ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలి
కాల్చి చంపుతూ ఎన్కౌంటర్లుగా చిత్రీకరణ
ఆదివాసీల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఎన్కౌంటర్లు, రాజ్యాహింస లేని తెలంగాణ కావాలని కోరుకున్నామని, కానీ తెలంగాణ వచ్చాక శృతి, సాగర్ నుంచి మొదలుకొని రక్తపుటేరులు పారుతున్నాయని పలువురు వ్యక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర నాయకులు కోట శ్రీనివాస్, పౌర హక్కుల సంఘం కార్యదర్శి ఎన్.నారాయణ రావు, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, టఫ్ అధ్యక్షురాలు విమలక్క పాల్గొని ప్రసంగించారు. కోట శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టుకొని కాల్చి చంపుతూ ఎన్కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ఉద్యమాన్ని అణివేస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
వీరస్వామి, రఘు, లింగన్న మృతికి కారకులైన వారిపై 302 కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నారాయణరావు మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజలు జీవించే హక్కును కాలరాస్తున్నారన్నారు. సంధ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకు హింస పెరిగిపోతోందని విమర్శించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాసారని పేర్కొన్నారు. విమలక్క మాట్లాడుతూ కాల్పుల మోతలతో తెలంగాణ పల్లెలు తెల్లవారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నాయకులు చిక్కుడు ప్రభాకర్, టీపీఎఫ్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ, పీకేఎం నాయకులు జాన్, బల్ల రవీంద్రనాథ్, కోటి, కంచర్ల బద్రి, ముజాహిద్ హస్మి, సనావుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.