రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి విమర్శించారు. రంజాన్ పర్వదినంగా
హుజూర్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి విమర్శించారు. రంజాన్ పర్వదినంగా సందర్భంగా శనివారం పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే విద్యా, ఉద్యోగాల్లో ముస్లిం యువతకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ 15 నెలలు గడిచినా ఆ హామీ అమలు ప్రస్తావనే లేదని విమర్శించారు. అన్యాక్రాంతమైన వక్ఫ్బోర్డు భూములను కాపాడుతామని చెప్పినా ఎకరం భూమిని కూడా వెనక్కి తీసుకోలేదన్నారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలిస్తామని చెప్పి మాట దాటవేశారన్నారు.
ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలయ్యేందుకు శాసనసభలో, బయట ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో ముస్లింల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తోంది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులను ముస్లింలకు కట్టబెట్టి వారిని గౌరవించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. సమావేశంలో నగర పంచాయితీ చైర్మన్ జక్కుల వెంకయ్యు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు యరగాని నాగన్నగౌడ్, ఎంపీపీ గొట్టె ముక్కల నిర్మల, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్రావు, చక్కెర వీరారెడ్డి, దొంతగాని శ్రీనివాస్గౌడ్, చిట్యాల అమర్నాథరెడ్డి, బాచిమంచి గిరిబాబు, దేవరం గడ్డిరెడ్డి, సుతారి వేణుగోపాల్, ఉస్తేల గురవారెడ్డి, కుందూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.