breaking news
Aeronautical Society of India
-
ఏరోనాటికల్ సొసైటీ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ‘ఏరోస్పేస్ & ఏవియేషన్ ఇన్ 2047’ అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో శనివారం ప్రారంభమైంది. నవంబర్ 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో ఏరోస్పేస్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఏఈఎస్ఐని అభినందించారు. అనంతరం ఎగ్జిబిషన్ను ప్రారంభించి, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను సందర్శించి స్టార్టప్లతో సంభాషించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, సైన్స్లో భారతీయ మహిళల పాత్ర పెరుగుతోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. రక్షణ, టూరిజం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ రక్షణ రంగంలో దేశం సాధించిన విజయాలు, భారత ప్రభుత్వం విధాన సంస్కరణలు, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా డీఆర్డీవో చేస్తున్న కృషిని అభినందించారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అతిథులను స్వాగతిస్తూ అధునాతన సామర్థ్యాల సాధనతో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి అన్ని పరిశోధన, విద్యాసంస్థలు, పరిశ్రమల కృషిని సమన్వయం చేయడంలో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పాత్ర గురించి వివరించారు. అలాగే ఇస్రో చైర్మన్ సోమనాథ్, సీఎస్ఐఆర్ డీజీ డాక్టర్ కరైసెల్వి, డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ డాక్టర్ కామత్, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, హాల్ చైర్మన్ అనంతకృష్ణన్, పౌర విమానయాన శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు పీయూష్, టాటా సన్స్ ప్రెసిడెంట్ బన్మాలి అగర్వాల్, యూఎస్ఏ జనరల్ అటామిక్స్ సీఈవో డాక్టర్ వివేక్ లాల్ తదితరులు ప్రసంగించారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు, నీతి ఆయోగ్ సభ్యులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ సంస్థల అధిపతులు, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, స్టార్టప్లు, విద్యార్థులతో సహా 1,500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 200 పరిశ్రమలు, ఎస్ఎంఈలు, 75 పైగా స్టార్టప్లు ఎగ్జిబిషన్లో తమ స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. -
మేకిన్ ఇండియాకు ఏరోనాటిక్స్ సొసైటీ ఊతం
రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేకిన్ ఇండియా’కు తమ వంతు సహకారం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం డెరైక్టర్, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లుమినరీ లెక్చర్ సిరీస్ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ వైమానిక రంగంలో అందుబాటులో లేని పరికరాలు, తయారీ సౌకర్యాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏరోనాటికల్ సొసైటీల సహకారంతో ఈ లోటును భర్తీ చేసి తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అన్ని సొసైటీలకు లేఖలు రాశామన్నారు. వారి స్పందనల ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని వివరించారు. సెన్సర్లు మొదలుకొని అనేక ఇతర వైమానిక రంగ పరికరాల తయారీకి భారత్ కేంద్రం కావచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైమానిక రంగంలో కీలక పాత్ర పోషించే ఏరోనాటిక్స్ అభివృద్ధికి, విస్తృతికి హైదరాబాద్ సొసైటీ కృషి చేస్తోందన్నారు. వచ్చే నెలలో ఐఆర్ఎన్ఎస్ఎస్ తుది ఉపగ్రహం: ఇస్రో చైర్మన్ దేశీ జీపీఎస్ వ్యవస్థ సాకారమయ్యేందుకు మిగిలిన ఒకేఒక్క ఉపగ్రహాన్ని వచ్చేనెల చివరి వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్కుమార్ తెలిపారు. మొత్తం ఏడు ఉపగ్రహాలతో ఏర్పడనున్న ఈ కొత్త వ్యవస్థ ఇతర వ్యవస్థల కంటే మెరుగైన లొకేషన్ ఆధారిత సేవలు అందిస్తుందన్నారు. ఇస్రో ఇప్పటికే అభివృద్ధి చేసిన గగన్, భువన్ (గూగుల్ ఎర్త్ వంటి మ్యాప్) వ్యవస్థలతో కలిపి చూసినప్పుడు దేశీ జీపీఎస్ భారత్తో పాటు ఇరుగుపొరుగు దేశాలకు ఎంతో ఉపయుక్త సేవలు అందిస్తుందని వివరించారు. నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెరైక్టర్ శ్యామ్ చెట్టి తదితరులు పాల్గొన్నారు.