breaking news
Aprentissip
-
నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం కల్పించి నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక నోవాటెల్ హోటల్లో బుధవారం జరిగిన ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అ ప్రెంటిస్షిప్ విధానంపై పరిశ్రమల్లో ఉన్న అపోహలను తొలగించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా పరిశ్రమలు న్నా.. మెజారిటీ వాటిల్లో ఈ విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. ఏదైనా పరిశ్రమ ఇది అమలుచేస్తే వారికిచ్చే శిక్షణలో 25శాతాన్ని ప్రభుత్వం తిరిగి ఆ కంపెనీకి చెల్లిస్తుందని తెలిపారు. దీని ద్వారా నెలకు ఒక్కో విద్యార్థికి రూ.1500 స్టైఫండ్ అందిస్తారన్నారు. కేంద్రం రూ.10 వేల కోట్ల కేటాయింపు.. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది నిరుద్యోగులకు శిక్షణనివ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు కేటాయించిందని, నేటికి రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేశామన్నారు. త్వరలో 10 లక్షల నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భృతి ఇవ్వనుందని, వారికి అప్రెంటిస్ షిప్ను అనుసంధానించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. సర్వీస్ సెక్టార్లు అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, సెరికల్చ ర్లో 5 లక్షల వరకూ ఉపాధి అవకాశాలున్నాయని, ఈ తరహా శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నామన్నారు. దేశంలోనే ‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీ ప్రథమ స్థానంలో నిలించిదని కొనియాడారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ కె.సాంబశివరావు మాట్లాడుతూ అప్రెంటిస్షిప్ విధానంపై అపోహలు తొలగించేందుకు ట్రైనింగ్ పార్టనర్లతో ఈ సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్కీమ్ ఉద్యోగం కాదని, భవిష్యత్తులో ఉపాధి పొందడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జె.ఎస్.వి ప్రసాద్, యూత్ ఎఫైర్స్ చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం, ఏపీఎస్డీసీ డైరక్టర్ కె.లక్ష్మీనారాయణ, సీఐఐ మాజీ చైర్మన్ జి.ఎస్.శివకుమార్, పలు పరిశ్రమల ప్రతినిధులు, ట్రైనింగ్ పార్టనర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ చివరి ఏడాది అప్రెంటిస్షిప్!
ఆలోచనలు సాగిస్తున్న ప్రభుత్వం విశాఖలో జరిగే విద్యాసదస్సులో దీనిపై చర్చ హైదరాబాద్: ఉన్నత విద్యారంగంలో సంస్కరణల దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, పరిశ్రమలకు అవసరమైన రీతిలో నిపుణులను తయారుచేయడం లక్ష్యంగా సంస్కరణలపై కసరత్తు సాగిస్తోంది. ఇంజనీరింగ్ విద్యలో మార్పులు చేయడానికి అధికారులు కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కాలేజీల నుంచి బయటకు వచ్చే ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఆయా సబ్జెక్టుల్లో నిపుణత ఉండేలా తీర్చిదిద్దాలన్నది దీని సారాంశం. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో సబ్జెక్టులపై అవగాహన కలిగించేలా కాలేజీల్లో బోధనాభ్యసనాన్ని మొదటి మూడేళ్లకు కుదించనున్నారు. నాలుగో ఏడాది పూర్తిగా అప్రెంటిస్షిప్ను అమలుచేయనున్నారు. ఇందుకోసం కాలేజీలను పరిశ్రమలకు అనుసంధానిస్తారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసి బయటకు వచ్చే విద్యార్థి తరువాత అప్రెంటిస్షిప్ కోసం ఆయా పరిశ్రమల చుట్టూ తిరుగుతున్నారు. అవకాశం లేని వారు అదీ చేయడం లేదు. దీన్ని నివారించేందుకు విద్యార్థులు కాలేజీల్లో ఉండగానే అప్రెంటిస్షిప్ను పూర్తిచేయించాలన్నది ఉద్దేశం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వీరిని తయారుచేస్తే కోర్సు పూర్తయ్యేనాటికి ఆయా పరిశ్రమల్లోనే వారికి ఉద్యోగాలు దొరకడమో, లేకుంటే ఆ అనుభవంతో వేరే చోట్ల అవకాశాలు దక్కించుకోగలుగుతారని భావిస్తున్నారు. విశాఖపట్నంలో యూనివర్సిటీల ఉపకులపతులు, విద్యారంగ నిపుణులు, ఇతర ప్రముఖులతో త్వరలో నిర్వహించబోయే సదస్సు ఎజెండాలో దీన్ని ముఖ్యాంశంగా చేరుస్తున్నారు. దీనిపై కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని విద్యాశాఖవర్గాలు వివరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా ఏటా లక్షకు పైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు.