తెరమీదకు స్థానిక అంశం

Vote For Local Candidates In The Elections - Sakshi

స్థానికులనే గెలిపించాలని ప్రచారం

ఇరకాటంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ

తెరమీదకు తెచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి సోయం స్వతంత్ర అభ్యర్థి అనిల్‌

బోథ్‌: బోథ్‌ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో స్థానికత తెరపైకి వచ్చింది. కొందరు అభ్యర్థులు పక్క రాష్ట్రం, పక్క జిల్లా, పక్క నియోజకవర్గం నుంచి వచ్చారని, తాము పక్కా లోకల్‌ అని కాంగ్రెస్‌ అభ్యర్థి సోయం బాపూరావ్, స్వతంత్ర అభ్యర్థి జాదవ్‌ అనిల్‌ కుమార్‌ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాథోడ్‌ బాపూరావ్, బీజేపీ అభ్యర్థి మడావి రాజులది నాన్‌లోకల్‌ కావడంతో అభ్యర్థులు స్థానికత అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. స్థానిక అభ్యర్థికి అవకాశం కల్పించాలని స్వతంత్ర అభ్యర్థి జాదవ్‌ అనిల్‌ కుమార్‌ కోరుతున్నారు. ఒక్కసారి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రచారంలో దూకుడు పెంచారు. అయితే పలు గ్రామాల్లో స్థానికుడిని గెలిపించుకోవాలని ఇప్పటికే ఆయనకు విరాళాలు అందడం ఇవ్వడంపట్ల  స్థానికత ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి నియోజకవర్గం మీద పెత్తనం చలా యించాలని చూస్తున్నారని అలాంటి వారిని ఓడించి ఇంటింకి పంపాలని కాంగ్రెస్‌ అభ్యర్థి సోయం బాపూరావు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
ముగ్గురు లోకల్‌..ముగ్గురు స్థానికేతరులు..
బోథ్‌ నియోజకవర్గానికి నామినేషన్‌ వేసిన ఆరుగురు అభ్యర్థుల్లో ముగ్గురు నియోజకవర్గానికి చెందిన వారు కాగా.. మరో ముగ్గురు బోథ్‌ నియోజకవర్గానికి చెందిన వారు కాదు. కాంగ్రెస్‌ అభ్యర్థి సోయం బాపూరావ్‌ బోథ్‌ మండలంలోని నాగుగూడ గ్రామానికి చెందిన వారు కాగా.. బీఎస్పీ అభ్యర్థి ఆడె గజేందర్‌ నేరడిగొండ మండలం బొందిడి గ్రామానికి చెందిన వారు..మరో స్వతంత్ర అభ్యర్థి జాదవ్‌ అనిల్‌కుమార్‌ కూడా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి..అయితే  తాజామాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుది ఆదిలాబాద్‌ కాగా, బీజేపీ అభ్యర్థి మడావి రాజు కూడా ఆదిలాబాద్‌ వాసి. మరోస్వతంత్ర అభ్యర్థి రాంచౌహాన్‌ది ఉట్నూర్‌..వీరు ముగ్గురు ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు కావడంతో మిగతా ముగ్గురు అభ్యర్థులు స్థానికతను తెరమీదకు తెచ్చి, ప్రచారంలో దూకుడు పెంచారు. స్థానికేతరులను ఓడించాలని వారు పిలుపునిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం..తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు, రాజకీయ నాయకులు వెళ్లిపోవాలని ఉద్యమం చేశామని, ఇప్పుడు తమ నియోజకవర్గాలపై ఇతర నియోజకవార్గాల పెత్తనం ఎలా సహిస్తామని వారు బాహాటంగానే ప్రచారంలో ప్రజలకు వివరిస్తుండడంతో ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన అభ్యర్థులకు కొంత ఇబ్బందికరంగా మారింది.   మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
 

స్థానికత ప్రభావం  ఉండబోదంటున్న నాయకులు..
ఇదిలా ఉంటే ..ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి బోథ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల అనుచరులు మాత్రం స్థానికత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోదని వాదిస్తున్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలిచిన రాథోడ్‌ బాపూరావ్‌ను ఉదాహరణగా చెబుతున్నారు. కేవలం గెలుపుకోసం మాత్రమే కొంత మంది అభ్యర్థులు స్థానికత అంశాన్ని లేవనెత్తుతున్నారని ఇది ఏ మాత్రం పని చేయదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top