
'అడ్డు తగిలిన తీరు దుర్మార్గం'
తెలంగాణ ఉభయసభల్లో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు.
హైదరాబాద్: తెలంగాణ ఉభయసభల్లో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్దంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు వైఖరిని తెలంగాణ సమాజం అవమానంగా భావిస్తోందన్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన తీరు చాలా దుర్మార్గమన్నారు. జాతీయ గీతాన్ని అవమానపరిచిన వారు చట్టసభ సభ్యులుగా అనర్హులని అన్నారు.
పార్టీ ఫిరాయింపులపై టీడీపీ సభ్యులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఏపీలో ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, రుద్రరాజు పద్మరాజు తదితరులను టీడీపీ చేర్చుకున్నారని... ఇది నైతికం అయినప్పుడు, తమదెట్లా అనైతికమవుతుందని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.