తాగునీటి కోసం విద్యార్థులు ఆందోళన చేయగా ఆగ్రహించిన హౌస్ మాస్టర్ ‘ఈ గొడవకు కారకుడివి నీవే’ అంటూ ఓ విద్యార్థిపై తన ప్రతాపం చూపాడు.
- నీళ్ల కోసం నినాదాలు చేసినందుకు ప్రతాపం
- ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు
- విద్యార్థికి ఫిట్స్ ఉందన్న ఉపాధ్యాయులు
- హౌస్ మాస్టర్ కొట్టారని చెబుతున్న తోటి విద్యార్థులు
ములుగు/ఎంజీఎం : తాగునీటి కోసం విద్యార్థులు ఆందోళన చేయగా ఆగ్రహించిన హౌస్ మాస్టర్ ‘ఈ గొడవకు కారకుడివి నీవే’ అంటూ ఓ విద్యార్థిపై తన ప్రతాపం చూపాడు. తన కోపం చల్లారేలా అతడిని చితకబాదడంతో స్పృహ తప్పిపడిపోయాడు. ఈ ఘటన ములుగు మండలం జాకారం గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత విద్యా ర్థి, తోటి విద్యార్థుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్కు చెందిన పస్తం కనకలక్ష్మి కుమారుడు సంతోష్ జాకారం గురుకులంలో ఆరో తరగతి చదువుతున్నాడు.
మంగళవారం ఉదయం 8.30 గంటలకు టిఫిన్ చేసిన అనంతరం విద్యార్థులంతా ప్లేట్లు కడుక్కోవడానికి బోరింగ్ వద్దకు వెళ్లారు. అరుుతే నీళ్లు రాకపోవడంతో నిరాశ చెందిన సంతోష్ హాస్టల్లో సౌకర్యాలు సరిగాలేవని ప్రిన్సిపాల్ డౌన్డౌన్ అని నినాదాలు చేశాడు. దీంతో తోటి విద్యార్థులు కూడా అలాగే నినాదాలు చేశారు. ఇది గమనించిన పీఈటీ విద్యార్థుల వద్దకు చేరుకొని వారించాడు. దీంతో వారు గదుల్లోకి వెళ్లిపోయూరు. అంతలో నే తలనొప్పిగా ఉందని ఉదయం 9 గంటలకు సంతోష్ హాస్టల్ డాక్టర్ హైమత్ వద్దకు వెళ్లా డు.
తిరిగి తరగతి గదికి వస్తుండగా హౌస్ మాస్టర్ వెంకట్రెడ్డి సంతోష్ను పట్టుకుని తల పై కొట్టాడు. దీంతో అతడు కిందపడిపోయా డు. ఆ తర్వాత నోట మాట రాలేదు. హాస్టల్ డాక్టర్ వచ్చి ప్రథమ చికిత్స చేశారు. ఫిట్స్గా భావించి చేతిలో తాళాలు పెట్టడంతోపాటు ముఖంపై నీళ్లు చల్లారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. గమనించిన ఉపాధ్యాయు లు అతడిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ఎంజీఎం ఆస్పత్రి తరలించారు.
కప్పిపుచ్చేందుకు యత్నం
ఈ విషయమై ఉపాధ్యాయులను వివరణ కోరగా హౌస్మాస్టర్ సంతోష్ను కొట్టలేదని, మొదటి నుంచి సంతోష్ ఆరోగ్య పరిస్థితి వింతగా ఉంటుందని ఫిట్స్ కారణంగా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఇదే విషయాన్ని తోటివిద్యార్థులను అడగగా హౌస్ మాస్టర్ కొట్టడంతోనే సంతోష్ కళ్లు తిరిగి పడిపోయాడ ని మూకుమ్మడిగా సమాధానమిచ్చారు. వారు మాట్లాడుతుండగా ఉపాధ్యాయులు వారిని వారించడం గమనార్హం.