
మసీదుకు దారి చూపించమని.. అత్యాచారం
మసీదుకు ఎలా వెళ్లాలో దారి చూపించాలని అడిగి.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడో వ్యక్తి.
మసీదుకు ఎలా వెళ్లాలో దారి చూపించాలని అడిగి.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని భివాండి ప్రాంతంలో జరిగింది. శనివారం రాత్రి బిస్కట్లు కొనుక్కోడానికి బయటకు వెళ్లిన బాధితురాలు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు భివాండి ఇన్స్పెక్టర్ ఎస్.బి. షెంగ్డె తెలిపారు.
క్వాటర్ గేట్ మసీదుకు ఎలా వెళ్లాలో దారి చూపించాలని అడిగి, ఆమెను ఓ గోడౌన్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. తెల్లవారుజాము సమయంలో ఇంటికి చేరుకున్న బాలిక తన తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 376, 363, 506ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.