
స్కూటీని ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్
స్కూటీని ఎదురుగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
చేవెళ్లరూరల్: స్కూటీని ఎదురుగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మిర్జాపూర్ బస్స్టేజీ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ మండలం ఎన్నేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ మీర్ పాషా(36) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ పెళ్లిళ్లు, విందు కార్యక్రమాలకు వంటలు చేస్తుం టాడు. ఆదివారం ఆయన చేవెళ్లలో ఉంటున్న తన చెల్లెలు శెభానాబేగం వద్దకు వచ్చాడు.
రాత్రి తిరుగు ప్రయాణంలో మండలంలోని మిర్జాగూడ బస్స్టేజీ సమీపంలో వికారాబాద్ వైపు నుంచి ఎదురుగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మీర్ పాషా ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్కూటీని ఢీకొట్టిన అనంతరం సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి పక్కనే ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ట్యాంకర్ ముందుభాగం ధ్వంస మైంది. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు గమనించి 108 వాహనంలో మీర్పాషాను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆయన మృతి చెందాడని నిర్ధారించారు.
మృతుడి వివరాలు తొలుత తెలియరాలేదు. ఆయన వద్ద ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబీకులకు ఫోన్ చేసిన పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మీర్పాషాకు వివాహమవగా గతంలోనే భార్య విడిపోయింది. మృతు డి తమ్ముడు ఖాజాపాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.