‘మెట్రో’ రైలు సీన్‌ రివర్స్‌!

Sakshi Special Consideration On Metro Train And Rtc Services

ఆర్టీసీకి పెరిగిన ఆక్యుపెన్సీ మెట్రో జర్నీకి తగ్గిన ఆదరణ

ప్రస్తుతం సగటున మెట్రో ప్రయాణికులు 50 వేలే..

పండగలు, సెలవు రోజుల్లోనూ అంతంతే..  

స్మార్ట్‌కార్డులు, మెట్రో బైక్స్, స్మార్ట్‌ సైకిళ్లకు ఆదరణ నిల్‌

అధిక చార్జీలు, పార్కింగ్‌ ఫీజుతో విముఖత  

పొరుగు జిల్లాల నుంచి వచ్చేవారికి జాయ్‌రైడ్‌..  

సర్వీస్‌ రూట్లలో ఆర్టీసీకి పెరిగిన ఆక్యుపెన్సీ

నెలరోజుల్లో రెండు శాతం పెరిగిన ప్రయాణికులు

మెట్రో ఫీడర్‌ బస్సులకూఫుల్‌ డిమాండ్‌  

‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి..

హైటెక్‌ నగరిలో అద్భుత ఆవిష్కరణ అంటూ వచ్చిన ‘మెట్రో’ రైలు చతికిలబడుతోంది. ఈ రైళ్ల రాకతో ఆర్టీసీ ప్రయాణికులు తగ్గుతారని భావిస్తే బస్సుల్లో మాత్రం ఆక్యుపెన్సీ అమాంతం పెరిగింది. పైగా మెట్రోకు సమాంతరంగా నడిచే సిటీ బస్సుల్లో ప్రయాణికులు రెండు శాతం పెరగడం గమనార్హం. మెట్రో జర్నీ, ఈ రూట్లలో ఆర్టీసీ సర్వీసులపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో ఇది స్పష్టమైంది. గతేడాది నవంబరులో నగరంలోని రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రెండు నెలలు రోజూ లక్షల మంది వీటిలో ప్రయాణం చేయడాన్ని చూసిన అధికారులు.. ఇదే ఆదరణ ఉంటుందని భావించారు. అయితే ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. ప్రస్తుతం మెట్రోల్లో ప్రయాణికులు 50 వేలు మించడం లేదు. ఉదయం, సాయంత్రం మినహా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెట్రో స్టేషన్లు బోసిపోతున్నాయి. అధిక చార్జీలు, పార్కింగ్‌ సమస్యలతో వివిధ వర్గాలు మెట్రో జర్నీకి ‘నో’ చెబుతున్నాయి.

మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే సిటీ బస్సులకు ఆదరణ తగ్గుతున్న అంచనాలు తలకిందులయ్యాయి. రెండు కారిడార్లలో   మొత్తం 1700 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా, రోజూ 15 లక్షల మంది సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ రెండు రూట్లలో అద్భుతమైన ఆక్యుపెన్సీ నమోదైంది. నెల రోజుల్లోనే ఆక్యుపెన్సీ 66 శాతం నుంచి 68 శాతానికి పెరిగింది. మెట్రో రాకతో ఆర్టీసీ అధికారులు సైతం మేల్కొని పలుప్రాంతాలకు అదనపు బస్సులను నడపడం.. మెట్రో రూట్లోని సమీప కాలనీల నుంచి నేరుగా గమ్యస్థానాలకు బస్సులనుతిప్పున్నారు. పైగా లాంగ్‌ రూట్‌ సర్వీసులను సైతం పెంచారు. కొన్ని బస్తీలకు ఫీడర్‌ బస్సులను కూడా తిప్పుతుండడంతోఆర్టీసీకి ప్రజాదరణ మెరుగుపడింది. పైగా మెట్రో జర్నీ కంటే ఆర్టీసీ చార్జీలు తక్కువగా ఉండడంతో సగటు మధ్యతరగతి ప్రయాణికుడు సిటీబస్సుకే ‘జై’ కొడుతున్నాడు.

సాక్షి, సిటీబ్యూరో/మియాపూర్‌/ఉప్పల్‌/సికింద్రాబాద్‌ :మెట్రో కలలు కరిగిపోతున్నాయి. ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది నవంబరులో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రెండునెలలు జాయ్‌రైడ్స్‌తో సిటీజన్లు ఎంజాయ్‌ చేసినా.. ఇప్పుడు సీన్‌ రివర్సయ్యింది. నిత్యం మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య సరాసరి 50 వేలకు మించడం లేదు. ఆదివారం, ఇతర సెలవురోజుల్లో రద్దీ సుమారు 70 వేలుగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం మినహా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు  పలు మెట్రో స్టేషన్లు ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. అధిక చార్జీలు, పార్కింగ్‌ చార్జీల మోత కారణంగా వివిధ వర్గాలు మెట్రో జర్నీపై ఆసక్తి కనబర్చడంలేదు. నాగోల్‌– అమీర్‌పేట్‌ (17కి.మీ), మియాపూర్‌–అమీర్‌పేట్‌ (13కి.మీ) రెండురూట్లలో సుమారు రెండు లక్షలమంది నిత్యం ప్రయాణం చేస్తారనుకున్న అంచనాలు ఇప్పుడు తల్లకిందులవడం గమనార్హం. అంతేకాదు రోజువారీగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అల్పాదాయ, మధ్యాదాయ, అసంఘటిత రంగ కార్మికులు, వేతనజీవులు ఇప్పటికీ సింహభాగం ఆర్టీసీ బస్సులు, వ్యక్తిగత బైక్‌లనే వినియోగిస్తున్నట్లు ‘సాక్షి’ బృందం మెట్రో రూట్లలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో సుస్పష్టమైంది. వ్యక్తిగత పనులు, వివిధ శుభకార్యాల నిమిత్తం బంధుమిత్రులను చూసేందుకు ఇతర జిల్లాల నుంచి నగరానికి వస్తున్న వారు చాలా మంది మెట్రోలో జాయ్‌రైడ్స్‌ చేస్తుండడం గమనార్హం.

మెట్రో జర్నీ విముఖతకు కారణాలివే..

నగరంలో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, మార్కెటింగ్‌రంగం, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, చిరుద్యోగులు అధిక మెట్రో చార్జీలు, పార్కింగ్‌ ఫీజులు తడిసి మోపడవుతున్న కారణంగా మెట్రో జర్నీకి వెనుకంజ వేస్తున్నారు. మెట్రోలో కనీసం రూ.10,గరిష్టంగా రూ.60 టికెట్‌ చార్జీలు వసూలు చేస్తున్న విషయం విదితమే.  
ప్రధానంగా రూ.25 వేలలోపు ఆర్జిస్తున్న వేతనజీవులు, కార్మికులు వ్యక్తిగత వాహనాలను వినియోగించడంతోపాటు, ఆర్టీసీ బస్సుల్లో నెలవారీ పాస్‌లతోనే రాకపోకలు సాగిస్తున్నారు.
మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆర్టీసీ మినీ బస్సులు అందుబాటులో లేకపోవడం, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ కల్పించడంలో ప్రభుత్వం, మెట్రో అధికారులు విఫలమవడం శాపంగా పరిణమిస్తోంది.
ఉదాహరణకు మియాపూర్‌ నుంచి ఉప్పల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో  చార్జీ రూ.30 అవుతోంది. అదే మెట్రో రైల్‌లో రూ.80 చార్జీ అవుతోంది. బస్సు కంటే రూ.50 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు అంటున్నారు.  
ఇక నలుగురు సభ్యులున్న కుటుంబం ఉప్పల్‌ నుంచి ప్యారడైజ్‌ వరకు వెళ్లేందుకు.. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లి అక్కడ తమ కారు పార్కింగ్‌ చేసి.. ఆ తర్వాత మెట్రోలో జర్నీ చేసి.. షాపింగ్‌ పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వస్తే ఖర్చు రూ.300కుపైమాటే. అదే క్యాబ్‌లో ఇంటి నుంచి నేరుగా షాపింగ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటే ఖర్చు రూ.200 మాత్రమే. దీంతో చాలామంది కుటుంబ సమేతంగా క్యాబ్‌ జర్నీ వైపే మొగ్గు చూపుతుండడం గమనార్హం.
ఇక శని, ఆదివారాలు, ఇతర సెలవురోజుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇతర జిల్లాల నుంచి నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రయాణికులు మెట్రో రైళ్లలో జాయ్‌రైడ్స్‌ చేసి ఆనందిస్తున్నారు.  

వామ్మో మెట్రో పార్కింగ్‌..!
రెండు రూట్లలో 17 పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటుచేశారు. పలు పార్కింగ్‌ స్థలాలు ప్రధాన రహదారికి ఆనుకొనే ఉన్నాయి. ఇక్కడ వాహనాలను సురక్షితంగా నిలుపుకొనేందుకు ఎలాంటి షెడ్‌లు ఏర్పాటు చేయలేదు.  దీంతో వాహనాలను ఎండలోనే పార్కింగ్‌ చేయాల్సి వస్తోందని. దీంతో వాహనాలు దుమ్ముకొట్టుకుపోవడంతోపాటు అందులోని ఇంధనం ఎండకు ఆవిరవుతోందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇక పార్కింగ్‌ రుసుము  బైక్‌కు  రెండు గంటలకు రూ.5, అదనంగా మరో గంటకు రూ.2 చెల్లించాల్సి వస్తోంది. సుమారు 8 గంటలు బైక్‌ పార్కింగ్‌ చేస్తే ఖర్చు రూ.17 తథ్యం. డెయిలీ పాస్‌ ద్వారా ఏడు గంటలకు రూ.15, మంత్లీ పాస్‌ తీసుకుంటే రూ.250 చెల్లించాల్సి ఉంది. కారుకు రెండు గంటలకు రూ.12, అదనంగా ప్రతీ గంటకు రూ.6 చెల్లించాల్సి వస్తోంది. డెయిలీ కార్‌ పాస్‌ అయితే ఏడు గంటలకు రూ.40, మంత్లీ పాస్‌ అయితే నెలకు రూ.750 చొప్పున పార్కింగ్‌ రుసుము బాదేస్తుండడం గమనార్హం.

స్మార్ట్‌కార్డులకుగిరాకీ నామమాత్రమే..
మెట్రో జర్నీని సులభతరం చేసేందుకు జారీ చేసిన నెబ్యులా స్మార్ట్‌కార్డులు ఇప్పటివరకు 2.50 లక్షలు విక్రయించారు. ఇందులో నెలవారీగా రీచార్జీ అవుతున్నవి రూ.30 వేలకు మించి లేకపోవడం గమనార్హం. ఈ కార్డులు కేవలం మెట్రో జర్నీకే పరిమితం కావడం, ఇతర సేవలు పొందేందుకు ప్రస్తుతానికి అవకాశం లేకపోవడంతో ఈ కార్డులను పలువురు ప్రయాణికులు ఇళ్లలో అలంకార ప్రాయంగానే వీటిని పెట్టినట్లు తెలుస్తోంది.

స్మార్ట్‌ సైకిళ్లకుఆదరణ అంతంతే..  
మియాపూర్, జేఎన్టీయూ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌లతోపాటు మియాపూర్‌ ఎక్స్‌ రోడ్డు, సైబర్‌ టవర్స్,  జేఎన్టీయూ యూనివర్సిటీ గేటు దగ్గర స్మార్ట్‌ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడు స్టేషన్లలో 75 స్మార్ట్‌ సైకిళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని రోజువారీగా వినియోగిస్తున్నవారు 400కు మించకపోవడం గమనార్హం. ఈ సైకిళ్లను వినియోగించాలనుకున్నవారు మొదటగా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి స్మార్ట్‌ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. సైకిల్‌ వినియోగించే వారు రూ. 500 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఆధార్‌ కార్డు, డెబిట్, క్రెడిట్‌ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్‌ మొబైల్‌ యాప్‌లోకి వెళ్లి సైకిల్‌ వెనక ఉండే ఆన్‌ బోర్డు కంప్యూటర్‌పై చూపిస్తే కోడ్‌ వస్తోంది. దానిని అక్కడ నమోదు చేస్తే సైకిల్‌కు ఉన్న తాళం తెరుచుకుంటుంది. మెట్రో కార్డు ద్వారా కూడా  ఈ సిస్టమ్‌ పనిచేస్తోంది. ఒక స్టేషన్‌లో తీసుకొని మరో స్టేషన్‌లో  అమర్చే వరకు తిరిగే సమయాన్ని లెక్కిస్తోంది. రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే మొదటి అర గంట ప్రతిరోజు ఉచితం. ఆ తర్వాత అరగంట నుంచి రూ.10 అద్దె చెల్లించాల్సిందే. ఇక వారం రోజుల పాటు పాస్‌ తీసుకుంటే రూ.199, నెలకు రూ.399, ఆరు నెలలకు రూ.1199, ఏడాదికి రూ.1999 చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, పాస్‌ లేకపోతే  మొదటి అరగంటకు కూడా అద్దె చెల్లించాల్సి  ఉంటుంది.

స్మార్ట్‌ బైక్స్‌దీ అదే దారి..  
మెట్రో బైక్స్‌ సంస్థ రూపొందించిన మెట్రో బైక్స్‌ను వినియోగించడానికి మొబైల్‌లో మెట్రో యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకొని బైక్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చు. లేదా   ఠీఠీఠీ. ఝ్ఛ్టటౌbజీజ్ఛుట. జీn వైబ్‌ సైట్‌ ద్వారా బైక్‌లను పొందవచ్చు. ప్రయాణికులు బైక్‌ను పొందేందుకు ఆధార్‌ కార్డు, లైసెన్స్‌ అవసరమవుతాయి. 18ఏళ్లు నిండిన వారికి బైక్స్‌ను వినియోగించడానికి అవకాశం ఉంది.   మియాపూర్, నాగోల్, గచ్చిబౌలి ప్రాంతాల్లో 20 మెట్రో  బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిత్యం వినియోగిస్తున్నవారు 250కి మించి లేకపోవడం గమనార్హం. వీటి వినియోగానికి కిలో మీటరుకు రూ.4 చొప్పున బైక్స్‌ అద్దెకు ఇస్తున్నారు. ఒక్క రోజు అద్దె రూ.300, వారం రోజులకు రూ.1500, నెలకు రూ.4,500 చెల్లించాలి. వారం, నెల పాస్‌ తీసుకున్నవారు బైక్‌లో పెట్రోల్‌ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. జీపీఎస్‌ పద్ధతి ద్వారా ఎక్కడ ఉందో ఎంత దూరం ప్రయాణించిందో తెలుసుకోవచ్చు. 

తగ్గని ఆదరణ మెట్రో రూట్లలో ఆర్టీసీకి

సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజారవాణా వ్యవస్థలో గ్రేటర్‌ ఆర్టీసీ స్థానం చెక్కుచెదరలేదు. లక్షలాది మంది ప్రయాణికులతో సిటీ బస్సులు పరుగులు తీస్తూనే ఉన్నాయి. మెట్రో రైళ్లు  అందుబాటులోకి వస్తే సిటీ బస్సులకు ఆదరణ తగ్గుతుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. రెండు కారిడార్‌లలో మొత్తం 1,700 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా, నిత్యం 15 లక్షల  మంది ప్రయాణికులు సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ రెండు రూట్లలో 68  శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు ఆర్టీసీ  గ్రేటర్‌  హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  పురుషోత్తమ్‌ ‘సాక్షి’తో చెప్పారు. నెల రోజుల్లోనే  2 శాతం ఆక్యుపెన్సీ అదనంగా నమోదై  66 శాతం నుంచి 68 శాతానికి పెరిగింది. అన్ని వేళల్లో  ప్రయాణికులకు సిటీ బస్సులు అందుబాటులో ఉండడం, సమీప కాలనీల నుంచి నేరుగా గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే సదుపాయం ఉండడం ఆర్టీసీకి బాగా కలిసివచ్చింది. మరోవైపు విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన లక్షలాది మంది బస్సుపాస్‌ వినియోగదారులు సిటీ బస్సులపైనే ఆధారపడి  ఉన్నారు. ఎల్‌బీనగర్‌ నుంచి నేరుగా మియాపూర్, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికులకు మెట్రో రైళ్ల కంటే సిటీ బస్సులే ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. పైగా పేద, అల్పాదాయ వర్గాలకుఅనుకూలంగా ఉన్న  ఆర్టీసీ  చార్జీలు కూడా  ఇందుకు మరో కారణం.

 అంచనాలు తారుమారు..
మెట్రో రాకతో సిటీ బస్సులపై ప్రభావం పడొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు  లాంగ్‌ రూట్‌ బస్సులపై ప్రధానంగా దృష్టి సారించారు. హయత్‌నగర్‌ నుంచి నేరుగా కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, సికింద్రాబాద్, జూబ్లీబస్‌స్టేషన్‌ వంటి దూరప్రాంతాల బస్సుల రాకపోకలపై  అధ్యయనం చేశారు. ఉప్పల్‌– సికింద్రాబాద్, తార్నాక– సికింద్రాబాద్, మియాపూర్‌– కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌– అమీర్‌పేట్‌– మియాపూర్‌ తదితర మార్గాల్లోనూ ప్రయాణికుల రద్దీని గమనించారు. మెట్రో రైళ్లు ప్రారంభించిన తొలి  నెలరోజుల పాటు ఆర్టీసీ ఆక్యుపెన్సీ స్వల్పంగా తగ్గినప్పటికీ తక్కువ వ్యవధిలోనే తిరిగి పుంజుకుంది. నాగోల్‌ నుంచి  సికింద్రాబాద్‌ వరకు 740  బస్సులు, అమీర్‌పేట్‌ నుంచి మియాపూర్‌ వరకు 960 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో రాకకు ముందు నుంచి కూడా రెండు రూట్లలో మొత్తం 1,700 బస్సులు ప్రతిరోజు 8 వేల ట్రిప్పులకుపైగా తిరుగుతున్నాయి. సుమారు 15 లక్షల మంది ప్రయాణికులు ఈ రెండు రూట్లలో ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. నాగోల్‌ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులు చాలా వరకు నాగోల్‌ చౌరస్తా నుంచే కాకుండా సమీపంలోని కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ, జైపురి కాలనీ, తట్టిఅన్నారం ప్రాంతాల నుంచి నేరుగా బయలుదేరడంతో ప్రయాణికులు ఇంటి నుంచి నేరుగా వెళ్లేందుకు అవకాశం లభిస్తోంది. అలాగే  మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గంలోనూ వందలాది కాలనీలకు నేరుగా సిటీ బస్సు సదుపాయం ఉంది.

ఫీడర్‌ రూట్లలో 85 బస్సులు..
మరోవైపు మెట్రో కారిడార్‌లకు రెండు వైపుల కాలనీల నుంచి ప్రయాణికులకు మెట్రో స్టేషన్లకు  చేరవేసేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఫీడర్‌ బస్సులు కూడా పెరిగాయి. గతంలో రెండు మార్గాల్లో  75 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని 85కు పెంచారు. మియాపూర్, జేఎన్టీయూ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ, ఐటీ కారిడార్‌లు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి ప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో బస్సుల సంఖ్య పెంచినట్లు  అధికారులు తెలిపారు. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తిరిగి క్యాబ్‌లు, ఆటోల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top