ఇద్దరు ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్‌ | Two Govt Teachers Suspended In Gundala | Sakshi
Sakshi News home page

ఇద్దరు ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్‌

Dec 14 2018 10:37 AM | Updated on Dec 14 2018 10:37 AM

Two Govt Teachers Suspended In Gundala - Sakshi

గుండాల: మండలంలోని రెండు గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఐటీడీఏ పీఓ పమెల సత్పథి సస్పెన్షన్‌ వేటు వేశారు. మరో హెచ్‌ఎంతో పాటు ఒక ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. గురువారం ఆమె ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి బోధన తీరును పరిశీలించారు. తొలుత కాచనపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధనను పరిశీలించారు. పాఠశాల హెచ్‌ఎం లక్ష్మి, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించారు. చేయూత పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, డైరీ రాయించడం లేదని, చదివించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంగ్లిష్‌లో విద్యార్థులు పూర్తిగా వెనుకబడి ఉంటున్నారని అన్నారు. శంభూనిగూడెం పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రెండు పాఠశాలల హెచ్‌ఎంలు లక్ష్మి, వసంతపై సస్పెన్షన్‌ వేటు విధించారు. శంభునిగూడెం పాఠశాల ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. మామకన్ను బాలుర ఆశ్రమ పాఠశాలలోనూ పరిస్థితి బాగా లేదని తెలుసుకుని అక్కడి హెచ్‌ఎం నరేందర్‌కు కూడా షోకాజ్‌ నోటీసు అందించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement