పరీక్ష రాసేందుకు వెళుతూ.. | While going to the exam | Sakshi
Sakshi News home page

పరీక్ష రాసేందుకు వెళుతూ..

Apr 1 2016 4:25 AM | Updated on Aug 30 2018 4:07 PM

వివాహమైన తర్వాత కూడా ఉన్నత చదువులు చదవాలనుకుంది. అదే తపనతో డిగ్రీలో చేరింది. గురువారం పరీక్ష రాసేందుకు భర్తతో కలసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఆమెను కబళించింది.

భర్త కళ్ల ముందే భార్య దుర్మరణం

 వికారాబాద్ రూరల్: వివాహమైన తర్వాత కూడా ఉన్నత చదువులు చదవాలనుకుంది. అదే తపనతో డిగ్రీలో చేరింది. గురువారం పరీక్ష రాసేందుకు భర్తతో కలసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఆమెను కబళించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పూడూరు మండలం కడ్మూర్‌కు చెందిన చంద్రయ్యకు మూడేళ్ల క్రితం మేడిపల్లికి చెందిన సౌందర్య(25)తో వివాహమైంది. వీరు వికారాబాద్‌లోని సాకేత్‌నగర్‌లో ఉంటున్నారు.

చంద్రయ్య మర్పల్లి మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా.. సౌందర్య పట్టణంలోని సరస్వతీ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం డిగ్రీ మొదటి సంవత్సరం చివరి పరీక్ష ఉండడంతో చంద్రయ్య ఆమెను బైక్‌పై కూర్చోబెట్టుకుని పరీక్ష కేంద్రానికి బయల్దేరాడు. మార్గమధ్యలో వికారాబాద్ వంతెనపై వేగంగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌందర్య అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రయ్యకు గాయాలయ్యాయి. వీరికి రెండేళ్ల కూతురు డింపు ఉంది. కళ్ల ముందే భార్య చనిపోవడంతో చంద్రయ్య విలపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement