
కాజీపేట అర్బన్/సంగెం: పాత వరంగల్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. నిట్లోని ఓ ఉద్యోగితో పాటు అతడి భార్యకు స్వైన్ఫ్లూ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సంగెంలో ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో మరణించాడు. నిట్లోని ప్రాజెక్టు ఇంజనీరింగ్ విభాగంలో బీ గ్రేడ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సుంకరి వేణుగోపాల్ కుటుంబం అక్కడ క్వార్టర్స్లో ఉంటోంది. వేణుగోపాల్, అతని భార్య మాలతీరాణిలు జ్వరంతో బాధపడుతుండగా, వైద్యులు పరీక్షించి స్వైన్ఫ్లూగా నిర్ధారించారు. వారిని హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు.
అలాగే, వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండల కేంద్రానికి చెందిన చిట్టిమళ్ల వీరానారాయణచారి(58)కు వారం రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. హైదరాబాద్కు రక్తనమూనాలు పంపగా, స్వైన్ ఫ్లూగా నిర్ధారించారు. ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చనిపోయాడు. కాగా, బుధవారం మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లగా.. స్వైన్ఫ్లూ రోగి మృతదేహాన్ని ఎలాంటి రక్షణ లేకుండా గ్రామానికి ఎలా తీసుకొస్తారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆరోగ్య సిబ్బంది గ్రామస్తులకు మాస్క్లు అందజేశారు.