breaking news
Childrens literature
-
మన లోకం పిలుస్తోంది చలో చలో
ఆకాశంలో ఎగిరే ‘మేజిక్ కంబళి’... ‘ఓపెన్ ససేమ్’ అనగానే తెరుచుకునే గుహద్వారం దీపం రుద్దితే వచ్చే ‘జినీ భూతం’... దొంగల భరతం పట్టే ‘తెనాలి రామ’అక్బర్ని పకపకా నవ్వించే ‘బీర్బల్ గారు’ ... అమాయకుల్ని మోసం చేసే ‘బంగారు కంకణం పులి’‘కరటక దమనకులు’ ... ‘మర్యాద రామన్న’లు ... ‘హారీ పాటర్’లూ ‘సూపర్ మేన్’ సిరీస్లూ...బుక్ఫెయిర్ నిండా బాలల లోకమే... ఎన్నో కొత్త కొత్త పుస్తకాలు వారిని అక్కడకు తీసుకెళ్లండి...వాళ్ల లోకాలను సొంతం చేసుకోనివ్వండి...‘నువ్వు ఏ దిక్కయినా వెళ్లు... ఒక్క ఉత్తర దిక్కు తప్ప’ అంటుంది పూటకూళ్ల అవ్వ రాకుమారుడితో పిల్లల కథల్లో. రాకుమారుడు పట్టుబట్టి ఉత్తర దిక్కు వైపే వెళతాడు. ప్రమాదాలను ఎదుర్కొంటాడు. అపాయాలను దాటుతాడు. శాపాలతో బంధించబడిన వారిని విముక్తం చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న రాజ్యానికి రాజవుతాడు. అందరూ నడిచే దారుల్లో నడవకుండా కొత్త దారుల్లో ధైర్యంగా వెళ్లమని పిల్లలకు చె΄్తాయి కథలు. ప్రస్తుతం జరుగుతున్న ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’లో అలాంటి ధైర్యాన్ని నూరి పోసే అనేక పుస్తకాలుంటాయి. వాటిని వారికి ఇవ్వండి. అక్కడకు తీసుకెళ్లండి.‘ఈసప్’ అనే పెద్దాయన కనీసం రెండు వేల ఏళ్ల క్రితం కొన్ని కథలు చెప్పి మనుషుల్ని సంస్కరించాడు. ‘బంగారు గొడ్డలి’ కథ అతడు చెప్పిందే. కట్టెలు కొట్టేవాడు తన ఇనుప గొడ్డలి నదిలో పారేసుకుంటే నదీ దేవత వెండి గొడ్డలి తీసుకు వస్తుంది... తనది కాదంటాడు... బంగారు గొడ్డలి తీసుకు వస్తుంది... తనది కాదంటాడు... చివరకు ఇనుప గొడ్డలే తీసుకుంటాడు... నదీ దేవత సంతోషించి మూడు గొడ్డళ్లనూ అతనికి బహూకరిస్తుంది. నిజాయితీతో ఉంటే మంచి ఫలితాలు ఎదురవుతాయి అని పిల్లలకు చె΄్తాయి కథలు. విలువలకు ప్రాముఖ్యం లేకుండా పోతున్న నేటి రోజుల్లో పెద్దలు వాటిని చెప్పకపోతే పోయారు... కనీసం పుస్తకాలైనా చెప్పనివ్వండి... పిల్లల్లో నిజాయితీ పాదుకునేలా చేయండి.ఇంట్లో దొంగలు పడితే వారి చేత బావి లోని నీళ్లన్నీ చేదించి పాదులకు పోయించుకున్నాడు తెలివైన తెనాలి రామలింగడు. ‘ఈ బిడ్డ నాదంటే నాది’ అని ఇద్దరు తల్లులు కొట్లాడుకుంటే వారిలో అసలు తల్లి ఎవరో యుక్తిగా కనిపెట్టాడు మర్యాద రామన్న. నమ్మించి కొంతమంది ఎలా గొంతు కోస్తారో అనడానికి ఉదాహరణగా నిలిచాడు ఆషాఢభూతి. వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్న పావురాలు అన్నీ కలిసి ఐకమత్యంతో వలతో పాటు ఎగిరి వెళ్లిపోయాయి. ఆకాశంలో కొంగలు మోసుకెళుతున్న తాబేలు నోటి తీటతో నోరు తెరిచి నేలన పడి ప్రాణం వదిలింది....ఇవన్నీ పిల్లలకు చెప్పే పాఠాలెన్నో. ఎన్నెన్నో. అందుకే వారికి మంచి స్కూలు, మంచి ట్రాన్స్పోర్టు, ట్యూషను ఎలా పెడతామో మంచి పిల్లల పుస్తకం కూడా అలాగే చేతికివ్వాలి. పిల్లలు నేర్చుకునే విధాలు వేయి. కాని వేయి విధాలుగా నేర్పగల ఒకే సాధనం పుస్తకం.గతంలో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు... పిల్లల కోసం ప్రచురితమయ్యేవి. వాటిలో కథలు, బొమ్మలు, విశేషాలు ఉండేవి. పిల్లలతోపాటు పెద్దలూ ఆసక్తిగా చదివేవారు. కాలం మారింది. పిల్లలు స్కూళ్లు, క్లాసులు, ట్యూషన్ల మధ్య హడావిడి పడుతుండటంతో మెల్లగా ఒక్కో పత్రికా మూతబడింది. ప్రస్తుతం పిల్లల కోసం నడుస్తున్న పత్రికలు అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ లోటును తీర్చేందుకు కొందరు రచయితలు పిల్లల పుస్తకాలు రాస్తున్నారు. వాటికి ఆకర్షణీయమైన బొమ్మలు జోడించి ప్రచురిస్తున్నారు. చదవడం, రాయడం వచ్చిన కొందరు పిల్లలు తమ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కథలు, కవితలు రాసి పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఇప్పటికే ‘చిప్పగిరి కథలు’, ‘జక్కాపూర్ బడిపిల్లల కథలు’, ‘నల్లగొండ జిల్లా బడిపిల్లల కథలు’, ‘మా బడి పిల్లల కథలు’, ‘సిద్ధిపేట జిల్లా బడిపిల్లల కథలు’, ‘మన ఊరు–మన చెట్లు’ ‘వరంగల్ జిల్లా బడి పిల్లల కథలు’ వంటి పిల్లలు రాసిన కథలతో వచ్చిన పుస్తకాలు ఆదరణ పొందాయి. దీంతోపాటు చిట్టి పొట్టి పాటలు, బాల గేయాలు, కవితలు రాసి విద్యార్థులు ఉపాధ్యాయుల సాయంతో ప్రచురిస్తున్నారు. కొందరు ఇంగ్లీషులోనూ రాసి పుస్తకాలు తెస్తున్నారు. అవన్నీ బాలసాహిత్యానికి బలమైన చేర్పుగా మారాయి. తెలుగులో బాలసాహిత్యం ఏనాటి నుంచో ఉంది. పాల్కురికి సోమనాథుడు, పోతన వంటి ప్రాచీన కవుల రచనల్లో పిల్లల కోసం తేటతెనుగు మాటలు జాలువారాయి. అనంతర కాలంలో అలపర్తి వెంకటసుబ్బారావు, నార్ల చిరంజీవి, మిరియాల రామకృష్ణ, మహీధర నళినీమోహన్, న్యాయపతి రాఘవరావు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, దాసరి వెంకట రమణ, ఎం.హరికిషన్, చొక్కాపు వెంకటరమణ, భూపాల్, వాసాల నర్సయ్య, పత్తిపాక మోహన్, ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి తదితరులు బాలల కోసం అనేక పుస్తకాలు రాశారు. ప్రస్తుతం అనేకమంది రచయితలు బాలసాహిత్యకారులుగా గుర్తింపు పొందారు. రష్యన్ బాల సాహిత్యం కూడా తెలుగులో పునర్ముద్రణ అవుతోంది. అనిల్ బత్తుల ‘రష్యన్ జానపద కథలు’ పుస్తకం తీసుకొచ్చారు. ‘పిల్లల సినిమా కథలు’, ‘బాపు బొమ్మల పంచతంత్రం’ వంటి పుస్తకాలు పిల్లల కోసం తీసుకొచ్చారు. ప్రముఖ రచయిత్రి ముళ్లపూడి శ్రీదేవి రాసిన పిల్లల కథలు ప్రచురితం అయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జానకీరామ్ ‘ఏడు రంగులవాన’ అనే బాలల కథల పుస్తకం రాయడంతోపాటు విద్యార్థుల చేత కథలు రాయించి, తన సంపాదకత్వంలో ‘ఊహలకు రెక్కలొస్తే’ అనే కథల పుస్తకం తీసుకొచ్చారు. పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి తానా, మంచి పుస్తకం 2025లో పోటీ నిర్వహించగా ‘చతుర్ముఖం’ (శాఖమూరి శ్రీనివాస్), ‘ఆలిబాబా అయిదుగురు స్నేహితులు’ (డా.ఎం.సుగుణరావు), ‘మనకు మనుషులు కావాలి’ (పాణ్యం దత్తశర్మ), ‘మునికిష్టడి మాణిక్యం’ (ఆర్.సి.కృష్ణ స్వామిరాజు), ‘జాను అనే నేను, నా స్నేహితురాళ్లు’(పేట యుగంధర్) పుస్తకాలు ఎంపికయ్యాయి. ఇటీవల రచయిత దొండపాటి కృష్ణ పిల్లలకోసం ‘వింత శాపం’ అనే చిన్ని పుస్తకం తీసుకొచ్చారు. ఇవి కాకుండా ఇంగ్లిష్ భాషలో ఎన్నో పుస్తకాలు పిల్లల కోసం ఉన్నాయి. ఆ నింగి నక్షత్రాలను నేలన ఉన్న తారలకు ఇవ్వండి. తెలుగు నేర్పించేందుకు కథలు చదివిస్తున్నారుఇంతకు ముందు తల్లిదండ్రులు ఇంగ్లిష్ పుస్తకాలు చదివించేందుకు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు తెలుగు పిల్లలకు రావాలని తెలుగు పుస్తకాలు చదివిస్తున్నారు. ‘మంచి పుస్తకం’ సంస్థ పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు ప్రచురిస్తోంది. పిల్లల ఏజ్ గ్రూప్ను బట్టి వారి కోసం ‘గ్రీన్ సిరీస్’, ‘బ్లూ సిరీస్’... ఇలా పుస్తకాలు ప్రచురిస్తున్నాం. మనకి తెలియాల్సిన విషయం ఏమిటంటే రెండూ రెండున్నర ఏళ్ల పిల్లలు కూడా పుస్తకాలకు ఆకర్షితులవుతారు. వారి కోసం బొమ్మల పుస్తకాలు ఉంటాయి. అప్పటి నుంచి అలవాటు చేయాలి. ‘మంచి పుస్తకం’ తరఫున ‘గిఫ్ట్ ఏ లైబ్రరీ’ కాన్సెప్ట్ ఉంది. మీరు చదివిన స్కూల్కు 10 వేల రూపాయల పుస్తకాలు బహూకరించాలనుకుంటే వాటిని డిస్కౌంట్లో 8500 లకే మేము అందిస్తాం. ఈ ఆలోచనకు మంచి స్పందన ఎదురవుతోంది. పిల్లలకు పుస్తకాలు కొని తెచ్చివ్వడం కన్నా వారిని పుస్తకాల షాపుకు తీసుకెళితే వారికి కలిగే ఉత్సాహం వేరు అని మా అనుభవం చె΄్తోంది. ఇక బుక్ఫెయిర్కు తీసుకెళితే వారు తూనీగలే అవుతారు.– పవిత్ర, మంచి పుస్తకం ఇన్చార్జ్రికార్డుల మోతచిన్న వయసులోనే ఎక్కువ రికార్డ్లు సృష్టించిన యువతిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది చండీగఢ్కు చెందిన జాన్వీ జిందాల్. ప్రీస్టైల్ స్కేటింగ్లో అద్భుతాలు సృష్టిస్తోంది. జాన్వీకి కోచ్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. తండ్రి సహాయంతో, యూట్యూబ్ వీడియోల ద్వారా స్కేటింగ్ నేర్చుకుంది.‘భాంగ్రా ఆన్ స్కేట్స్’ ‘యోగా ఆన్ స్కేట్స్’వంటివి సృష్టించి, భారతీయ సంస్కృతిని స్కేటింగ్తో మిళితం చేసింది. పదకొండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న జాన్వీ, మన దేశంలో అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను సాధించిన తొలి మహిళగా నిలిచింది. -
బాలోత్సవం
కథ పుట్టడమూ, పిల్లల కథ పుట్టడమూ వేరుగా జరిగివుండదు. పిల్లల కంటే బాగా ‘ఊ’కొట్టగలిగేవారెవరు! పిల్లలను మైమరిపించడానికే పెద్దలు కథలు అల్లివుంటారు. ఆ వంకతో తమ చిన్నతనంలోకీ జారుకునివుంటారు! చిన్నతనానికీ పెద్దరికానికీ ఉన్న స్పష్టమైన తేడా: బాల్యంలో ఊహలకు సంకెళ్లుండవు. తార్కిక పరిమితి కలలను అణిచి వేయదు. ఎంత సాగితే అంత, ఎంత చూస్తే అంత, ఎంత కావాలనుకుంటే అంత. అక్కడ ఆశలు అనంతం. రెక్కలు అమాంతం. కప్పలు పకపకా నవ్వొచ్చు. కుందేళ్లు చకచకా మాట్లాడొచ్చు. కాకులు నీతులు చెప్పొచ్చు. జింకలు కోతలు కోయొచ్చు.పిల్లల కథ అనేది మబ్బుల్లోకి గెంతించే మాయా కిటికీ. సముద్రం అడుగుకు ఈదనిచ్చే గాలి పడవ. ప్రతి తరమూ తర్వాతి తరానికి అవసరమయ్యే వివేకపు రాశిని కథల రూపంలోనే బదిలీ చేస్తుంది. లోకాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే కాఠిన్యాన్ని అందులోనే కూరి ఉంచుతుంది. ఈసప్ కథలు, పంచతంత్రం కథలు, వెయ్యొన్నొక్క రాత్రుల అరేబియన్ కథలు, జంగిల్ బుక్, కాంచన ద్వీపం, గలివర్ సాహసయాత్రలు, ‘చందమామ’ కథల నుంచి; టామ్ శాయర్, నొప్పి డాక్టర్, లిటిల్ ప్రిన్స్, హాబిట్, హారీ పాటర్ దాకా పిల్లల మనో ప్రపంచపు ఎల్లలను విశాలపరిచినవే! కథల వల్ల పిల్లలకు ఊహాశక్తి పెరుగుతుంది, సమస్యా పరిష్కారం తెలుస్తుంది, భాష అబ్బుతుంది, వ్యక్తీకరణ అలవడుతుంది, లోకరీతి అర్థమవుతుంది, ప్రపంచపు భిన్నత్వం పట్ల అవగాహన కలుగుతుంది, సాటి జీవుల పట్ల సానుభూతి కలుగుతుంది, తమ సాంస్కృతిక వారసత్వపు గొప్పతనం అనుభవంలోకి వస్తుంది, అన్నింటికీ మించి అమితమైన ఆనందం దొరుకుతుంది. జీవితపు సంరంభంలోంచి వచ్చే ఆనందానికి అదనంగా, మనిషికి ఉన్న మరో ఆనందపు వనరు కథలు కాక మరేమిటి?అసలు పిల్లల కథలు పిల్లలకు కలిగించే ప్రయోజనాలన్నీ పెద్దలకు కూడా కలిగిస్తాయి. ఏం పెద్దల్లో మాత్రం పిల్లలు బజ్జునిలేరా? అంతెందుకు, ఆరిస్టాటిల్ లాంటి తత్వవేత్త కూడా నిజమైన మంచి జీవితం గడపడం కోసం కాల్పనికత అవసరాన్ని సమర్థించాడు. అసలు సాధ్యం కానిది కూడా ఊహించగలగడం అవసరమని ఆయన వాదించాడు. టాల్స్టాయ్ లాంటి మహారచయిత కూడా పిల్లల కోసం కథలు రాశాడు. కాకపోతే ఇదీ నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పకూడదనీ, కథ ద్వారా పిల్లలు తమకు కావాల్సింది తాము తీసుకుంటారనీ అన్నాడు. మీరు ఎంతపెద్దవాళ్లయినా బాలసాహిత్యాన్ని చదవాలంటుంది కాథెరీన్ రండెల్ అనే బాలసాహిత్య రచయిత్రి. పిల్లల పుస్తకాలు మనం మర్చిపోయిన విషయాలనే కాదు, మనం మర్చిపోయామని మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుచేస్తాయంటుందామె.లండన్లోని థేమ్స్ నదిలో పడవ షికారుకు పోయినప్పుడు తన వెంటున్న స్నేహితుడి ముగ్గురు కూతుళ్లకు ఓ కథ చెప్పాడట లూయిస్ కరోల్. అందులో అలీస్ లిడ్డెల్ అనే పదేళ్ల పాప కూడా ఉంది. ఒక రోజు నది ఒడ్డున విసుగ్గా కూర్చున్న ‘అలీస్’కు కోటు తొడుక్కుని, గడియారం పెట్టుకున్న ఒక తెల్ల కుందేలు కనబడటమూ, దానివెంట ఆమె ఆ కుందేలు బొరియలోకి పోవడమూ, అక్కడ్నుంచి వింతలూ విచిత్రాలూ... వాహ్! విన్నవెంటనే దాన్ని తనకోసం రాసిపెట్టమందట అలీస్. అట్లా ‘అలీస్(స్) అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్’ పుస్తకంగా రూపుదాల్చింది. 1865 నవంబర్లో తొలిసారి ప్రచురితమైన దీనికి ఈ నెలలోనే 160 ఏళ్లు వచ్చాయి. జంతువులు జంతువుల్లా ఉండకుండా, మనుషులు మనుషుల్లా కాకుండా ప్రవర్తించే సాహిత్యాన్ని ‘నాన్సెన్స్ లిటరేచర్’ అని వర్గీకరించడం ఉంది. దాన్ని నిరర్థకమైనదని కాకుండా, హేతువుకు అందని అర్థవంతమైన సాహిత్యం అన్న అర్థంలో చూడాలి. అందుకేనేమో, ఇకనుంచీ బాల సాహిత్యానికీ తమ అవార్డు ఇవ్వనున్నట్టు బుకర్ ఫౌండేషన్ ఇటీవలే ప్రకటించింది. 8–12 ఏళ్ల చిన్నారులను ఉద్దేశించి రాసే ఉత్తమ రచనకు ‘చిల్డ్రెన్స్ బుకర్ ప్రైజ్’ పేరుతో యాభై వేల పౌండ్లు ఇవ్వనున్నారు. బాలసాహిత్యం అనేది తీసేయదగినది కాదనీ, బాలసాహితీ వేత్తలు తక్కువ రచయితలేమీ కారనీ చెప్పే ఘనమైన వార్త ఇది. కాదామరి... నేటి బాలలే రేపటి ప్రపంచ నిర్మాతలు. -
బాలల సాహిత్యానికీ బుకర్
లండన్: ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన సాహితీ పురస్కారాల్లో ఒకటైన బుకర్ ప్రైజ్ను అందించే బుకర్ ప్రైజ్ చారిటీ శుక్రవారం మరో విశేషమైన ప్రకటన చేసింది. బాలల సాహిత్యానికి బుకర్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. ‘ఈ సాహిత్యం 8– 12 ఏళ్ల వయస్సున్న పిల్లల కోసం రాసిన లేదా ఆంగ్లంలోకి అనువదించిన అత్యుత్తమ సమకాలీన కాల్పనిక సాహిత్యమై ఉండాలి. యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురించినదై ఉండాలి’అని బుకర్ ప్రైజ్ చారిటీ తెలిపింది. ప్రముఖులతోపాటు పిల్లలే జడ్జీలుగా వ్యవహరిస్తూ విజేతను ఎంపిక చేస్తారని పేర్కొంది. ఎంపికైన రచయితకు చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్గా 50వేల పౌండ్లు, అంటే సుమారు రూ.58 లక్షలను అందజేస్తామని తెలిపింది. -
బాల సాహితికి బంధువు బి.వి.నరసింహారావు
స్మృతిపథం: ఆబాలగోపాలం అలవోకగా ఆస్వాదించడానికి అనువైన బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆకర్షణీయ పద్ధతిలో ఆడి పాడి ప్రచారం చేయడం, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం బి.వి.నరసింహారావు జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు. ‘‘నా కొలిచే దేవుళ్ళు పసివాళ్ళు గుండెగుడిని నిండుగ కొలు వుండిన దేవుళ్ళు పసివాళ్ళు’’ అని తెలుగు బాలల వినోద, విజ్ఞాన, వికాసాలకు తన జీవితాన్ని అంకితం చేసి ‘‘బాలబంధు’’గ తెలుగు నాట గణుతికెక్కారు బి.వి. నరసింహారావు. ‘‘అల్లారుముద్దు పిల్లల్లారా! ఇల్లారండి భయపడకండి ఇదిగో నాహృది! మీ విడిది! ఇట దొరుకుతుంది మీకు వలసింది’’ అని పిల్లల్లో పిల్లవాడై తన ఆటతో, పాటతో, మాటతో వారిని తన్మయులను చేసేవాడు. బి.వి. నరసింహారావు. వందల సంఖ్యలో బాలగేయాలు రాశారు. కథలూ, నాటికలు, గేయ నాటికలు, బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంధ్ర, విరిసినపూలు, నా కథలు, ప్రియదర్శి, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు ప్రచురించారు. ఇందులో ‘పాలబడి పాటలు’ 1958లో జాతీయ బహుమతి పొందింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ‘బాలబంధు’ బిరుదాన్ని వారికి ప్రసాదించింది. బాలవాంగ్మయ రచనా వ్యాసంగాన్ని ఆయన నిర్దిష్ట లక్ష్యసాధనకు చేపట్టారు. అవి... చిన్న పిల్లలకు విద్యామార్గాలు, జ్ఞానాంశాలు సులువుగా, సుందరంగా బోధించడం; బాలల్లో నిక్షిప్తమై ఉన్న విశిష్ట లక్షణాలను వివరించి చెప్పడం; కాలం తీరిన పెద్దలకూ, కాలం తీరాన ఉన్న పిన్నలకూ మధ్యనున్న అఖాతాన్ని, అగాథాన్ని అవగాహన అనే పూలవంతెన నిర్మాణం ద్వారా తొలగించడం; పిల్లలను నూతన దృక్కోణంతో, హేతువాద దృష్టితో అర్థం చేసుకొని వారి ఎదుగుదలకు పాటు పడవలసిందిగా పెద్దలకు విన్నవించడం; ముఖ్యంగా ఆబాలగోపాలం అలవోకగా ఆనందంగా అందుకోవడానికి, ఆస్వాదించడానికి అనువైన బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆకర్షణీయ పద్ధతిలో ఆడి పాడి ప్రచారం చేయడం. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బి.వి.నరసింహారావు పెట్టుకున్నారు. నేటి బాల సాహిత్యకారులు బాలబంధు బాటలో నడవాలి. ‘బాలల భావాలు బాలభాషలో వెలార్చడానికి ముందు బాల మనస్కత మనలో పుష్కలంగా ఉండాలి’ అంటారు బాలబంధు. తదనుగుణంగానే తన జీవిత విధానాన్ని ఆయన తీర్చిదిద్దుకున్నారు. 1913 ఆగస్టు 15న కృష్ణాజిల్లా కౌతారం గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన బాడిగ వేంకటనరసింహారావు జీవితం కొత్త పుంతలు తొక్కింది. కాకినాడలో ఆంధ్ర సేవా సంఘం పిల్లలతో నాటకాల్లో వేషాలు వేయించి, చదువు చెప్పిస్తారని విని, చిన్ననాటి నుంచి నటనాభిలాష ఉన్న నరసింహారావు అందులో చేరారు. కస్తూరి శివరావు. రేలంగి వెంకట్రామయ్య ఆయనకు అక్కడ సహాధ్యాయులు. ఆ పాఠశాలలో తెలుగు పండితులు వింజమూరి లక్ష్మీ నరసింహారావు బి.వి. జీవిత గమనాన్ని మార్చివేశారు. వింజమూరి రచించిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్రధారణ బి.వి.తో వేయించారు. తన గానంతో, అభినయంతో, నాట్యంతో ఆయన ప్రేక్షకులను మైమరిపించారు. ఆనాటి నుంచి ‘అనార్కలి నరసింహారావు’గా పేరొందారు. దాదాపు పదేళ్ళపాటు అనార్కలి పాత్రలో ప్రజలను రంజింపచేశారు. ఆ రోజుల్లో స్థానం నరసింహారావు, బి.వి. నరసింహారావు స్త్రీ పాత్రలతో ప్రసిద్ధులయ్యారు. పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు సూచన మేరకు దాదాపు 30 ఏళ్లపాటు నాట్యరంగానికి బి.వి. విశేషసేవ చేశారు. జానపదాలకు నాట్యాభినయం కూర్చి దాన్ని శాస్త్ర,కళాసాంప్రదాయంగా రూపొందించిన ఘనత బి.వి. దక్కించుకున్నారు. ఆధునిక కవిత్వంలో భాగంగా, భావకవిత్వం కొత్త వస్తువుతో కొత్త రూపంలో ఆవిర్భవించిన సమయంలో, ఆ కొత్త పాటల ప్రాతిపదికన కొత్త నాట్యం ఆవిర్భావానికి బి.వి. కారకులయ్యారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, నండూరి, కొనకళ్ల వంటి మహాకవుల గీతాలకు నాట్యాన్ని కూర్చిన ఘనత బి.వి.కే దక్కింది. ‘ఏ కళనైనా చక్కగా ఆస్వాదించాలంటే దాన్ని గురించిన వివేచన వుుందు కొంతైనా అవసరం, అందుకోసం నేను, నా ప్రతి నాట్యాన్ని వివరించడానికి పండితులను ఏర్పాటు చేసుకున్నాను’ అని బి.వి. తన ఆత్మకథలో పేర్కొన్నారు. అలా నాట్య వివరణ అందించినవారిలో కృష్ణశాస్త్రి, విశ్వనాథ, అడవి బాపిరాజు, కాళోజీ, ఇంద్రగంటి, వేదుల వంటి వారెందరో ఉన్నారు.1942లో పాలకొల్లులో బి.వి. నాట్యాన్ని తిలకించిన ఆదిభట్ల నారాయణ దాసు మనసు పులకించి అమాంతంగా రంగస్థలం మీదికి దుమికి ‘ఒరే! నా ఒళ్ళు మొగ్గతొడిగిందిరా నీ నాట్య దర్శనంతో’ అంటూ ఆశువుగా పద్యం చెప్పి ఆశీర్వదించారు. కవిసామ్రాట్ విశ్వనాథ బి.వి. నాట్యానికి ‘భావనాట్యం’ అని పేరుపెట్టారు. బి.వి.నరసింహారావుకి మహారచయిత చలంగారితో ఆత్మీయానుబంధం ఉండేది. తనకు చలం రాసిన లేఖలను పుస్తకంగా వెలువరించారు. 1994 జనవరి 6వ తేదీన విజయవాడ పుస్తక ప్రదర్శనలో చలం శతజయంతి సభలో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురై బి.వి. హఠాన్మరణం చెందారు. అపురూప బాలసాహితీవేత్తగా, తెలుగునాట్యానికి నూతనత్వాన్ని సంతరింపచేసిన నాట్య కళాకారుడుగా చరిత్రకెక్కిన బాలబంధు బి.వి. నరసింహారావు చిరంజీవి.


