మలచుకొని బృహన్నలై అర్జునుడు రాచకూతురు ఉత్తరకు నాట్యగాన పాఠాల్ని నేర్పుతూ కాలాన్ని నెట్టుకొచ్చాడు. నకుల సహ దేవులు గుర్రాల్నీ ఆవుల్నీ సాకుతూ పశువుల శాలల్లో గడిపారు. ఆ ఏడాది చివరికి వస్తూన్నప్పుడు కీచకుడి బెడద వచ్చిపడింది. విరాటరాజు కీచకుడికి ఎదురు పలకలేడన్న విషయం అప్పుడే మనకు బయటపడింది. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని అమర్యాదగా వెంటాడుతూ సభకు వచ్చిన కీచకుణ్ని పల్లెత్తు మాటైనా అనలేకపోయాడు విరటుడు. పైగా, ‘మీ ఇద్దరిమధ్యా ఇంతకుముందు ఏ కీచులాటలు జరిగాయో నాకు తెలియవుగా’ అంటూ తప్పించుకోడానికే చూశాడు. కామం పెచ్చరిల్లినప్పుడు, దాన్ని బయట పడనీయకుండా అదుపులో ఉంచుతూ గుట్టుచప్పుడు గాకుండానే నాశనం చేయ డానికి ప్రాణక్రియల్ని ముమ్మరం చేయాలి. అదే విషయాన్ని భీముడనే ప్రాణ క్రియా శక్తి కీచకుడనే కామశక్తిని నాశనం చేసినట్టు కథారూపేణా చెబుతారు. ప్రతికూలమైన ఇంద్రియాల మొగ్గుదలలు నూరూ ఇంద్రియాల శక్తులు ఐదూ అదమలేని మనస్సు ఒకటీ వెరసి నూటారు. ఆ నూటారుగురే కీచకుడూ ఉపకీచకులూను. ఏడాది ఇక కొన్ని రోజుల్లో పూర్తి కాబోతూండగా దుర్యోధనుడికి కీచకవధ గురించి అనుమానం వేసింది. కానీ దాన్ని కర్ణుడూ దుశ్శాసనుడూ మాట్లాడిన తీరును బట్టి బలం లేకుండా చేశారు. ‘పాండవులు బాగా గుప్తమైన స్థానంలో దాక్కొనైనా ఉండవచ్చు; లేకపోతే, సముద్రానికి అవ తల ఒడ్డుకు వెళ్లైనా ఉంటారు. లేక వాళ్లను మహారణ్యంలో క్రూరమృగాలు గానీ కొండచిలువలు గానీ మింగేసి ఉండవచ్చు. అదీ కాకపోతే విషమాతి విషమ పరిస్థితుల్లో పడి పూర్తిగా నాశనమైపోయి ఉంటారు’ అంటూ దుర్యోధనుడి ముందు తన పాప భావాల పర్యవసానాన్ని ప్రకటించాడు దుశ్శాసనుడు. భీష్ముడు వాళ్లను వెదకాలంటే ఎలాగో కొన్ని లక్షణాల్ని సూచించాడు. ధర్మరాజు ఉన్నచోట గోవులు ఎక్కువగా ఉంటాయి; అవి దుర్బలంగా ఉండనే ఉండవు; మంచి రస వంతమైన పాలూ పెరుగూ నెయ్యీ అనే హోమద్రవ్యాలు పుష్కలంగా దొరుకు తాయి ఆ చోట. దృశ్యాలన్నీ ప్రసన్నంగా ఉంటాయి. అతనున్నచోట ప్రజలు సంప్రీతిమంతులై ఉంటారు. ఈ లక్షణాలన్నీ చారుల కథనాన్ని బట్టి మత్స్య దేశంలో అవుపించాయి. అది అదనుగా తీసుకొని, సభలో ఉన్న సుశర్మ కీచకుడి మీద తనకున్న కోపాన్ని తీర్చుకోడానికి వేళ దగ్గర పడిందని అనుకుంటూ, దుర్యోధనుణ్ని మత్స్యదేశం మీద దండెత్తడానికి పురి గొలిపాడు. ‘ఇప్పుడు కీచకుడు లేడు గనక, విరటుడు నిరాశ్రయుడు; దర్పం కాస్తా పూర్తిగా అణిగిపోయి ఉంటుంది; అప్పటి ఉత్సాహమూ ఉండవు. ఆ దేశంలో చాలా గోసముదాయముంది. ఆ పశుసంపదను మీరూ మేమూ కలిసి హరిద్దాం. మేము ఒకవైపు నుంచీ మీరు మరొకవైపు నుంచీ దాడిచేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే వాళ్లను సులువుగానే వశపరచుకోవచ్చు’ అని దుర్యోధనుడి లోపల ఏర్పడుతూన్న ఉద్దేశానికి ఆజ్యం పోశాడు సుశర్మ. దానికి తోడు త్రిగర్తుడి మాటలకు కర్ణుడు ‘సై’ అన్నాడు. ‘అర్థమూ బలమూ పౌరుషమూ హీనమైపోయి మూడు వంతులు నష్టమై పోయి ఉన్న పాండవులతో మనకేం పని? విరాటరాజును ముట్టడించి అక్కడి గో సంపదను మన హస్తగతం చేసుకోవ డంలో నిమగ్నమవుదాం’ అని కర్ణుడు కూడా అనడంతో దుర్యోధనుడు మత్స్య దేశాన్ని ముట్టడించడానికి సైన్యాన్ని సిద్ధం చేశాడు. ముందు రోజు సుశర్మను దక్షిణం వైపు నుంచి ముట్టడించమని పురమా యించి, ఆ మీద భీష్మద్రోణకర్ణాదులతో కలిసి తాము ఉత్తరం వైపు నుంచి దాడి చెయ్యాలని పథకం వేశారు. ఈ ప్రణాళిక సిద్ధమయ్యేసరికి పద మూడో ఏడాది నిజానికి పూర్తైయింది. సుశర్మ దక్షిణ గోగ్రహణానికి తన సేనల్ని మత్స్యదేశం వైపుకు నడిపాడు. ఇది తెలియగానే విరటుడు యుద్ధానికి తన పెద్దకొడుకు శంఖుణ్నీ తమ్ముళ్లు శతానీక మదిరాక్షుల్నీ తీసుకొని వెళ్తూ, కంకుభట్టునీ వలులుణ్నీ దామగ్రంథినీ తంతిపాలుణ్నీ కూడా అనురూపమైన కవచాలు ధరించి యుద్ధం చెయ్యడానికి రమ్మనమని ఆహ్వా నించాడు. ఎప్పుడైనా సరే, తామున్న దేశానికి కష్టం వచ్చినప్పుడు, తాము కూడా యథాశక్తి సాయం చేయడం విధా యకంగా నమ్మినవాళ్లు గనక వెంటనే బయలుదేరారు. అయితే, ఆ యుద్ధంలో సుశర్మ విరటుణ్ని బందీగా పట్టుకొని తీసు కొనిపోతూ ఉంటే, యుధిష్ఠిరుడు భీముణ్ని పంపి విరటుణ్ని విడిపించేలా చేశాడు. సుశర్మను ఆ విధంగా ఓడించి, యుధిష్ఠిరుడి సలహా ప్రకారం చంప కుండానే వదిలేశారు. త్రిగర్తమంటే మూడు రథాలని అర్థం. మూడు రథాలూ మనిషికుండే మూడు శరీరాలు: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ మూడింటి నుంచీ విడివడితేనే ఏ సాధకుడికైనా పూర్తి ముక్తి దొరుకుతుంది. వాటికి సాధకుడు లొంగిపోవడమే విరటుడు త్రిగర్తుడైన సుశర్మకు పట్టుబడడంలోని ఆంతర్యం. అయితే, భీముడనే ప్రాణాయామ శక్తి ఆ మూడు శరీరాల పట్టు నుంచీ సాధ కుణ్ని విడిపించగలుగుతుంది. విరటుడు ఆ నలుగురు పాండవుల పరాక్రమంతోనూ ముక్తుడు కావడంతో చాలా సంతోషిస్తూ వాళ్లను పదేపదే సమ్మానించాడు. ఆ రాత్రికి శిబిరంలోనే ఉంటూ రాజపట్ట ణానికి రాజుగారి విజయవార్తను దూతల ద్వారా చేరవేశారు. ప్రణాళిక ప్రకారం అటు విరటుడు త్రిగర్తుడితో యుద్ధానికి వెళ్లగానే, ఇటు దుర్యోధనుడు ఉత్తరం వైపు నుంచి మత్స్యదేశాన్ని ముట్టడించాడు. భీష్ముడూ ద్రోణుడూ కర్ణుడూ కృపుడూ అశ్వత్థామా శకునీ దుశ్శాసనుడూ వివింశతీ వికర్ణుడూ చిత్రసేనుడూ దుర్ముఖుడూ దుశ్శలుడూ వగైరా మహారథులు చాలా మందితో కౌరవులు ముమ్మరంగా దాడి చేశారు. ఆ సమయంలో రాజధానిలో ఉన్న వాడు ఉత్తరుడనే విరాటరాజు రెండో కొడుకు మాత్రమే. అతనికి సైరంధ్రి చెప్పగా బృహన్నలను సారథిగా చేసుకొని యుద్ధానికి బయలుదేరడానికి సాహసం చేశాడు. తీరా సముద్రంలా ఉన్న విశాల మైన కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలుపడి పారిపోతూ ఉంటే, అతన్ని ఆపి, తానే రథికుడై బృహన్నల వాళ్లతో భీకరంగా పోరాడాడు. చివరికి సమ్మోహనాస్త్రంతో ఆ హేమాహేమీలనందర్నీ మూర్ఛలో మునిగి పోయేలాగ చేసి, గోసంపత్తిని వెనక్కి మళ్లించాడు అర్జునుడు. విరటుడు ఆ విజయం తన కొడుకుదే అని ఉబ్బిపోయాడు. ఆ సంతోషంలో కంకుభట్టుతో పందెం వేస్తూ పాచికలాటకు దిగాడు. తన కొడుకు గురించి చెబు తూంటే, ధర్మరాజు ‘బృహన్నల సారథిగా ఉంటే వాళ్లను గెలవడం ఏమంత గొప్పేమీ కాదు’ అని పదే పదే బృహన్నల గొప్ప తనమే చెబుతూ ఉంటే, భరించలేక విరటుడు ధర్మరాజు ముఖమ్మీదకు పాచికలను గట్టిగా విసిరాడు. ధర్మరాజుకు దెబ్బతగిలి ముక్కుల్లోంచి రక్తం కారబో తూంటే, దాన్ని చేతులతో ఆపుతూ పక్కనే ఉన్న సైరంధ్రి వైపు చూశాడు. ఆవిడ తటా లున ఒక గిన్నెపట్టి ఆ రక్తాన్ని నేలమీద పడకుండా చేసింది. ఆ రక్తమే గనక నేల మీద పడితే, రాష్ట్రంతో సహా విరటుడు నాశనమైపోయేవాడు. అప్పుడే ఉత్తరుడూ బృహన్నలా యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చారు. ఉత్తరుడు వస్తూనే ‘ఎవరీ పాపాన్ని చేశారు?’ అంటూ ధర్మరాజువైపుకు వెళ్లాడు. ‘నేనే’ అని తండ్రి చెప్పగా ‘ఎంత తప్పు చేశారు! నిజానికి ఈ యుద్ధమంతా బృహన్నలే చేశాడు. అతనెవరో కాదు... సాక్షాత్తూ అర్జునుడు’ అంటూ నిజం చెప్పాడు. తన తప్పును సరిదిద్దు కోడానికి అర్జునుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు విరటుడు. ‘శిష్యురాలు కూతురుతో సమానం. కోడలిగా చేసు కుంటాను. ఉత్తరను మా అబ్బాయి అభి మన్యుడికిచ్చి పెళ్లి చేయండి’ అని ఒడం బరిచాడు అర్జునుడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
కీచకుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 29 కీచకుడు విరాటరాజు భార్య సుధేష్ణకు తమ్ముడు. ఆ దేశంలో బావమరిది కీచకుడిదే పైచేయి. కీచకుడు సూత పుత్రుడు. ఇతను మొదట్లో విరాటరాజుకి రథసారథే. ఆ మీద తన బలప్రాబల్యం కొద్దీ సేనాపతేగాదు, పరోక్షంగా మత్స్య రాజ్యాన్ని ఏలేవాడిగా కూడా తనను తాను అనుకునేవాడు. విరాటరాజు కూడా అతని దుందుడుకుతనాన్ని గానీ విర్రవీగుణ్ని గానీ తప్పు పట్టేవాడు కాడు. ‘చీకయతే’ అనే క్రియారూపానికి సహించడం, ఓర్పుగా ఉండడం, అదు పులో ఉండడం, గెలవడం, ఓడించడం మొదలైన అర్థాలున్నాయి. దీన్ని తిరగేస్తే, అంటే, ‘క’కారానికున్న అకారాన్ని ‘చ’కారానికీ ‘చ’కారానికున్న ‘ఈ’కారాన్ని ‘క’కారానికీ బదిలీ చేసి, ఆ రెండక్షరాల్నీ తిరగేస్తే, ‘కీచయతే’ అనే రూపమేర్పడు తుంది. తిరగదిప్పడం వల్ల, సహించక పోవడమూ అదుపులో పెట్టుకోక పోవ డమూ గెలవలేకపోవడమూ ఓడిపోవ డమూ అనే విప రీతార్థాలు ఈ ‘కీచక’ శబ్దానికి సంక్రమిస్తాయి. అతడూ అటు వంటివాడే. ఆవేశం వస్తే అదుపులో ఉండదు; పైగా అతడు అమర్యాదకమైన కామావేశానికి పెట్టింది పేరు. దాన్ని ఓర్చుకోలేకనే ఇతను తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కీచకమంటే వెదురుబొంగని కూడా అర్థం ఉంది. వెదురు గడకి కణుపులు ఉంటాయి. అలాగ కణుపులతో ఉండేది మన శరీరంలోని వెన్నుదండం. వెన్ను దండం కింది భాగంలో ఉండే కుండలినీ శక్తిని లైంగిక నాడుల్నుంచి తప్పించి, పైకి తలతట్టుగా నడిపిస్తే మన చైతన్యం విస్త రించగలదు. కీచకుడు ప్రాణశక్తిని ఇంద్రి యాల ద్వారా అడ్డూ అదుపూ లేకుండా బయటికి పోనిస్తూ, ఇప్పటికే దిగజారి పోయి ఉన్న మానుష చైతన్యాన్ని ఇంకా నీచాతి నీచంగా చేస్తూ ప్రవర్తిస్తాడు. వనవాసం పన్నెండేళ్లూ గడిచిన మీదట, పదమూడో ఏడాదిని, అంటే, ఎవరికీ తెలియకుండా ఉండవలసిన అజ్ఞాతవాసాన్ని పాండవులు విరాటుడి కొలువులో గడిపారు. ధర్మరాజు కంకు భట్టుగా రాజుగారికి సహాయకుడు అయ్యాడు; భీముడు వలలుడై వంట ఇంటిని చక్కబెట్టేవాడు; అర్జునుడు ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఒక విధంగా వరంగా వాడుకుంటూ పేడిగా అయి బృహన్నల రూపంలో విరాటరాజు కూతురు ఉత్తరకి సంగీత నాట్యాలను నేర్పేవాడు; నకులుడు గ్రంథికుడనే పేరుతో గుర్రాల బాగోగుల్ని చూసేవాడు; సహదేవుడు తంతిపాలుడనే పేరుతో ఆలకొట్టాల మంచీ చెడుల్ని చూసే గోపాలుడయ్యాడు; ద్రౌపది కేశ శృంగా రాన్నీ శరీరాలకు పూసుకొనే లేపనాల్ని తయారుచేసే నేర్పరిగా మాలిని అనే పేరుతో సైరంధ్రిగా సుదేష్ణ దగ్గర చేరింది. అజ్ఞాతవాసం పూర్తి కావడానికి మరి కొన్ని రోజులే మిగిలిన తరుణంలో కీచకుడు విరాట నగరంలో ఊడి పడ్డాడు. ద్రౌపదిని చూశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ద్రౌపదితో మాట కలిపాడు: ‘నా భార్యల నందర్నీ నీకోసం వదిలేస్తాను. నీకు దాసుణ్ణవుతాను’ అంటూ తన కోరికను బహిరంగపరిచాడు. ‘సూత పుత్రుడా! నా జాతి చాలా హీనమైంది. నాతో నీకు పొత్తు తగదు. అందులోనూ పరుడి భార్యను కోరుకోవడం కూడని పని. దానివల్ల నీకు అపకీర్తి రావడమే గాదు, భయం కూడా పట్టుకుంటుంది’ అని నచ్చజెప్పి తప్పించుకోబోయింది. కానీ కామార్తుడికి భయమెక్కడుంటుంది? ‘భూమ్మీద నాతో సమానుడైన సొగసరి గానీ మగసిరి గలవాడు గానీ లేడు. నా బలమూ అనితరమైనది. అయినా ఈ దాసీత్వం నీలాంటి మహా అందగత్తెకు తగదు. నాకు స్వామినివై అందరిమీదా అధికారాన్ని ప్రదర్శించదగినదానివి’ అంటూ వాగుతూన్న అతగాడితో ద్రౌపది ‘నన్ను ఐదుగురు భీమగంధర్వులు కాపా డుతూ ఉంటారు. వాళ్లు నా భర్తలు. నిన్ను చంపేస్తారు’ అంటుంది. అయినా ఆమెను వశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతూ అక్క దగ్గరికి చేరాడు కీచకుడు: ‘నువ్వేదో ఒక ఉపాయాన్ని పన్ని సైరంధ్రిని నా దగ్గరికి పంపాలి. లేకపోతే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి’ అంటూ మొరపెట్టుకున్నాడు. సుదేష్ణ మెత్తబడి, ‘సరే, నీ దగ్గరికి సురను తెమ్మని పంపుతాను. అప్పుడు ఒప్పిం చుకో’ అని అనునయించి పంపింది. సుధేష్ణ సైరంధ్రిని కీచకుడి విడిదికి పోయి మదిరను తెమ్మంది. ‘నేను వెళ్లను. ఆ సిగ్గులేనివాడు సతాయిస్తాడు. ఎంత మందో సేవకులుండగా నన్నే ఎందుకని పంపించడం?’ అంది ద్రౌపది. తమ్ముడి ముచ్చటను తీర్చడానికి రాజీపడిన ఆ అక్క ‘నేను పంపించానంటే హింసించడు’ వెళ్లి రమ్మనమని బలవంతపెట్టింది. వెళ్లక తప్పలేదు ద్రౌపదికి. వెళ్తూ కర్మసాక్షి అయిన సూర్యుణ్ని ధ్యానించి, రక్షించ మంటూ మొరపెట్టుకుంది. అక్షయ పాత్ర నిచ్చి అడవిలో ఉన్నన్నాళ్లూ కాపాడిన సూర్యుడు, ఇప్పుడావిడ శీలాన్ని కాపాడ్డా నికి ఒక రాక్షసుణ్ని నియోగించాడు. భయపడుతూన్న లేడిలాగ వెళ్లింది. వెళ్లడమే తడవు కీచకుడు వెంటబడ్డాడు. ఆవిడ కుడిచేతిని పట్టుకున్నాడు. ఆవిడ చేతిని విదిలించేసరికి, పెచైరగు పట్టు కున్నాడు. అప్పుడావిడ రెండు చేతులతో ఒక తోపు తోసేసరికి, వేళ్లూడిన చెట్టులాగ కింద పడిపోయాడు. అదే అదనని ఆవిడ పరిగెత్తుకుంటూ రాజసభలోకి వచ్చింది, తనకు అండగా విరాటరాజూ ధర్మరాజూ ఉంటారనే గొప్ప ధైర్యంతో. కానీ అక్కడా చుక్కే ఎదురయ్యింది. కీచకుడు రాజంటే ఏ ఖాతరూ లేనివాడు గనక, సభలోకి దూసుకొని వస్తూ ద్రౌపది కేశపాశాన్ని దుశ్శాసనుడి మాదిరిగానే పట్టుకున్నాడు; రాజు ఎదురుగానే ఆవిణ్ని నేలమీద పడేసి కాలితో తన్నాడు. ఆ క్షణంలో సూర్యుడు పంపిన రాక్షసుడు కీచకుణ్ని పట్టుకొని గాలివేగంతో దూరంగా నెట్టాడు. దానితో కీచకుడు బోర్లా పడ్డాడు. ఇదంతా రాజూ ధర్మరాజూ కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. అప్పుడక్కడికి వచ్చిన భీముడు పళ్లు కొరికాడు. ఉపద్రవం ముంచుకొని రాబోతోందని పసిగట్టిన ధర్మరాజు తన బొటనవేలితో భీముడి బొటనవేలిని నొక్కి, తమ అజ్ఞాతవాసాన్ని కాపాడుకోవాలని మౌనంగానే హెచ్చరించాడు. చెట్టునొక దాన్ని పీకి కీచకుడి పీచమడుద్దామని చూస్తున్న భీముడితో, ‘వలలుడా! ఎండిన వంట చెరకు కోసం చూస్తున్నావా? బయట చెట్ల నుంచి కొమ్మల్ని కోసుకో’ అంటూ ధర్మరాజు ‘ఇక్కడగాదు, బయట ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా వాడి పనిపట్టమ’ని సూచించాడు. ద్రౌపది లేచి, తన ఆకారాన్ని రక్షించు కుంటూ, కళ్లు చింతనిప్పుల్లాగ మండు తూండగా, ‘సిగ్గూ ఎగ్గూ లేని ఈ సూతుడు నన్ను ఇలాగ వేధిస్తూంటే, నా గంధర్వ పతులు అతి బలవంతులయ్యుండి కూడా రక్షించడానికి రావడం లేదు. రాజు కూడా కిమ్మనడం లేదు. అబలనైన నన్ను రక్షించ డానికి ముందుకు రావడం లేదు. కీచకు డెంత అధర్మపరుడో మత్స్యరాజూ అంత అధర్మపరుడిలాగే ఉన్నాడు’ అనేసరికి విరటుడు, ‘మీ ఇద్దరిమధ్యా ఇంతకు మునుపు ఏ తకరారు జరిగిందో తెలియ నప్పుడు నేనేం చేయగలను?’ అంటూ తప్పించుకోడానికే చూశాడు. అప్పుడు ధర్మరాజు కలగజేసుకుంటూ, ‘ఈ సమయం కోపకాలం కాదనుకొని నీ గంధర్వపతులు రావటం లేదేమో! నువ్వు అంతఃపురానికి వెళ్లిపో! నీకు విప్రియం చేసినవాడికి అప్రియం చేయడానికి నీ పతులు తరవాత వస్తారేమోలే’ అంటూ ఆవిణ్ని వెళ్లిపోయేలాగ చేశాడు. అంతఃపురంలోకి వెళ్లి సుధేష్టతో జరిగిన విషయాన్నంతనీ పూసగుచ్చినట్టు చెప్పింది ద్రౌపది. ఆవిడ తన దురుద్దేశాన్ని బయటపడనీయకుండా ‘వాడు చావును కోరుకుంటున్నాడేమో’ అని ఊరుకొంది. నిరాశతో అప్పటికి ఊరుకొని, రాత్రిపూట వంట ఇంట్లో నిద్రపోతూన్న భీమసేనుణ్ని ‘ఇంత జరిగినా నీకు కునుకు ఎలాగ పట్టింది’ అంటూ లేవదీసింది ద్రౌపది. ఇద్దరూ కీచకుడి చావుకి ఒక పథకాన్ని వేశారు. ‘ఈ దుఃఖాన్నీ శోకాన్నీ పక్కకు పెట్టి నువ్వు రేపు రాత్రికి వాడు నర్తన శాలకు రహస్యంగా వచ్చేలాగ చేశావంటే నేను వాడి భరతం పడతాను’ అని భీముడు పథకాన్ని టూకీగా చెప్పాడు. ‘‘నా గంధర్వపతులకు ఈ మన ప్రసంగం వల్ల అపవాదం వచ్చి పడు తుంది. అంచేత అతి రహస్యంగా రాత్రి పూట నర్తనశాలకు వచ్చావంటే నేను నీ అధీనమవుతాను’’ అని ద్రౌపది కీచకుణ్ని నమ్మించింది. వాడు సంకేత స్థలానికి వస్తున్నాడన్న సంగతి భీముడికి చేరవేసి, అతను రాత్రికి అక్కడికి వెళ్లి సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేసింది. ఎప్పుడు రాత్రి వస్తుందా అని ఉవ్విళ్లూరుతూ కీచకుడు భీముడి మృత్యుకౌగిట్లోకి వచ్చి చిక్కు కున్నాడు. ఏ అరుపులూ బొబ్బలూ విని పించకుండా కీచకుణ్ని మాంసమ్ముద్దలాగ నలిపేసి, గుట్టు చప్పుడు కాకుండా తన వంట ఇంటికి వెళ్లిపోయాడు. కీచకుడి సోదరులైన ఉపకీచకులు కీచకుణ్ని దహన సంస్కారం కోసం తీసు కొని వెళ్తూండగా, ఆ సన్నివేశాన్ని కళ్లారా చూద్దామని అక్కడికి వచ్చిన ద్రౌపదిని చూసి, ‘ఈవిడ వల్లనే మన అన్నయ్య నికృష్టమైన చావు చచ్చిపోయాడ’ని రెచ్చి పోయి, ఆవిణ్ని కీచకుణ్ని తీసుకొని వెళ్తూన్న బండమీద ఒక రాటకు కట్టి తీసుకుపోవడం మొదలుపెట్టారు. రాజు వాళ్ల బలం ఎరిగినవాడు గనక కిక్కురు మనకుండా ఉన్నాడు. ‘ఉపకీచకులు శ్మశా నానికి లాక్కుపోతున్నార’ంటూ ద్రౌపది గట్టిగా ఏడ్చింది. ఆ ఏడుపును విని, నిద్ర పోతూన్న భీముడు గభాలున లేచి ‘సైరంధ్రీ! నేను నీ మాట విన్నాను. ఈ సూతపుత్రుల భయం నీకేమీ లేదు’ అంటూ అభయాన్నిచ్చి, వేషం మార్చు కొని, రాజద్వారం గుండా వెళ్లకుండా, గోడ దూకి బయటనున్న ఒక చెట్టునెక్కి, వాళ్లు ఎటు వెళ్తున్నారో చూశాడు. చితి దగ్గరికి పోయి, ఆ దగ్గర్లో తాడిచెట్టులాగ బాగా పొడుగ్గా ఉన్న ఒక గుబురుచెట్టును ఊడబెరికి, భుజంమీద పెట్టుకొని భీముడు రావడాన్ని ఉపకీచకులు చూశారు. వాళ్ల పై ప్రాణాలు పైనే పోయాయి. ‘ బాబోయ్! ఆ గంధర్వుడు మళ్లీ వస్తున్నాడు’ అంటూ ఆమెను వదిలి నగరం వైపు పారిపోవడం మొదలు పెట్టారు. భీముడు యముడి మాదిరి మీదపడి ఆ నూటైదు మందినీ పశువుల్ని వేటాడి చంపినట్టు చంపేశాడు. ‘సైరంధ్రీ! నిన్ను కష్టపెట్టినవాళ్లెవరైనా ఇలాగే చచ్చిపోతారు. నువ్వే భయం లేకుండా నగరానికి నడు!’ అని ద్రౌపదికి చెప్పి, భీముడు మరో దోవ మీదుగా వంట ఇంటికి వెళ్లిపోయాడు. విరటుడి మాటగా సుదేష్ణాదేవి ‘సైరంధ్రీ! గంధర్వులు చేసిన పరాభవం నుంచి రాజుగారు బాగా భయపడు తున్నాడు. నువ్వేమో అతి అందగత్తెవి; మగాళ్లకు విషయ భోగమంటే చెప్పరానంత ఇష్టం; గంధర్వులా అతి కోపిష్ఠులు. అంచేత నువ్వు ఇక్కణ్నించి నీకు ఇష్టమైన చోటికి వెళ్లు’ అంటూ భయపడుతూనే అంది. ‘రాజుగారు మరొక్క పదమూడు రోజులు ఓపిక పడితే చాలు గంధర్వులు వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు’ అంటూ ద్రౌపది సర్దిచెప్పింది. - డా॥ముంజులూరి నరసింహారావు -
తండ్రీ... వారిని క్షమించు!
క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని. చరిత్ర చాలా గడ్డు సమయంలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తమూ ఆధ్యాత్మికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నప్పుడు దాన్ని పునరుజ్జీవింప జేయడానికి క్రీస్తు జన్మించాడు. ఆ మహాత్ముడి సందేశం- ‘మీరందరూ భగవదంశలే’ గొప్ప సందేశం. సెయింట్ జాన్ ఆ క్రీస్తు వచనాన్ని విపులీకరించాడు: ‘ఎంతమంది అతన్ని (అంటే, యేసులోనూ సృష్టి మొత్తంలోనూ ప్రకటమైన కూటస్థ చైతన్యాన్ని) అర్థం చేసుకొని గ్రహించగలుగుతారో వాళ్లందరికీ భగవంతుడి పుత్రుడిలాగా కావడానికి కావలసిన శక్తినిచ్చాడు ఆయన’ (జాన్ 1-12) అని. ఇదో మహావాక్యం. గుండెలో నిర్మలత్వం ఉండి మనసా వాచా కర్మణా శ్రద్ధాభక్తుల్ని పూర్తిగా కనబరచగలిగితే చాలు ఆ మనిషి జాతి ఏదైనాసరే అతని చర్మం రంగు ఏదైనా సరే అతను భగవంతుణ్ణి తనలోకి పిలిచి పరిపూర్ణ తృప్తిని పొందగలుగుతారు. ‘అన్నిదేశాల ప్రజల్నీ (భగవంతుడు) ఒకే రక్తం ఉన్నవాళ్లుగా తయారు చేశాడు’ (అపొ.కా. 17-26) అనేదే క్రీస్తుకు ఉత్తేజాన్నిచ్చిన సంగతి. చర్మాల రంగుల్నిబట్టి మనుషుల్ని విభజించుకొని అసహ్యించుకోవడంగానీ ప్రేమించడం గానీ మనుషుల అజ్ఞానానికి పరాకాష్ఠగానే చెప్పాలి. రంగు చర్మానికే పరిమితం; అంతకన్నా లోతుకు అది వెళ్లదు. రంగును బట్టి ఎవరూ ఎవర్నీ వేరుచేయాల్సిన మూర్ఖత్వంగానీ రాగద్వేషాల్ని చూపించే వెర్రితనాన్ని గానీ బహిర్గతం చేయగూడదు. అదీగాక, నువ్వు ఎవర్ని ద్వేషిస్తావో ఏ జాతిని అసహ్యించుకుంటావో ఏ మతాన్ని ఏవగించుకుంటావో, తిరిగి ఆ జాతిలోనూ ఆ మతంలోనూ ఆ తీరులోనూ పుట్టవలసి వస్తుంది. అది తప్పనిసరి. ఎందుకంటే, చిట్టచివరికి మనకు అన్నిరకాల పక్షపాతాలూ పోయి, మనమందరమూ నిర్మలులమై, భగవంతుడి రెక్కలమాటున ఉండవలసినవాళ్లమే అని గుర్తు పెట్టుకోవాలి. క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్లపట్ల మనకుండవలసిన భావమేమిటో ఏది ఎదుటివాళ్ల క్రూరహృదయాన్ని కూడా మెత్తబరిచి వాళ్లకే తప్పు జేశామన్న పశ్చాత్తాపాన్ని కలిగిస్తుందో ఈ మహావాక్యం చెబుతుంది. మనం చిన్నప్పుడు నీతిపద్యాల్లో ఈ గొప్ప క్షమాగుణం గురించే చదువుకున్నాం. అందుచేతనే యేసుక్రీస్తు మన స్వధర్మాన్ని, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టే నిర్వచించాడు: ‘మనుషులందరూ ఈ డబ్బూదస్కాలకోసమే వెంపర్లాడుతూ ఉంటారు. ఆ తండ్రికి ఇవి మీకు అవసరమని తెలుసు. ఏం తినాలి? ఏం తాగాలి? ఎలాగ ఈ శరీరాన్ని బట్టలతో చుట్టుబెట్టుకోవాలి? అనేవన్నీ అవసరమైన ఆలోచనలా అసలు? నేలను గడ్డి అనే పచ్చటిగుడ్డలతో భగవంతుడు కప్పుతూనే ఉన్నాడు. ఇవాళ ఉన్న ఆ గడ్డిని ఎండగానే కుంపట్లో వేస్తూనే ఉంటాం. నేలనే ఇంత పట్టించుకొన్నవాడు, మనిషిని మాత్రం ఎందకు పట్టించుకోడు? అంచేత వీటికన్నా మీరు దేవుని రాజ్యాన్ని ముందుగా కోరుకోండి. చేరడానికి ఉపక్రమించండి. అప్పుడు ఇవన్నీ మీకు (వాటికవే) వచ్చి చేరతాయి’ (మత్తయి 6-33). ‘డబ్బునీ దేవుణ్ణీ నువ్వు (ఒకేవేళ) సేవించలేవు’ (మత్తయి 6-24) అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో! క్రీస్తు ప్రవచనం- ‘నిన్ను నువ్వెలాగ ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అలాగే ప్రేమించాలి’ అనేది గుర్తు పెట్టుకోవాలి. దాని అర్థం బహుదృశ్యరూపాల్లో ఎదురుగా అగుపిస్తున్న దేవుణ్ణి ప్రేమించమనే. క్రీస్తు చెప్పిన దానిని మనమంద రమూ నేర్చుకోవాలి. గాలిలో ఎగిరే పక్షులకు తిండిని పెట్టేవాడు మనకూ పెట్టకమానడన్న దృఢమైన విశ్వాసం ఉండాలి. ఆవగింజంతైనా విశ్వాసం లేకుండా, వట్టి కబుర్లు చెబితే క్రీస్తు సంతోషిస్తాడనుకోవడం మనను మనం మోసగించుకోవడమే. - డా॥ముంజులూరి నరసింహారావు -
జరాసంధుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 28 జరాసంధుడు రెండు సగాలుగా పుట్టిన రాజకుమారుడు. ఆ సగాలను ‘జరా’ అనే రాక్షసి సంధించగా అతను జరాసంధు డయ్యాడు. ‘జరా’ అంటే, ముసలితనం. అది మార్పులకు పరాకాష్ఠ. జరాసంధుడి తండ్రి మగధనేలిన బృహద్రథుడు. అతనికి ఇద్దరు భార్యలు. వాళ్లు కాశిరాజుకి పుట్టిన కవల కూతుళ్లు. ‘మిమ్మల్నిద్దర్నీ ఒకే తీరుగా ప్రేమిస్తాను’ అని బృహద్రథుడు భార్యలిద్దరికీ మాట ఇచ్చాడు. అయితే ఎన్ని మంగళ కార్యాలు, హోమాలు చేసినా అతనికి పిల్లలు పుట్టలేదు. ఒకసారి చండకౌశికుడనే ముని వీరి రాజ్యానికి వచ్చాడు. పుత్రుణ్ని ప్రసా దించమని రాజు ఆ మునిని ప్రార్థించాడు. ముని ధ్యానంలో కూర్చున్నాడు. కొంత సేపటికి, ఓ మామిడి పండు ముని ఒడిలోకి వచ్చి పడింది. దాన్ని మంత్రించి రాజు చేతికిచ్చాడు. అతడా పండును తీసుకువెళ్లి పెళ్లాల చేతిలో పెట్టాడు. భార్యల్ని సమానంగా చూస్తానన్న మాటను బట్టి వాళ్లు ఆ పండును రెండు సగాలు చేసి తిన్నారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టలేదు; రెండు శరీర శకలాలు పుట్టాయి. అవి ముక్కలే అయినా బతికే ఉన్నాయి. తల్లులు తల్లడిల్లిపోయారు. దాదుల్ని పిలిచి బయట పడేసి రమ్మని పంపించారు. రోడ్ల కూడలిలో విసిరేసిన ఆ ముక్కల్ని ‘జరా’ అనే రాక్షసి తిందామనుకుని రెండిటినీ దగ్గరికి చేర్చింది. అప్పుడు ఆ రెండూ కలసి ఒక వీర కుమారుడిగా తయారయ్యాయి. ఆ రాక్షసి క్రూరమైనది కాదు. ఆ ఊళ్లో ఆవిడను గృహేశ్వరిగా చెప్పుకొనేవాళ్లు. ఆమె ఏమైనా తింటే, మంగళమవుతుందని ఆ ఊరివాళ్ల భావన. పిల్లవాడి కోసం అర్రులు చాచి చూస్తున్న రాజు కొడుకును చంపకూడదని అనుకుంది ఆ రాక్షసి. ఒక మానుష స్త్రీ రూపాన్ని దాల్చి, ఆ అబ్బాయిని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్లింది. రాజు కృతజ్ఞతతో ఆ కుర్రాడికి ‘జరాసంధుడు’ అని పేరు పెట్టుకున్నాడు. జరాసంధుడు ఎంత బలసంపన్ను డైనా, ఎదురుపడిన అందరి తేజస్సునూ హరించేవాడైనా, ఏ శస్త్రాలతోనూ చావని హంసడింభకులనే వీరులు అతని సహా యకులైనా, కంసుడంతటి బలవంతుడు అల్లుడిగా ఆసరాగా ఉన్నా, శిశుపాలుడు సేనాపతిలాగ సాయంగా ఉన్నా కూడా కలపబడిన ఒంటిముక్కలతో ఏర్పడ్డాడు గనక అతడు భీముడి చేతిలో చచ్చిపోవలసి వచ్చింది. జరాసంధుడికి అస్తీ, ప్రాస్తీ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లను కంసుడికిచ్చి పెళ్లి చేశాడు. కంసుడు తన చెల్లెలు దేవకి కడుపున పుట్టే ఎనిమిదో సంతానం వల్ల చచ్చిపోతానన్న భయంతో ఆవిడకు పుట్టిన పిల్లలను వరసగా చంపడం మొదలు పెట్టినా, అతనికి సందిగ్ధత కలగడానికి ఏడోసారి గర్భాన్ని రోహిణికి బదలా యించడమూ, ఆ తర్వాత పుట్టిన కృష్ణుణ్ని యశోద పక్కలో పడుకోబెట్టి, అక్కడ పుట్టిన ఆడపిల్లను ఇక్కడకు తేవడమూ, ఆ అమ్మాయిని చంపబోతే గాలిలోకి ఎగిరి పోతూ ‘నిన్ను చంపేవాడు’ పుట్టేశాడని చెప్పడమూ కంసుడి భయాన్ని పెంచాయి. పుట్టిన పిల్లలనందర్నీ చంపమని పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మొదలైన చాలామందినే పంపాడు. అతను పంపిన వాళ్లంతా కృష్ణుడి చేతిలో చచ్చిపోయారు. అక్రూరుణ్ని పంపించి, బలరామకృష్ణుల్ని ధనుర్యాగం చూడడమనే మిషను పెట్టి, ‘చావు’ను తన దగ్గరికే పిలిపించుకున్నాడు. వాళ్లు మథురకు వస్తూనే ఆ వింటిని విరగ్గొట్టారు. భూవలయానికే అలం కారమని పేరుపొందిన కువలయా పీడ మనే బలిష్ఠమైన ఏనుగును మీదకు ఉసి గొలిపితే, దంతాలూడబెరికి దాన్ని చంపేశారు; కండలు తిరిగిన మల్ల యోధులు చాణూర ముష్టికుల్ని ఉపయోగించి చంపుదామనుకుంటే, వాళ్లనూ చంపేశారు. ఆ మీద కృష్ణుడు, కంసుడు కుస్తీపట్లను చూడ్డానికి ఎక్కి కూర్చొన్న మంచె మీదకు లంఘించి... అతని జుట్టు పట్టుకొని కిందకు పడేసి తానూ అతని మీదకు ఉరికి చంపి నేలమీద ఈడ్చేశాడు. దాంతో అస్తి ప్రాప్తులిద్దరూ ఒకేసారి విధవలైపోయారు. తండ్రి దగ్గరికి చేరి, ‘మా భర్తను చంపిన వాణ్ని చంపి ప్రతీకారం తీర్చ’మని అతన్ని ప్రేరేపించారు. దాంతో జరాసంధుడికి కృష్ణుడితో వైరం ప్రారంభమైంది. తన గదను తొంభై తొమ్మిదిసార్లు తిప్పి తిప్పి తన ఊరు గిరివ్రజం నుంచి మథురవైపు విసిరితే, తొంభై తొమ్మిది యోజనాలు దూరంలో ఉన్న మథుర దగ్గర పడింది. ఆ ప్రదేశం ‘గదావసానం’గా ప్రసిద్ధికెక్కింది. జరాసంధుడు యుద్ధానికి వెళ్తే ఎదుటి వాళ్ల తేజస్సును హరించే శక్తి ఉన్నవాడు గనక చాలామంది రాజుల్ని అలవోకగానే జయించాడు. జయించడమే గాక, వాళ్లను రుద్రయజ్ఞంలో బలి ఇద్దామని ఇరవై వేల పైచిలుకు మంది రాజుల్ని తన నగరం గిరి వ్రజంలో ఖైదు చేసి ఉంచాడు. మథురలో ఉన్న కృష్ణుణ్ని కూడా అంత సులువుగానూ జయించాలని ఇరవై మూడు అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని దండెత్తాడు. బలరామ కృష్ణులు ఆ అక్షౌహిణీలనన్నిటినీ సంహ రించి, జరాసంధుణ్ణి మాత్రం చంపకుండా వదిలి పెట్టారు. దానికి కారణం ఉంది. అతగాడు మళ్లీ మళ్లీ అంతంత సైన్యాన్నీ తెచ్చుకొని వస్తాడు గనక, భూభారాన్ని కొంతలో కొంత మథుర సీమలోనే తగ్గించ వచ్చు అని. ఇలా అతను పదిహేడుసార్లు ప్రతి తూరీ ఇరవై మూడు అక్షౌహిణీలతో వచ్చి తాను ఒక్కడే తిరిగి వెళ్తూండేవాడు. పదిహేడో యుద్ధంలో హంసుడనే ఒక యోధుడు బలరాముడి చేతిలో చనిపోతే, తన సహ సేనాపతే పోయాడని డింభకుడు గూడా బాధతో యమునాప్రవాహంలోకి ఉరికి చచ్చిపోయాడు. డింభకుడు ఈ విధంగా ఒక అబద్ధపు చావు విని పోవడం చూసి, హంసుడు నిజంగానే ఆ యమున లోకి దుమికి ప్రాణాల్ని వదిలేశాడు. ఇలా ఏ శస్త్రానికీ చావని హంస డింభకులు ఒక్క సారిగా చచ్చిపోయి జరాసంధుడికి గొప్ప బాధనే మిగిల్చారు. పద్దెనిమిదోసారి, బలరామకృష్ణులు అతన్ని మోసగించ డానికి పరిగెత్తుతూ పారిపోతూన్నట్టు నటించి, ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండే ప్రవర్షణ పర్వతం మీదకు ఎక్కారు. జరాసంధుడు ఆ కొండ చుట్టూ ఎండు కట్టెలు పేర్పించి నిప్పంటించాడు. వాళ్లిద్దరూ కొండమీంచి ఉరికి బయటపడి వెళ్లిపోయారు. జరా సంధుడు మాత్రం బలరామకృష్ణులిద్దరూ ఆ మంటల్లో కాలిపోయారనే దిలాసాతో గిరివ్రజానికి తిరిగి వెళ్లిపోయాడు. మథురలో ఉంటే ఇలా అస్తమానూ జరాసంధుడు దండెత్తుతూనే ఉంటాడని, సముద్రంలో ఉన్న ద్వారకకు రాజధానిని మార్పించాడు శ్రీకృష్ణుడు. అక్కడికి దండెత్తి వెళ్లడం కష్టం గనక, జరాసంధుడి దాడులూ ఆగాయి. కానీ అతని కోపం మాత్రం చల్లారలేదు. ధర్మరాజు రాజ సూయయాగం చేయడానికి ఉపక్రమిస్తూ, శ్రీకృష్ణుడు తనకు మార్గదర్శకుడిగా ఉండా లని ప్రార్థిస్తూ వర్తమానం పంపాడు. ఆ వర్తమానం వచ్చేముందే, జరాసంధుడు చెరసాలలో పెట్టిన రాజుల నుంచి రహ స్యంగా ఒక దూత వచ్చి, వాళ్లను విడి పించి కాపాడాలని విన్నవించాడు. రెండు పనులూ ఒకేసారి ఎలా జరుగుతాయి? అప్పుడు ఉద్ధవుడు కృష్ణుడితో ‘ధర్మరాజు రాజసూయం చేయాలంటే, రాజులందర్నీ జయించాలి. ఆ దిగ్విజయానికి పెద్ద అడ్డు జరాసంధుడే. అంచేత అతన్ని మట్టు బెట్టడం అవసరం. అతను చావగానే చెర సాలలో ఉండే రాజులందరూ ముక్తులవు తారు. కనక జరాసంధుణ్ని చంపేందుకు పథకం వేస్తే రెండు పనుల్నీ ఒకేసారి సాధించవచ్చు’ అని సలహా ఇచ్చాడు. ఈ పనుల్ని ఒకేసారి చేయడానికి ముందు ధర్మరాజు దగ్గరికే వెళ్లాడు కృష్ణుడు. ధర్మరాజుతో జరాసంధుణ్ని చంపడం గురించి మంతనాలు చేశాడు: ‘జరా సంధుణ్ని రణంలో చంపడమన్నది సురా సురులందరూ కలసినా అయ్యే పని గాదు. అతన్ని బాహుయుద్ధంలోనే జయించాలి. నాలో నీతీ భీముడిలో బలమూ అర్జు నుడిలో మమ్మల్నిద్దర్నీ రక్షించగలిగే శక్తీ ఉన్నాయి. బలం గుడ్డిది; దానికి మాలో ఉన్న విచక్షణ అవసరం. అంచేత నామీద నమ్మకం ఉంచి భీమార్జునులిద్దర్నీ నా చేతిలో పెట్టావంటే, జరాసంధుణ్ని చంపి తిరిగి వస్తాను’ అన్నాడు. నయమూ జయమూ బలమూ కలసి విక్రమిస్తే సిద్ధి తథ్యమని యుధిష్ఠిరుడు ఆ ముగ్గుర్నీ గిరివ్రజానికి పంపించాడు. ముగ్గురూ మూడు అగ్నుల్లాగ తేజస్వంతులైన బ్రాహ్మ ణుల వేషాలు వేసుకొని బయలుదేరారు. విపులగిరీ వరాహగిరీ వృషభగిరీ ఋషిగిరీ చైత్యగిరీ అనే ఐదు గిరులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కలసి గిరివ్రజాన్ని చుట్టి రక్షిస్తున్నాయి. సూర్యచంద్రాగ్నుల్లాటి ఆ ముగ్గురూ ముఖద్వారాన్ని వదిలిపెట్టి, ఎత్తయిన చైత్యక పర్వతం మీదుగా గిరి వ్రజానికి చేరుకున్నారు. అక్కడ ఎద్దు రూపంలో వచ్చిన ఋషభుడనే రాక్షసుణ్ని జరాసంధుడి తండ్రి బృహద్రథుడు చంపి, ఆ రాక్షసుడి మాంసంతో మూడు భేరీలను మోగించినప్పుడు దివ్యపుష్ప వర్షం పడుతూ ఉండేది. ఆ మూడు భేరీలనూ ఈ ముగ్గురూ బద్దలుగొట్టి చైత్యశిఖరాన్ని తమ బాహుబలంతో విరగ్గొట్టి, గిరివ్రజంలోకి చొరబడ్డారు. జరాసంధుడి దగ్గరికి చేరారు. బ్రాహ్మణులకు పూజ చేయడం అతని వ్రతం. కృష్ణుడొక్కడే మాట్లాడుతూ ‘మా తోటి వాళ్లిద్దరూ అర్ధరాత్రి దాటితేనే గానీ మాట్లాడరు’ అని చెబితే, వాళ్లను యజ్ఞశాలలోనే ఉండమని, రాత్రి తిరిగి వస్తానని చెబుతూ జరాసంధుడు రాజభవనానికి వెళ్లిపోయాడు. బ్రాహ్మణులంటే ఎంతో గౌరవం గనకనే మాట ప్రకారం అర్ధరాత్రి తిరిగి వచ్చాడు. వాళ్లను నిశితంగా చూసి క్షత్రి యుల్లాగ ఉన్నారని పసిగట్టి నిలదీశాడు. కృష్ణుడు దానికి ‘మేము బ్రాహ్మణులం కాము. నేను కృష్ణుణ్ని. వీళ్లిద్దరూ మా మేన బావలైన భీమార్జునులు. మాతో యుద్ధం చెయ్యి. ఆ రాజులనందర్నీ విడిచి పెట్టు, లేదా యముడి దగ్గరికి పో!’ అన్నాడు. ‘నేను ఆ రాజులనందర్నీ దేవతా బలికోసం తెచ్చి ఎందుకు విడిచిపెట్టాలి? మన సేనలతో గానీ, మీలో ఒకడితో గానీ ఇద్దరితో గానీ ముగ్గురితోనూ గానీ నేను పోరాడతాను, రండి’ అని, కొడుకైన సహదేవుడికి పట్టంగట్టి, యుద్ధం చేయడానికి వచ్చాడు జరాసంధుడు. భీముడు జరాసంధుణ్ని పైకి లేవనెత్తి వేగంగా తిప్పడం మొదలుపెట్టాడు. తిప్పి తిప్పి మోకాళ్లతో వీపును విరిచి, శరీరాన్ని పిప్పిపిప్పిగా నలుపుతూ గర్జించాడు. ఒక చేత్తో జరాసంధుడి ఒక కాలు పట్టుకొని, రెండో కాలిమీద తన కాలు ఉంచి, అతన్ని రెండు ముక్కలుగా చీల్చేశాడు. అలా రెండు సగాలుగా పుట్టినవాణ్ని రెండు సగాలుగానే చేసి యమలోకానికి పంపాడు. తన ఎక్కువతనాన్ని నిలబెట్టు కోవడానికి అతిక్రూరంగా చేద్దామనుకొన్న రుద్రయజ్ఞం చెయ్యకుండానే చచ్చి పోయాడు తానే అందరికన్నా అధికుణ్నను కున్న జరాసంధుడు. శ్రీకృష్ణుడు అతని చెరసాలలో ఉన్న రాజులందర్నీ విడిపించి, వాళ్లందరిచేతా ధర్మరాజుకు కప్పం కట్టించాడు. ఆ విధంగా మహాభారత యుద్ధానికి అంకురం లాంటి రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా నడిపించడానికి శ్రీకారం చుట్టాడు శ్రీకృష్ణుడు. - డా॥ముంజులూరి నరసింహారావు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement