-
ఆగని ఆత్మహత్యలు
- మైసూరులో మరో రైతన్న బలవన్మరణం - పంట పొలాల్లోనే నేలకొరుగుతున్న అన్నదాతలు సాక్షి, బెంగళూరు: నేల తల్లినే నమ్ముకున్న అన్నదాతలు చివరకు ఆ తల్లి ఒడిలోనే కుప్పకూలిపోతున్నారు. ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటూ వచ్చిన పంటపొలాల్లోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అప్పుల బాధలను తాళలేక పంటకు అంటించిన నిప్పుల్లోనే మండ్యకు చెందిన రైతు నింగేగౌడ గురువారం సజీవదహనం కాగా, మైసూరుకు చెందిన మరో రైతు శివలింగేగౌడ సైతం అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం మధ్యాహ్న సమయంలో తన పంటపొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు జిల్లా నంజనగూడులోని సిద్దగుండినహుండి గ్రామానికి చెందిన రైతు శివలింగేగౌడ చెరకు, వరి పంటలను పండిస్తున్నారు. వ్యవసాయం కోసం దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. చెరకు పంటకు చెల్లించాల్సిన బకాయిలు చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెల్లించకపోవడంతోపాటు, ప్రస్తుతం పండిం చిన చెరకును సరైన ధరకు అమ్ముకునే పరిస్థితులు కనిపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శివలింగేగౌడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం తన పంట పొలానికి చేరుకున్న శివలింగేగౌడ పంట కోసం వినియోగించే పురుగులమందును తా గి ప్రాణాలు వి డిచారు. పొలానికి వెళ్లిన శివలింగేగౌడ ఎంతకూ రాకపోవడంతో కంగారు పడ్డ అతని కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా అక్కడ అచేతన స్థితిలో పడి ఉన్న శివలింగేగౌడను గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. నెలకు ఇద్దరు అన్నదాతలు ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో మొత్తం 58 మంది అన్నదాతలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే సగటున నెలకు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడినట్లు లెక్క. ఈ గణాంకాలు ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబేరేగౌడ వెల్లడించినవే. ఇక రెండేళ్లలో 58 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. గత నెల రోజుల్లోనే మొత్తం 19 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ చెబుతున్నారు. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని అందువల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నింగేగౌడ కుటుంబానికి నేతల ఓదార్పు అప్పుల బాధతో చెరుకు పంటకు నిప్పుపెట్టి అదే పంటలోకి దూకిన రైతు నింగేగౌడ నివాసానికి అనేక మంది నేతలు తరలివచ్చారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడతో పాటు మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప తదితరులు శుక్రవారం ఉదయం నింగే గౌడ నివాసానికి చేరుకొని నింగేగౌడ కుటుంబసభ్యులను ఓదర్చారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ మాట్లాడుతూ, ‘చెరకు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడతాం. ఇక ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అంతేకాక రైతులు కూడా తమ కుటుంబ సభ్యుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఇదే సందర్భంలో నింగేగౌడ కుటుంబానికి రూ.1లక్ష సహాయాన్ని దేవేగౌడ ప్రకటించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ, నింగేగౌడ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.5లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు. -
దంపతుల మధ్య దారుణ చిచ్చు
భర్త మృతి..కొన ఊపిరితో భార్య అప్పులు బాధలు తట్టుకోలేక అఘాయిత్యం లక్ష్మీపురంలో విషాదం చోడవరం టౌన్: అప్పుల బాధలు దంపతుల ఆత్మహత్యాయత్నానికి దారితీశాయి. భర్త మృతి చెందగా.. భార్య కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విచారకర సంఘటన మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మహారాజు అప్పారావు(36) కుటుంబం గ్రామంలోని కల్లాలు వద్ద నివాసముంటోంది. కల్లం దిబ్బ తప్ప అతనికి సెంటు భూమిలేదు. ఏటా కౌలు సాగుతో నెట్టుకొస్తున్నాడు. పెట్టుబడులు పెరిగిపోవడం, పంట కలిసిరాకపోవడంతో సుమారు రూ. 2 లక్షల వరకు అప్పులు చేశాడు. హుద్హుద్ ధాటికి తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇటీవల మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో తరచూ భార్యాభర్తలు గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటి సమీపంలోని పశువుల పాకలో ఇద్దరూ పురుగుమందు తాగారు. స్థానికులు గుర్తించి చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. చికిత్సపొందుతూ అప్పారావు చనిపోయాడు. భార్య లక్ష్మి(30) పరిస్థితి విషమంగా ఉండటంతో108లో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బంధువులు తెలిపారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పారావుకు లక్ష్మి మూడో భార్య. మొదటి భార్య కామెర్లుతో చనిపోయింది. ఆమెకు పుట్టిన కొడుకు, కుమార్తె తాతగారి ఇంట ఉంటున్నారు. రెండో భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. అనంతరం లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రమణయ్య తెలిపారు. -
అప్పుల బాధతోయువరైతు ఆత్మహత్య
రెంజల్ : అప్పుల బాధలు భరించలేక మండలంలోని తాడ్బిలోలి గ్రామానికి చెందిన ప్రవీణ్రెడ్డి(28) అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.మంగళవారం రాత్రి కుటుంబీకులు పక్క ఇళ్లల్లో టీవీ సీరియల్ చూసేందుకు వెళ్లిన సమయంలో ప్రవీణ్రెడ్డి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య సుమలతతో పాటు కూతురు, కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పెట్టుబడులు దక్కక.. పంటలపై చేసిన అప్పులు తీర్చలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతీ యోటా పెరుగుతున్న పెట్టుబడులు, దీనికి తోడు ప్రకృతి వైపరిత్యాలు రైతన్నలను వెం టాడుతుండటంతో చిన్నకారు రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. గత సీజన్లో పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన మండలంలోని తాడ్బిలోలి గ్రామానికి చెందన ప్రవీన్రెడ్డి (28) అనే రైతు మంగళవారం రాత్రి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగున్నర ఎకరాల భూమి కలిగిన ప్రవీణ్రెడ్డికి ఇటీవల పంటల పై చేసిన అప్పులు పెరిగాయి. తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పొలాల్లో వేసిన బోర్లు పడకపోవడంతో అప్పులు రూ. 2.75 లక్షల వరకు పెరిగాయని స్థానికులు వివరించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జీవితేచ్ఛ ఆవిరై!
కొండంత ఆశలతో వర్షాధార పంటలే పంచప్రాణాలుగా అందినంత అప్పు చేసి చెమటోడ్చి సేద్యం చేస్తున్న రైతన్నలు.. కరవు కాటుకు తమ కళ్లెదుటే పంటలు గిడసబారి ఎండుతుంటే జీవితేచ్ఛ ఆసాంతమూ ఆవిరై బలవన్మరణాల పాలవుతున్నారు. వరుణుడి వంచన, విద్యుత్ వెతలు, రద్దుకాని రుణ బాధలు, తోడేళ్లలా వేటాడుతున్న వడ్డీ వ్యాపారుల పీడ.. వెరసి విధిలేక మెట్ట సేద్యాన్నే నమ్ముకున్న బడుగు రైతును బలిగొంటున్నాయి. వాతావరణానికి అనువైన పంటల మార్పిడితోపాటు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చెప్పి పచ్చని బాట పట్టించే ఆసరా అంతకుముందే కొడిగట్టింది. ఈ నేపథ్యంలో నీటి వసతి లేని తేలిక నేలల్లోనూ అధిక ఖర్చుతో కూడిన పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు వేస్తూ అమావాస్య దీపం చుట్టూ ముసిరే ఉసుళ్ల మాదిరిగా నేలరాలుతున్న విషాదకర దృశ్యాలు ముఖ్యంగా తెలంగాణ పల్లెసీమలను నిస్తేజంగా మార్చుతున్నాయి. గత కొద్ది నెలల్లో వందలాది మంది రైతన్నలు ప్రాణత్యాగం చేస్తూ పంటపొలంలో వటవృక్షం మాదిరి బలిసిన సంక్షోభాన్ని, ఎవరికీ పట్టని తమ నిస్సహాయతను ఎలుగెత్తి చాటుతున్నారు. అటువంటి ఒకానొక అభిమన్యుడు మాలోతు రవి నాయక్! పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ‘సాక్షి’ ఇటీవల పరామర్శించింది. బంధువులు, గ్రామస్తుల సమాచారం మేరకు మెట్ట వ్యవసాయం యువ రైతుకు ప్రాణాంతకంగా పరిణమించిన తీరును ఆవిష్కరించే ప్రయత్నమే ఈ కథనం.. గిరిజన యువ రైతైన రవి నాయక్ గత నెల 15న తన మిరప చేలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వయసు 34 ఏళ్లు. స్వగ్రామం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లేపల్లి. భార్య భారతి(32) రెక్కలు ముక్కలు చేసుకుంటూ వ్యవసాయ పనుల్లో భర్తకు చేదోడుగా ఉంటుంది. పిల్లలు ఈ ఏడాది నుంచే మనోహర్(10), జస్వంత్(8) ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు. పదో తరగతి వరకు చదివి ఉమ్మడి కుటుంబ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రవి మూడేళ్ల నుంచి సొంతంగా సేద్యం చేస్తున్నాడు. శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని, పిల్లలను బాగా చదివించాలన్న తపన కలిగిన రైతుగా అతనికి గ్రామంలో గుర్తింపుంది. అసలే కౌలు.. ఆపై పత్తి, మిరప సాగు.. సాగర్ ఎడమ కాలువ నీరు పారే చివరి గ్రామాల్లో కల్లేపల్లి ఒకటి. గ్రామంలోని 500 రైతు కుటుంబాలు కాలువ నీరందే 200 ఎకరాల్లో వరి, మిగతా వెయ్యి ఎకరాల్లో మెట్ట పంటలు సాగు చేస్తున్నాయి. రవికి కాలువ కింద సెంటు భూమి లేదు. మెట్ట ప్రాంతంలో 6 ఎకరాల భూమి ఉంది. కాలువ నీరు లేదు. బోరు వసతీ లేదు. గుట్టల మధ్యన ఎత్తయిన ప్రాంతంలో రెండెకరాల ఎర్రని ఇసుక దువ్వ నేలలో మిరప తోట వేశాడు. మరోచోట రాళ్లు రప్పలతో కూడిన తేలికపాటి నేల 4 ఎకరాల్లో పత్తి వేశాడు. మరో 4 ఎకరాలను కౌలు(ఎకరానికి రూ.5 వేలు)కు తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు రవి. తోటి రైతుల మాదిరిగానే ఖర్చుకు వెనకాడకుండా అప్పోసొప్పో చేసి కాంప్లెక్స్ ఎరువులు, పురుగుమందులు విరివిగా వాడుతున్నాడు. అతనికి జత ఎడ్లు, రెండు గేదెలున్నాయి. వీటి పేడ ఎరువును ఒక్కో ఏడాది ఒక్కో పొలంలో రొటేషన్ పద్ధతిలో చల్లుతుంటాడు. ఈ ఏడాది 4 ట్రాక్టర్ల పశువుల ఎరువును మిరప తోటకు వేశాడు. అతని తమ్ముడు రాజు కూడా తన రెండెకరాలతోపాటు మరో 6 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు. పక్క రైతు బోరు నుంచి నీటిని తీసుకునే అవకాశం రాజుకు దొరికింది. రవికి దొరకలేదు. కీలక దశలో పడిన వర్షం 30% మాత్రమే! దామరచర్ల మండలాన్ని గత ఏడాది ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించింది. ఈ ఏడాది మేలో రోహిణీ కార్తె ప్రారంభం రోజున పెద్ద వాన పడింది. దీంతో ఈ ఏడాదైనా మంచి వర్షాలు పడతాయని, అప్పులన్నీ తీర్చేయొచ్చన్న కొండంత ఆశతో రైతులు ఖరీఫ్ సాగుకు ఉపక్రమించారు. ఒకటీ అరా జల్లులు కురుస్తుండడంతో రవి నాయక్ 8 ఎకరాల్లో ఖరీదైన బీటీ పత్తి విత్తనాలు కొని వేశాడు. పత్తి విత్తనాలు సరిగ్గా మొలకెత్తక రెండోసారి మళ్లీ కొని బీటీ విత్తనాలు వేశాడు. అయితే, రైతులు ఆశించిన విధంగా వర్షాలు పడలేదు. మండల అధికారుల సమాచారం మేరకు.. ఖరీఫ్ పంట కాలం మొదటి 3 నెలల్లో (జూన్- ఆగస్టు నెలల్లో) సాధారణ వర్షపాతంతో పోల్చితే కేవలం 30% వర్షం కురిసింది. సెప్టెంబర్- అక్టోబర్ 15వ (రవి నాయక్ ఆత్మహత్య చేసుకున్న) తేదీ మధ్య 45% నమోదైంది. అయితే, తుపాన్ వల్ల అక్టోబర్ 18న భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలో జూన్-నవంబర్(15వ తేదీ) మధ్య 85% వర్షం నమోదైనందున.. ఈ ఏడాది కరువు మండలంగా ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో నెల నెలా తగినంత వర్షం లేక, బోర్ల ద్వారా నీరందక వర్షాధార పంటలు గిడసబారి దిగుబడి మరీ తగ్గిపోయింది. బోర్లెన్ని వేసినా ఫలితం శూన్యం.. తన మెట్ట పొలానికి బోర్ల ద్వారా నీటి వసతిని సమకూర్చుకోవడానికి రవి రెండేళ్లలో పది బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. గత ఏడాది వేసిన 4 బోర్లు విఫలమయ్యాయి. ఈ ఏడాది 6 బోర్లు వేశాడు. ఈ లోగా పాతవి, కొత్తవి కలిపి భూమిని, పాస్బుక్ను తనఖా పెట్టి బ్యాంకులో తెచ్చిన అప్పు రూ. 5 లక్షలకు, ప్రైవేటు అప్పులు రూ. 6 లక్షలకు పెరిగాయి. రెండు బోర్లలో కొంచెం నీరు కనపడింది. ఆ నీటినైనా తోడి పంటను రక్షించుకుందామని విశ్వప్రయత్నం చేశాడు. పుట్టెడు అప్పులకు కష్టాలు తోడయ్యాయి. కరెంటు వచ్చేది రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు. వచ్చిన కరెంటు ఎంత సేపుంటుందో తెలీదు. ఎన్నిసార్లు పోయి, వస్తుందో లెక్కలేదు. ఈ ఏడాది 4 సార్లు మోటారు కాలిపోయింది. కాలిన ప్రతి సారీ రూ.5 వేల ఖర్చు. అయినా మొండి ధైర్యంతో మోటారు రిపేర్లు చేయించి చేను తడిపే ప్రయత్నం చేశాడు. అక్టోబర్ 14 రాత్రి మిరప తోటకు నీళ్లు పెట్టడానికి వెళ్లాడు రవి. రాత్రి 3 గంటలు 2 మోటార్లు ఆడినా ఒక సాలు కూడా సరిగ్గా తడవని దుస్థితి. వర్షమూ పడటం లేదు. కళ్లెదుటే ఎండిపోతున్న పంటను రక్షించుకోలేనన్న అధైర్యం రవిని కమ్ముకుంది. పొలానికి పిచికారీ చేయడానికి తెచ్చిన పురుగుమందు తాగి, అక్కడే తుది శ్వాస విడిచాడు. తెల్లారి పొద్దున అన్నం తీసుకెళ్లిన అతని భార్య భారతి తొలుత నిద్రిస్తున్నాడనుకుంది. నోటి నురగ చూసి భీతిల్లి గొల్లుమనడంతో ఇరుగుపొరుగు రైతులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లే అంతా అయిపోయింది.. ప్రస్తుతం ఈ పొలాన్ని భారతి అన్న రమేశ్ చూస్తున్నాడు. 8 ఎకరాల్లో ఇప్పటికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 2 క్వింటాళ్లు రావచ్చన్నాడు. గిడసబారిన మిరప తోట పూతమీదుంది. ఎంత దిగుబడి వస్తుందో ఆ దేముడికే ఎరుక! వ్యవసాయ సూచనలిచ్చే వారే లేరు! కల్లేపల్లిలో మెట్ట రైతులు పత్తి, మిరప తప్ప మరో పంట వేయడం లేదు. రవి బాబాయి లక్పతి (సొంత భూమి 4 ఎకరాల్లో పంటల మార్పిడి పాటిస్తూ కూరగాయలు, పత్తి, మిరప పండిస్తున్నాడు) వంటి ఒకరిద్దరికి తప్ప పంటల మార్పిడి అలవాటు అసలే లేదు. ఎప్పుడు ఏం చేస్తే పంట బాగుంటదో చెప్పాల్సిన వ్యవసాయాధికారి, విస్తరణాధికారులూ పత్తాలేరని కల్లేపల్లి రైతులు చెప్పారు. రవి చనిపోయినప్పుడు పంచనామాకు తప్ప వ్యవసాయ సూచనలివ్వడానికి వారు ఈ ఏడాది ఒక్కసారీ తమ గ్రామానికి రాలేదన్నారు. కల్లేపల్లిలో మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో పరిస్థితి ఇదే. పూర్తిస్థాయి వాతావరణ బీమా రక్షణతోపాటు పంటల మార్పిడి, మిశ్రమ పంటల సాగు, ఖర్చు తగ్గే సుస్థిర సాగు పద్ధతులను వ్యవసాయాధికారుల నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో రైతులకు అందించడం తప్ప సాగు సంక్షోభ నివారణకు దగ్గర దారేదీ లేదు. రవి విషాద గాథ చెబుతున్నది ఇదే. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: వల్లపురెడ్డి, మహేశ్వరరెడ్డి; ఫొటోలు: ముచ్చర్ల శ్రీనివాస్ కౌలు సేద్యమే కొంపముంచింది! తనకున్న పొలంతో సరిపెట్టుకోకుండా నీళ్లు లేని పొలాలను కౌలుకు చేయడం వల్లే రవి అప్పులపాలయ్యిండు. ‘కొంచెం చేసేది తన కొరకు.. మరింత చేసేది మంది కొరకు’ అన్నట్లయింది. సంపాయించుకొని పైకి రావాలని తాపత్రయపడ్డాడు. దేముడు అట్ల చేసిండు. వర్షాల్లేవు, కరెంటూ లేక రైతుల చావుకొచ్చింది. - మాలోతు లక్పతి, మృతుడు రవి పినతండ్రి, అభ్యుదయ రైతు, కల్లేపల్లి గ్రామాల్లోకొచ్చి రైతులను చైతన్యవంతం చేయాలి వాతావరణంలో మార్పులొచ్చాయి. గతంలో మబ్బులొస్తే వర్షం పడేది. ఇప్పుడు మబ్బులొచ్చినా వర్షం పడటం లేదు. ఒక ఊళ్లో పడితే ఇంకో ఊళ్లో పడటంలేదు. ఈ ఏడాది వర్షాలు తక్కువుంటాయి.. పంటలు మార్చండి, పెట్టుబడులు తగ్గించండని మాకు ఏ అధికారీ చెప్పలేదు. పెట్టుబడులు పెరిగిపోయి రైతు దెబ్బతింటున్నాడు. వ్యవసాయాధికారులు ప్రతి గ్రామంలో నెలకోసారి గ్రామసభలు పెట్టి రైతులను చైతన్యవంతం చేయాలి. పదేళ్లుగా మట్టి నమూనాలు ఇచ్చినా.. ఒక్కసారీ ఫలితం ఏమిటో చెప్పే స్థితిలో అధికారుల్లేరు. ఈ పరిస్థితి మారాలి. కరెంటు పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు టైంటేబుల్ ప్రకారం కచ్చితంగా ఇవ్వాలి. - మాలోతు రాంమోహన్ నాయక్, మాజీ ఆదర్శ రైతు, రవి దాయాది, కల్లేపల్లి బ్యాంకు రుణాలన్నీ రద్దు చేయాలి! ఎట్ల బతకాలో తెలియటం లేదు. బ్యాంకు అప్పులన్నీ రద్దుచేసి, మా పిల్లలను చదివించాలి. గవర్నమెంటే ఆదుకోవాలి. పత్తి విత్తనాలకు రూ.16 వేలు ఖర్చుపెట్టినం. అవి కూడా తిరిగొచ్చేలా లేవు.. నాకొచ్చిన కష్టం ఇంకొక ఆడకూతురికి రాకుండా చూడాలి. - భారతి, మృతుడు రవి భార్య -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
నెట్వర్క్: అప్పుల బాధలు, రుణమాఫీపై అనుమానాలు.. విద్యుత్ కోతలు వెరసి రుణదాతలు ఉసురు తీసుకుంటున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన చాకలి నర్సింహులు(35) తనకున్న రెండెకరాల్లో మూడు బోర్లు తవ్వించాడు. అవి వట్టి పోవడంతో అప్పుల కుప్పగా మారాడు. మరో వైపు మండల కేంద్రంలోని స్టేట్బ్యాంక్లో తనకున్న రూ. 45 వేల రుణం మాఫీ అవుతుందో లేదోనన్న బెంగపట్టుకుంది. ఈ క్రమంలో తన చెరుకుతోటలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కొమరారం గ్రామానికి చెందిన రైతు గంగావత్ తారు (40) తనకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోవడంతో మరోసారి రెండున్నర ఎకరాల్లో అదే పంట వేశాడు. విద్యుత్ కోతలతో పంటకు నీరందక ఎండిపోయింది. పంట పెట్టుబడికి తోడు పాత రుణం మొత్తం రు. 4 లక్షల వరకు అప్పు అయింది. సోమవారం చేను వద్దకు వెళ్లిన తారు పంట ఎండిపోవడం చూసి, అప్పు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురయ్యాడు. వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకున్నాడు. రాత్రి కరెంట్కు రైతు బలి ఆత్మకూరు: రాత్రి కరెంట్కు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని చౌళ్లపల్లికి చెందిన రైతు బలయ్యూడు. పోలీసుల కథనం ప్రకారం... రాచర్ల భద్రయ్య (50)తనకున్న ఎకరమున్నర భూమిలో పత్తి సాగుచేశాడు. సోమవారం వేకువజామున 3 గంటలకు చీకట్లో పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. స్టార్టర్ ఆన్ చేసినా... మోటర్ నడవకపోవడంతో సర్వీస్ వైరు చెక్ చేస్తూ వెళుతుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement