ఓసీటీఎల్ కార్మికులకు అన్యాయం చేస్తే | If OCTL unfair to workers | Sakshi
Sakshi News home page

ఓసీటీఎల్ కార్మికులకు అన్యాయం చేస్తే

Aug 20 2015 1:32 AM | Updated on Sep 3 2017 7:44 AM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ...

* ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
* మంత్రులు నాయిని, హరీశ్‌లకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ తెలంగాణ కార్మికులను రోడ్డున పడేస్తున్నారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ, విప్లవ కార్మిక సమాఖ్య (వికాస)లు ఆరోపించాయి.

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలో ఉన్న ఓసీటీఎల్ సంస్థ యాజమాన్యం మోచేతి నీళ్లు తాగి 500 మంది కార్మికుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాల కార్మిక వైఖరిని ఖండిస్తున్నామని వికాస రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ పేరుతో కరపత్రాలు వెలువడ్డాయి. ఈ కరపత్రాలను బుధవారం ‘సాక్షి’ కార్యాలయానికి పంపారు. గత 28 ఏళ్లుగా ఓసీటీఎల్‌లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.8 వేల కనీస వేతనం కూడా ఇవ్వడం లేదంటూ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలకు ఎన్నిసార్లు కార్మికులు మొరపెట్టుకున్నా వారి సమస్యలను పరిష్కరించలేదని ఆ కరప్రతంలో పేర్కొన్నారు.

ఓసీటీఎల్ యాజమాన్యంతో కుమ్మక్కయి కార్మికులకు ద్రోహం తలపెడుతున్న ఈ కార్మిక ద్రోహులను ఎండగట్టాలని పిలుపునిస్తున్నామని, కార్మికులకు అన్యాయం చేస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓసీటీఎల్ సీఎండీ కామినేని సూర్యనారాయణ, మేనేజర్ వేణుబాబు తమ పద్ధతులు మార్చుకోకపోతే కార్మిక ద్రోహులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement