
‘ఫ్యామిలీ డ్రామాతో వాటిని దాచలేరు’
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
వాస్కో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మూడొంతుల మెజారిటీ తెచ్చుకుంటామని చెప్పారు. గోవాలోని వాస్కోలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజ్ వాదీ పార్టీ పాలనకు చరమగీతం పాడేందుకు యూపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దుర్మార్గపు, అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలన్న ఉద్దేశంతో సమాజ్ వాదీ పార్టీలో ‘ఫ్యామిలీ డ్రామా’కు తెర తీశారని ఆరోపించారు.
‘అఖిలేశ్ యాదవ్ కు ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఫ్యామిలీ డ్రామాతో భూకబ్జాలు, గూండారాజ్, మాఫియా రాజ్, అవినీతిని దాచిపెట్టాలేరు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మూడొంతుల మెజారిటీతో బీజేపీ విజయం సాధిస్తుంద’ని అమిత్ షా పేర్కొన్నారు. కుంభకోణాలు, అసమర్థ పాలనతో ఉత్తరప్రదేశ్ వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు అదుపుతప్పాయని.. పేదల భూములు బలవంతంగా లాక్కున్నారని.. మహిళలకు భద్రత లేకుండా పోయిందని, రైతులు చితికి పోయారని ధ్వజమెత్తారు.