breaking news
cat orders
-
ఒక తీర్పు.. పలువురిలో కలవరం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు పలువురు అఖిల భారత సర్వీసు అధికారుల్లో కలవరం పుట్టిస్తోంది. తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ కేడర్లో కొనసాగడానికి రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్లోని సివిల్ సర్వీసెస్ అధికారులను ఆప్షన్లు అడిగిన తరువాత.. వారి సీనియారిటీ, స్థానికత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీవోపీటీ) వారిని రెండు రాష్ట్రాలకు విభజించి కేటాయింపు జరిపింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పలు కారణాలు చూపిస్తూ.. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (సీఏటీ)ను ఆశ్రయించి ఏపీకి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడానికి అనుమతులు తెచ్చుకున్నారు. సీఎస్ సోమేశ్కుమార్ కూడా వీరిలో ఉన్నారు. అయితే డీవోపీటీ 2017లోనే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాల్లోనే పనిచేయాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం మంగళవారం తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం..సోమేశ్కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పు ఇవ్వడం.. పలువురు అధికారులను కలవరపరుస్తోంది. తామంతా ఏపీకి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సదరు ఐఏస్, ఐపీఎస్ అధికారుల్లో కొనసాగుతోంది. ఏపీకి కేటాయించిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో పనిచేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్కు కేటాయించిన కొందరు ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగుతున్నారు. అక్కడివారు ఇక్కడ.. ఇక్కడివారు అక్కడ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్లలో కాకుండా క్యాట్ ఉత్తర్వులతో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఐపీఎస్లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్ మహంతిలు ఆంధ్ర కేడర్కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు. మొన్నటివరకు ఏపీ కేడర్కు చెందిన సంతోష్ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్కు కేటాయించిన మనీష్కుమార్ సింగ్, అమిత్గార్గ్, అతుల్ సింగ్లు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్ అధికారుల్లో సోమేశ్కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్లో పనిచేస్తుండగా కాగా తెలంగాణ కేడర్కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారు. ఇన్చార్జి డీజీపీగా అందుకేనా? తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్ను రెగ్యులర్ డీజీపీగా కాకుండా ఇన్చార్జి డీజీపీగా నియమించడానికి ప్రధాన కారణం హైకోర్టులో సోమేశ్కుమార్పై కొనసాగుతున్న కేసు నేపథ్యమేనన్న ప్రచారం ఉంది. తాజా తీర్పుతో ఇప్పుడు అంజనీకుమార్ పరిస్థితేంటన్నది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉండగా సీనియర్ ఐఏఎస్ల్లో వాకాటి కరుణ ప్రస్తుతం విద్యా శాఖ కార్యదర్శిగా, వాణీప్రసాద్ పర్యావరణ పరిరక్షణ, పరిశోధన, శిక్షణా సంస్థలో డైరెక్టర్గా, రొనాల్డ్రోస్ ఆర్థికశాఖ కార్యదర్శిగా, ఎం.ప్రశాంతి అటవీ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాటా ఆమ్రపాలి కేంద్ర సర్వీస్ల్లోకి వెళ్లి ప్రస్తుతం పీఎంఓలో ఉన్నారు. -
సీఎస్ సోమేశ్కుమార్ను ఏపీకి కేటాయించండి: కేంద్రం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత స్థాయి అధికారుల క్యాడర్ కేటాయింపులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీవోపీటీ)దే పూర్తి అధికారమని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అఖిల భారత స్థాయి అధికారుల కేటాయింపులకు సంబంధించి ఐదుగురు సభ్యులతో వేసిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకే ఏపీ, తెలంగాణకు కేటాయింపులు చేశామని తెలిపారు. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. సోమేశ్ పిటిషన్ను విచారించిన క్యాట్... ఆయన్ను తెలంగాణకు కేటాయిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్ను ఆశ్రయించి తెలంగాణకు కేటాయించేలా ఉత్తర్వులు పొందారని తెలిపారు. క్యాట్ ఉత్తర్వులను రద్దు చేసి సోమేశ్కుమార్ను ఏపీకి కేటాయించేలా ఆదేశించాలని అదనపు సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ పిటిషన్పై శుక్రవారం వాదనలు కొనసాగనున్నాయి. -
క్యాట్ ఉత్తర్వులు జూన్ 3 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కేడర్ కేటాయింపులపై యథాతథస్థితి కొనసాగించాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను జూన్ 3 వరకు పొడిగించింది. ఈ మేరకు వెంకటేశ్వర్రావు, రంజనా చౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కేడర్ కేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం మరోసారి విచారించింది. ఇందులో తమను తెలంగాణలోనే కొనసాగించాలని ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, కరుణ వాకాటి, ఐపీఎస్ శివప్రసాద్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం జూన్ 3 వరకు వీరిని తెలంగాణలోనే కొనసాగించాలని ఆదేశించింది. అలాగే తనను ఏపీలోనే కొనసాగించాలని ఐఎఫ్ఎస్ అధికారి పీఎస్ రాఘవయ్య కోరుతుండగా...ట్రైనీ ఐఏఎస్లు శ్రీజన, శివశంకర్లు సహా ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం వీరికి జూన్ 3 వరకు ఎక్కడి వారిని అక్కడే కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా క్యాడర్ కేటాయింపులపై అభ్యంతరాలుంటే ప్రత్యూష్సిన్హా కమిటీకి నివేదించాలని ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్లకు సూచించగా... కమిటీకి నివేదించినా స్పందనలేదని, కమిటీపై నమ్మకం లేకే క్యాట్ను ఆశ్రయించామని నివేదించారు.