16 బిలియన్ డాలర్లకు భారత్ ‘ఈ కామర్స్’!
బెంగళూరు: ఈ ఏడాది చివరకు భారత ఈ-కామర్స్ మార్కెట్ 16 బిలియన్ డాలర్లకు చేరుతుందని అసోచామ్-డెలాయిట్లు, ‘ద ఫ్యూచర్ ఆఫ్ ఈ-కామర్స్ అన్కవరింగ్ ఇనోవేషన్’ నివేదికలో పేర్కొన్నాయి. నివేదిక ప్రకారం...
2010లో 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత డిజిటల్ మార్కెట్ 2014 నాటికి 13.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2015 చివరకు 16 బిలియన్ డాలర్లను తాకనుంది. ఇంటర్నెట్ వినియోగం పెరగటం, ఆన్లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్యలో వృద్ధే దీనికి కారణం.ఈ-కామర్స్ మార్కెట్లో ఆన్లైన్ ట్రావెల్ ఖాతాల వాటా 61 శాతంగా, ఈ-టెయిలింగ్ వాటా 29 శాతంగా ఉంది.
అమెరికా, యూరప్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాలలో ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధి స్వల్పంగా ఉంది. అదే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను కలిగిన భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలలో ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధి అధికంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధి రానున్న కాలంలో 20 శాతానికిపైగా నమోదుకావచ్చు. ఈ-కామర్స్ కంపెనీలు అధిక వృద్ధి కోసం మొబైల్ ఆప్స్పై దృష్టి కేంద్రీకరించాయి. కంపెనీల ఆదాయంలో వీటి వాటా 50 శాతానికి పైగా ఉంది.