పెట్రోలియం యూనివర్సిటీకి మరో 50 ఎకరాలు
* అధికారులకు వర్సిటీ కార్యదర్శి ప్రతిపాదన
* ఉన్నతాధికారుల సుముఖత
* త్వరలో భూమి అప్పగింత
సబ్బవరం (పెందుర్తి): అంతకాపల్లి వద్ద నిర్మించనున్న జాతీయ పెట్రోలియం యూనివర్శిటీకి అదనంగా 50 ఎకరాలు కావాలని వర్శిటీ కార్యదర్శి సుష్మాసూద్ ప్రతిపాదించారు. గురువారం గ్రామంలో వర్శిటీ ప్రతినిధులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అదనపు భవనాల నిర్మాణానికి ఈ భూమిని వినియోగిస్తామన్నారు. వర్శిటీ ప్రతినిధుల ప్రతిపాదనకు జిల్లా ఉన్నతాధికారులు సుముఖత వ్యక్తం చేశారని తహశీల్దారు సత్తి నాగేశ్వరరెడ్డి చెప్పారు.
త్వరలోనే భూమిని వారికి అప్పగిస్తామని చెప్పారు. ఇప్పటికే వర్శిటీ నిర్మాణం కోసం అంతకాపల్లిలో సర్వే నెంబర్లు 113 పి, 114పి, 117పి లలో 150 ఎకరాల విస్తీర్ణం భూమిని కేటాయించినట్టు వెల్లడించారు. హెచ్పీసీఎల్ డీజీఎం సాధుసుందర్, సీనియర్ మేనేజర్ దినేష్ ప్రసాద్, ఆర్ఐ సుష్మ, సర్వేయర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.