breaking news
Arun Krishnamurthy
-
మితంగా...పర్యావరణ హితంగా..!
పర్యావరణస్పృహతో ఈసారి మీరు కూడా మీ ఇంటికి పర్యావరణ హిత దీపావళిని ఆహ్వానిం చండి. పండగ సంతోషాన్ని రెట్టింపు చేసుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే, ఆ పెద్దవాళ్ల కంటే పెద్దవాళ్లు ఉంటే... ఒక్కసారి అడిగి చూడండి - ‘‘ఆ రోజుల్లో దీపావళి ఎలా జరిగేది?’’ అని. వాళ్లు కథలు కథలుగా ఆ రోజుల గురించి చెబుతారు. వాటిలో మీకు పొరపాటున కూడా కాలుష్య భూతం కనిపించదు. కాలంతో పాటు దీపావళికి కాల్చే బాణాసంచాలో మార్పు వచ్చింది. ఎంత ఎక్కువగా కాలిస్తే అంత కన్నుల పండగగా జరుపుకున్నట్లు, ఎంత శబ్దం వస్తే అంత గొప్పగా జరుపుకున్నట్లు... అనుకునే రోజులు వచ్చాయి. ఈ ధోరణిలో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే కృషి చేస్తూ కాలుష్యరహిత దీపావళిపై స్పృహ కలిగించడానికి హైదరాబాద్ యువతలో కొందరు ‘స్కై లాంతర్స్ ఛాలెంజ్’ పేరుతో వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. రద్దీ ప్రదేశాల్లో అకస్మాత్తుగా, ఆసక్తికరంగా నృత్యాలు చేస్తూ ‘ఫ్లాష్ మాబ్’, ‘స్ట్రీట్ ప్లే’ మొదలైన వాటితో పర్యావరణ హిత దీపావళి గురించి ఆసక్తి కలిగిస్తున్నారు. ఆకాశదీపాల (స్కై లాంతర్లు) ద్వారా దీపావళి అంటే ‘శబ్దం’ కాదని ‘వెలుగు’ అనే సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రతి వ్యక్తీ మరో ముగ్గురిని భాగస్వామ్యం చేసేలా కృషి చేస్తున్నారు. పర్యావరణ హిత దీపావళి గురించి గత నాలుగేళ్ళుగా ప్రచారం చేస్తున్న పర్యావరణ ప్రేమికుడు అరుణ్ కృష్ణమూర్తి ‘‘కాస్త ఆలస్యంగానైనా తగిన ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను’’ అంటున్నారు. ‘‘గతంలో మేము ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్పందన పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం బాణాసంచా వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. తమ పరిసరాల్లో ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వాల్సిందిగా అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. ఇదొక మంచి పరిణామం’’ అంటున్నారు అరుణ్. కాగా, పర్యావరణహిత ‘గ్రీన్-దీపావళి’ గురించి ప్రచారానికి సుదీర్ఘమైన ఉపన్యాసాల మీద ఆధారపడకుండా వినోదాన్నే ఆశ్రయి స్తున్నారు. ప్రాచుర్యం పొందిన సినిమా పాటల బాణీలతో భూగర్భ జల కాలుష్యం, శబ్ద కాలుష్యం... మొదలైన సమస్యలపై పాటలు అల్లి ప్రచారం చేస్తున్నారు. అయితే ‘బాణాసంచా కాల్చొద్దు అనడం హిందూ సంస్కృతికి వ్యతిరేక’మంటూ కొందరి నుంచి అభ్యంతరాలు వినవచ్చాయి. దీపావళి అంటే శబ్దాడంబరం కాదని... దీపాల వరుస అని, కాలుష్య కారకమైన బాణాసంచా కాల్చడం అనేది దీపావళి సంప్రదాయంలో ఎప్పుడూ లేదని, గత నాలుగు దశాబ్దాల నుంచే కాలుష్యాన్ని పంచే బాణాసంచా సంప్రదాయం పెరిగిందని... పై అభ్యంతరానికి సమాధానం ఇచ్చారు గ్రీన్-దీపావళి ప్రేమికులు. వీటి కోసమేనా మనం బాణాసంచా కాల్చేది!? శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. భూగర్భ జలాలు కలుషితమవుతాయి వాయు కాలుష్యం పెరుగుతుంది. ముక్కు, గొంతు, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి రకరకాల చర్మరోగాలకు కారణం అవుతాయి. -
చెరువుల చెలికాడు..
చదువు పూర్తవుతుండగానేగూగుల్లో ఉద్యోగం సంపాదించాడు.అంతే తొందరగా ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. పర్యావరణవేత్తగా జీవితాన్ని మార్చుకున్నాడు. పాడైపోతున్న చెరువులను పరిశుభ్రం చేయసాగాడు. రోలెక్స్ యంగ్ లారియేట్ అవార్డు సాధించాడు. భారతదేశం నుంచి ఎన్నికైన యంగ్ అచీవర్గా నిలిచాడు. చెన్నైకి చెందిన పాతికేళ్ల అరుణ్ కృష్ణమూర్తి ప్రస్థానంలోని మైలురాళ్లివి... ‘‘ఉద్యోగంలో కూరుకుపోవడం వల్ల నాకు ఖాళీ సమయం దొరకదు. ఆ కారణంగా నేను అనుకున్నవేవీ సాధించలేకపోతాను. అందుకే 2010లో గూగుల్లో ఉద్యోగానికి స్వస్తి పలికి, సంఘసేవలోకి అడుగుపెట్టాను’’ అంటాడు అరుణ్ కృష్ణమూర్తి. ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే... బ్రిటిష్ జంతుశాస్త్రవేత్త డా. జేన్ గుడ్ ప్రారంభించిన ‘రూట్స్ అండ్ షూట్స్’లో పనిచేసిన అనుభవంతో 2011లో సొంతంగా ‘ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ (ఈఎఫ్ఐ) అని ఒక ఎన్జీవోను ప్రారంభించాను. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలలో ‘లేక్ బయోడైవర్సిటీ రెస్టొరేషన్ ప్రాజెక్ట్’ ఒకటి. 2008 లో హైదరాబాద్లోని గురునాథం చెరువును, 2009 లో చెన్నైలోని లక్ష్మీపుష్కరాన్ని పరిశుభ్రం చేశాం. ఇందుకుగాను రోలెక్స్ అవార్డ్ అందుకున్నప్పుడు భారతదేశానికి పేరు తీసుకువచ్చానన్న ఆనందం కలిగింది. నా డైరీ... నాలుగో క్లాసు చదువుతున్నప్పటి నుంచీ నాకు డైరీ రాసే అలవాటు ఉంది. నన్ను తీర్చిదిద్దిన గురువు డా. జేన్ గుడ్ ఆల్ భారతదేశానికి వచ్చినప్పుడు నన్ను ప్రశంసిస్తూ నాలుగు మాటలు రాయడానికి ఈ డైరీనే ఉపయోగపడింది. ఆయన స్ఫూర్తితోనే నేను ఇన్ని సాధించగలుగుతున్నాను. మా కార్యక్రమాలు... నాకు పర్యావరణం మీద మక్కువ ఎక్కువ. అలాగే వన్యప్రాణి సంరక్షణ మీదా శ్రద్ధ ఎక్కువ. ప్రతి ఒక్కరూ పర్యావరణం గురించి, అందులోని సమస్యల గురించి ఆలోచిస్తుంటారే కాని, నివారణచర్యల గురించి అస్సలు ఆలోచించరు. నేను మాతృభూమి పరిరక్షణకు పూనుకున్నాను. ఈఎఫ్ఐ సంస్థను ప్రారంభించాను. ఇందులో 900 మంది వలంటీర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 20 ఏళ్ల వయసు లోపువారే. వారందరికీ నేనే స్వయంగా శిక్షణనిచ్చాను. వీరంతా... పాఠశాలలకు వెళ్లి మా కార్యక్రమాల గురించి వివరిస్తారు. మేమంతా కలిసి సరస్సుల ప్రక్షాళన చేస్తాం. మా జట్టు చేసిన ప్రక్షాళన... మేం చేసిన పనులలో బాగా గుర్తుంచుకోదగినది చెన్నైకి దక్షిణంగా ఉన్న కీళ్కట్టలై ప్రక్షాళన. దీని వెడల్పు 1.5 కి.మీ. ఈ సరస్సు నుంచి పల్లికరణికి నీటి సరఫరా అవుతుంది. ఒకప్పుడు ఆ చుట్టుపక్కల వారికి దాహాన్ని తీర్చిన ఆ సరస్సు పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. అనేక పక్షులకు, తాబేళ్లకు ఆలవాలంగా ఉన్న ఈ సరస్సు, వాటికి అనువుగా లేకుండా పోయింది. దీనిని ఇలాగే వదిలేసి ఉంటే, మరో 20 ఏళ్ల తర్వాత ఈ సరస్సు గత చరిత్రగా మారిపోయేది. ఎలాగైనా సరే, దీనికి పూర్వ వైభవం తీసుకురావాలనే పట్టుదలతో, ఈ సరస్సును నాలుగు అంచెలలో శుభ్రపరిచాం. ముందుగా చుట్టుపక్కల ఉండేవారిని గుర్తించాం. సంవత్సరాలుగా సరస్సులో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశాం. మలినాలను తొలగించి నీటిని స్వచ్ఛంగా మార్చాం. అంతకుముందు ఆ సరస్సులో ఉండే జీవజాతుల్ని మళ్లీ అందులో వేయడంతో మా లక్ష్యం నెరవేరింది. లక్ష్యం దిశగా... నా రోజువారీ ఖర్చుల కోసం ఒక కమ్యూనికేషన్ కంపెనీని నడుపుతున్నాను. నేను రోజుకి 14 - 16 గంటలు పనిచేస్తాను. 2010 నుంచి నా జీవితాన్ని ఇలాగే గడుపుతున్నాను. సంపాదిస్తున్నదానిలో సగం నేను స్థాపించిన సంస్థ లక్ష్యాలసాధన కోసం ఖర్చు చేస్తాను. నేను ఆలోచించేది, చేసేది కూడా ఈఎఫ్ఐ కోసమే. మా ప్రాజెక్ట్ ద్వారా మార్పు సాధ్యమని నిరూపించాలనుకుంటున్నాం. మంచి ఆశయ సాధనకు అందరి సహాయసహకారాలు అందుతాయని నమ్ముతున్నాం. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న అరుణ్ కృష్ణమూర్తి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. కానీ, తగినన్ని నిధులు లేకపోవడం వల్ల ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అతడికి మరింతమంది చేయూతనిస్తే కాలుష్య రహిత భారతదేశాన్ని తయారుచేయగలడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. - డా. వైజయంతి ప్రక్షాళన చేశాక ఆ సరస్సు మళ్లీ కలుషితం కాకుండా ఉండాలంటే, ఆ సరస్సు చుట్టుపక్కల ఉండేవారిని లేక్ గార్డియన్లుగా నియమిస్తే మంచిదనుకున్నాం. అలా చేయడం వలన సరస్సు పరిరక్షణ సక్రమంగా సాగుతుంది. కనుక సరస్సుకు చేరువగా నివసించేవారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే 600 కుటుంబాల వారు ఇందులో చేరారు. ముందు ముందు మరింతమంది వచ్చిచేరతారని భావిస్తున్నాం.